హైదరాబాద్: గత 19 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆ కుటుంబం లో సంతోషం నింపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
వరంగల్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి.భీమ్ సింగ్ సర్వీస్ లో ఉండగా 24.09.1996లో ఎన్ కౌంటర్ లో మరణించారు. తండ్రి మరణం నేపథ్యంలో కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు బి. రాజ శ్రీ దరఖాస్తు చేసుకున్నారు.
అయితే వివిధ సాంకేతిక కారణాలు చూపిస్తు గత ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి. రాజ శ్రీ అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఝప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే రాజ శ్రీ సమస్యను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిబంధనలు సడలించైనా సరే ఉద్యోగం ఇవ్వాలని సీఎంవో అధికారులకు సూచించారు.
ఈ నేపథ్యంలో హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ శ్రీ తన కుటుంబంతో కలిసి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు.