రేవంత్ రెడ్డి.. ఈ అధికారం మీకు శాశ్వతం కాదు
– రైతులు ఏడుస్తున్నారు.. గ్రామాల్లో విషాదం ఉంది
– తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోండి
– ఈ అధికారం శాశ్వతం కాదు.. నేలను మీదకు దిగివచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించండి
– అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ఎన్నికలు పక్కన పెట్టి సహాయక చర్యల్లో పాల్గొనాలి
– మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్
మేడ్చల్ మల్కాజిగిరి: 35 శాతం అధిక వర్షపాతంతో రైతులు అపారంగా నష్టపోయారు. పత్తిచేలు జాలు పట్టాయి, మక్క వరి పంటలు ఎదగలేదు. ముంథా తుఫానుతో ఆంధ్రతో పాటు తెలంగాణ రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. గత వర్షాలకే రోడ్లు కోతకు గురయ్యి ఇంకా బాగు కాలేదు. కోత కోసి పెట్టిన మక్క, వరి కొట్టుకుపోయాయి, మొలకలు వచ్చాయి, బూజు పట్టాయి. పత్తి చెట్టుమీదనే రాలిపోయింది. చేతికి రావాల్సిన పంట నీళ్ళపాలయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో లక్షల ఎకరాలలో పంట అక్కరకు రాకుండా పోయింది. కార్లు కొట్టుకు పోయాయి మనుషులు కొట్టుకుపోయి భయానక వాతావరణం ఉంది.
భీమదేవరపల్లి మండలంలో 41 cm వర్షం పడింది అంటే ఎంత విధ్వంసం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు వరంగల్ సగం పట్నం 6 ఫీట్ల నీళ్లలో ఉంది. రైతులు ఏడుస్తున్నారు. గ్రామాల్లో విషాదం ఉంది. సీఎం గారిని డిమాండ్ చేస్తున్న.. పంట, ఇళ్ల నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలి.
రైతులను ఓదార్చాలి. నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం అందించాలి. ఇంట్లో ఉన్న సామాను కూడా కొట్టుకు పోయింది. వారికి తక్షణమే సహాయం అందించాలి. అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ఎన్నికలు పక్కన పెట్టి సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పదివేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి. BRS రెండేళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. వీళ్లు రెండేళ్ళ నుండి ఇవ్వడం లేదు. పదివేల కోట్ల రూపాయలు బకాయి పడింది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు అని కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తున్నారు.
డబ్బులు కట్టలేని పేద విద్యార్థులు.. పై చదువులకు పోలేక, ఉద్యోగాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక సార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినడం లేదు. దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది. భూములు అమ్మిన వేల కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థులకు ఇవ్వడానికి మాత్రం చేతులు రావడం లేదు.
డబ్బులు అడిగితే కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేయించి వారిని దొంగల లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎదురు దాడి చేసి చిన్న కాలేజీల మీద ఉక్కుపాదం పెడుతున్నారు. ఇవాళ ఇబ్బంది పెట్టవచ్చు కానీ నువ్వు తప్పించుకోలేవు.
ఇది లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సంబంధించిన విషయం అని మర్చిపోవద్దు. బెదిరింపులు పక్కనపెట్టి సానుకూలంగా స్పందించి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను.
గ్రామపంచాయతీలో పనులు చేసిన వార్డు మెంబర్లకు సర్పంచులకు బిల్లులు రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దసరాకు చెల్లిస్తామని ఇప్పటివరకు చెల్లించలేదు. ఇంత భయంకరమైన, దరిద్రపు పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోనలేదు. మంత్రుల మధ్య ఉన్న వైరుధ్యాలు, కొట్లాటలు, పంపకాలు, దందాలతో సరిపోతుంది తప్ప ప్రజలను పట్టించుకునే పాపాన పోవడం లేదు. ముఖ్యమంత్రిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. మీ అంతర్గత కుమ్ములాటలు పక్కనపెట్టి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరుతున్నాను.
ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోవచ్చు కానీ సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతా రు. కెసిఆర్ కి అదే చేశారు. కెసిఆర్ కూడా ఇలానే అందర్నీ వారి శక్తి ఎంత, కథ ఎంత అని సప్రస్ చేసే ప్రయత్నం చేశారు. వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన కూడా కేసీఆర్ పార్టీని ప్రజలు ఎలా బొంద పెట్టారో చూసాము.
రేవంత్ రెడ్డి ఈ అధికారం మీకు శాశ్వతం కాదు. మీకు అధికారం ఇచ్చింది ప్రజల మీద దాడులు చేయించడానికి, దోచుకోవడానికి కాదు. వెంటనే భూమి మీదకు వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను.