పరాకాష్టకు చేరిన వైసీపీ నేతల రౌడీయిజం

-అమరావతి దళిత జేఏసీ నేత పులి చిన్నాపై వైసీపీ దాడి దుర్మార్గం
-వైసీపీ అరాచకాలు ఇన్నాళ్లు భరించాం ఇక నుంచి సహించం
-చట్ట వ్యతిరేకంగా పనిచేసిన పోలీసుల్ని చట్టపరంగా శిక్షించే వరకు వదలిపెట్టం
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో వైసీపీ అరాచాకాలు పరాకాష్టకు చేరాయని, ఇన్నాళ్లు మౌనంగా భరించామని ఇక నుంచి సహించబోమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ఎంపీ నందింగం సురేష్ అనుచరుల దాడిలో గాయపడి ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి దళిత జేఏసీ నాయకుడు పులి చిన్నాను చంద్రబాబు పరామర్శించారు.
ఈ సంధర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలపై వీరోచితంగా పోరాడుతున్న అమరావతి దళిత జేఏసీ నేత పులి చిన్నాపై కక్ష్య కట్టి వైసీపీ కార్యకర్తలు అతిదారుణంగా దాడి చేశారు. రాష్ర్టంలో వైసీపీ రౌడీయిజం పరాకాష్టకు చేరింది. చిన్నాపై దాడి చేయటమే కాక తిరిగి అతనిపై అక్రమంగా ఎదురు కేసులు పెట్టారు. పులి చిన్నాపై దాడి చేసిన వారిపై బెయిలబుల్ సెక్షన్లు పెట్టి చిన్నాపై నాన్ బెయిలబబుల్ సెక్షన్లు పెట్టడం దుర్మార్గం. ఈ దాడులన్నింటికి ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలి. రాష్ట్రంలో నేరాలు ఘోరాలు నిత్యకృత్యంగా వైసీపీ పాలన సాగుతోంది. ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోక తప్పదు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, అధికార పార్టీ నాయకులు తప్పు చేసినా, ప్రతిపక్ష పార్టీలు తప్పు చేసినా అందర్నీ సమానంగా దండించాలి. అంతే తప్ప అధికారపార్టీకి కొమ్ము కాస్తు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.
పోలీసులు చట్టం ప్రకారం పనిచేయకుండా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే.. చట్టం పరంగా శిక్షించే వరకు వదలి పెట్టం. వైసీపీ నాయకులు కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. టీడీపీ అధికారంలోకి వస్తే మీరేమైనా ఆకాశంలో ఉండరు, రాష్ర్టంలోనే ఉంటారు, తప్పు చేసిన ఎవ్వర్నీ వదలం. మీ బెదిరింపులకు భయపడం ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తాం. 22 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంది, మేం కూడా ఇలానే వ్యవహవరిస్తే ఇప్పుడు వైసీపీకి ఒక్క కార్యకర్త కూడా ఉండేవారు కాదు. టీడీపీ నాయకులపై దాడులు చేస్తే భయపడతారని అనుకుంటున్నారేమో మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరు టీడీపీలో లేరు.
‎ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఉన్న మా ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే రౌడీలను తీసుకుని వచ్చారు. ఇక్కడకి ఎందుకు వచ్చారని ప్రశ్నించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయటమేకాక అక్రమ కేసులు పెట్టారు. దాడి చేసిన వారిపై బెయిలబుల్ సెక్షన్లు పెట్టి బాధితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు.
దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నాయకులపైనా అక్రమ కేసులు పెట్టారు. పోలీసులు ఉంది ప్రజల ప్రాణ,మాణాలు, ఆస్తులు పరిరిక్షంచడానికి తప్ప ఏకపక్షంగా వ్యవహరించడానికి కాదు. ఇంత అరాచక పాలన ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో చట్టాలను ఎప్పుడు ఉల్లంఘించలేదు. నీతి, నిజాయతీలతో రాజకీయాలు చేసి ప్రజలకు సేవ చేశా. తిరుపతిలో బాంబులు పెట్టినా భయపడలేదు,ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు కోసం పనిచేశాం. వైసీపీ ప్రభుత్వం ఇన్నాళ్లు మా నాయకుల్ని, కార్యకర్తల్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టినా మౌనంగా భరించాం. ఇక నుంచి సహించబోమని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Leave a Reply