మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధువులు, పార్టీ నేతలకు.. అధికారం ఆయుధంగా, చట్టం చుట్టంగా మారిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు.కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ రెడ్డి బంధువు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి..తమ పార్టికే చెందిన కార్యకర్త ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేశారన్నారు.
ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా దీనిపై నిలదీసినందుకు..ఎన్కౌంటర్ చేస్తామని మైదుకూరు సీఐ కొండారెడ్డి బెదిరించే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. సీఎం సొంత జిల్లా, సొంత పార్టీ కార్యకర్త బాషాయే వైసీపీ నేతల అరాచకాలకు తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని రోధిస్తున్నారనన్నారు.
ఇటీవల కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం సాధారణమైందని చెప్పారు. తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సీఐ.. అక్బర్ను స్టేషన్లో కూర్చోబెట్టి, అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారని ఆరోపించారు.
న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే.. సామాన్యుడికి ఇక దిక్కెవరని ప్రశ్నించారు. గతంలో నంద్యాలలో సలీం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు అక్బర్ కుటుంబం కూడా.. తాము ఆత్మహత్య చేసుకుంటామని చెబుతున్నారని తెలిపారు.
పోలీసు వ్యవస్థని జగన్రెడ్డి.. ఫ్యాక్షన్ సైన్యంగా మార్చుకుంటున్నారని రాజప్ప ధ్వజమెత్తారు. పోలీసుల్లో మార్పు రావాలని, రక్షణ ఇవ్వాల్సిన చోట రక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వం వెంటనే అక్బర్ కుటుంబానికి న్యాయం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజప్ప డిమాండ్ చేశారు.