ఆంధ్రాకు ఉన్న 900 కి.మీ తీరంతోనే అంతా సాధించవచ్చనుకున్న చంద్రబాబు!

– పొంతనలేని అంశాలకు ముడిపెట్టి జనాన్ని అయోమయంలోకి నెడుతున్న ఏపీ ‘మాజీ సీఈఓ’
(ఎంపి విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)

‘రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో 900 కిలోమీటర్ల తీరం ఉంది,’ ఇవీ నిన్న శ్రీకాకుళం జిల్లా రాజాం సభలో మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు. 2014లో ఉమ్మడి ఏపీ నుంచి విడదీసి తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు టీడీపీ అధినేతకు ఉన్న అవగాహన ఇది.

దివంగత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి తర్వాత ఆయన కన్నా ఎక్కువ కాలం ఉమ్మడి ఏపీని పరిపాలించిన తెలుగుదేశం అధ్యక్షుడు ఇలా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ అప్పటికి పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో అన్ని విధాలా అభివృద్ధి చెందిన మాట నిజమే గాని నవ్యాంధ్ర ప్రదేశ్‌ కు కేవలం 900 కి.మీ సముద్రతీరం మాత్రమే ఉందన్న చంద్రబాబు గారి ‘ఆర్థిక చైతన్యం’ ప్రఖ్యాత ఆర్థికవేత్తలను సైతం దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయరంగంలో సర్వతోముఖాభివృద్ధి సాంధించిన రాష్ట్రమని అందరికీ తెలుసు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, శ్రీసిటీ, కర్నూలు, కడప, అనంతపురం, ఇంకా అనేక నగరాలు, పెద్ద పట్టణాలు కూడా పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ పరిశ్రమలకు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రమని వేరే చెప్పాల్సిన పనిలేదు. మరి ఇన్ని అవకాశాలు పెట్టుకుని చంద్రబాబు కేవలం సుదీర్ఘ తీరంపైనే ఏపీ భవిత్వం ఆధారపడి ఉందని ఎనిమిదిన్నరేళ్ల క్రితం ఆలోచించారంటే ఏమనుకోవాలి?

బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న తీర ప్రాంతంలో కొత్తగా పోర్టులు నిర్మిస్తే…తెలుగోళ్లు ప్రపంచమంతా వ్యాపారం చేసుకోవచ్చు అని ఆయన భావించారట. రాజాంలో ఆయన ఈ విషయం కూడా వెల్లడించారు. ‘గ్లోబల్‌ లీడర్‌’ అని అంతర్జాతీయ మీడియా నుంచి ‘ప్రశంసలు, పొగడ్తలు’ అందుకున్న నారా వారు ఇలాంటి అంచనాలు వేశారంటే…సైజు గణనీయంగా తగ్గిన కొత్త రాష్ట్రం ఏపీలో పరిపాలనపై, దాని అభివృద్ధిపై ఆయనకు ఉన్న అవగాహనరాహిత్యం ఎంతో మనకు అర్ధమౌతోంది.

కొత్త రాష్ట్రంలో వస్తూత్పత్తి పరిశ్రమలు, సేవారంగం, ఆగ్రో ఇండస్ట్రీస్‌ వంటివి అనేకం ఏర్పాటు చేయకుండా కొత్త పోర్టుల ద్వారా విదేశాలతో వ్యాపారం పెంచేయాలని ఈ మాజీ ముఖ్యమంత్రి భావించడం కూడా ఆర్థికరంగ నిపుణులను గందరగోళపరిచేలా ఉంది. హైదారాబాద్‌ వంటి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన నగరాన్ని కొద్దిగా విస్తరించి తానే ఉమ్మడి రాజధాని దేశంలోనే నంబర్‌ 1 స్థానానికి వెళ్లడానికి కారకుడయ్యానని ఇంకా గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఉన్న పెద్ద నగరం విశాఖపట్నాన్ని రాజధానిగా చేయలేదు.

పంటపొలాలున్న కృష్ణా నదీతీర ప్రాంతంలోని కొన్ని గ్రామాలను అమరావతి పేరుతో ఎలా రాజధానిగా చేయాలనుకున్నారో ఇప్పటికీ ప్రపంచ మేధావులకే అర్థంకాని విషయం. ఏపీలో సీనియర్‌ మోస్ట్‌ రాజకీయ నాయకుల్లో ముందు వరుసలో ఉన్న ఆయన ఇలా పొంతనలేని అంశాలకు లంకె పెట్టి మాట్లాడితే ప్రజలు భయకంపితులవుతారు.

Leave a Reply