Suryaa.co.in

Telangana

కేసీఆర్, కేటీఆర్ గుండు పగలగొట్టడమే మిగిలింది

-రైతులకు రుణమాఫీ చేయొద్దా?
-బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో ఒప్పందం
-బీజేపీతో వైరం ఉంటే మల్లారెడ్డిని సస్పెండ్ చేయాలి
-రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్. 1978లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. బీపీ మండల్ కమిషన్ బీసీలకు 27శాతం ఇవ్వాలని సూచించింది. ఆనాడు ఆరెస్సెస్ అనుకూల వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు కూడా మండల్ కమిషన్ నివేదికను సమర్ధించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా అమలు చేయాలని తెలిపింది.

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ గాంధీకి ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. బీసీ కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కుల గణన ఎక్స్ రే లాంటిదని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. మోదీ, అమిత్ షా లకు ఆదానీ, అంబానీ తోడయ్యారు. 2025లోగా రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తున్నారు.

రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి దేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలనే ఆలోచనతో దాడి చేస్తున్నారు.దేశ మూలవాసులైన దళితులపై,గిరిజనులపై, ఓబీసీలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నరు.ఈ ఎన్నికల క్షేత్రంలో సర్జికల్ స్టైక్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితులవైపు వేగంగా ప్రయాణిస్తుంది. కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పై మోదీ, అమిత్ షా విష ప్రచారం చేస్తున్నారు.

తాళి పుస్తెలు అమ్మేస్తారంటూ విచక్షణారహిత ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఎవరి కష్టార్జితం వాళ్లదే.. ఎవరి సంపాదన వారిదే. భార్య ఆస్తిని కూడా అనుమతి లేకుండా భర్త తీసుకోవడానికి హక్కు లేదని న్యాయస్థానాలు చెబుతున్నాయి. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని వికృత రాజకీయ క్రీడకు తెర లేపారు.

ఆరెస్సెస్ మనువాద సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేయాలని చూస్తోంది. రిజర్వేషన్ రహిత దేశంగా మార్చడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. రిజర్వేషన్లు రద్దు చేసి హిందూ సమాజాన్ని ఒకటిగా చూపాలని ఆరెస్సెస్ ప్రణాళికలు వేసింది. అరెస్సెస్ ప్రణాళికను బీజేపీ అమలు చేస్తోంది.

ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్, యూనిఫామ్ సివిల్ కోడ్, సిటిజన్ అమెండమెంట్ యాక్ట్ విషయంలో గత పది నెలలుగా ఆరెస్సెస్ విధానాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు. రిజర్వేషన్లు రద్దు చేసి దళితులు, గిరిజనులు, ఓబీసీలను కార్పొరేట్ల ముందు కట్టు బానిసలుగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీలా బీజేపీ వ్యవహరిస్తోంది.

బీసీ జనగణన చారిత్రక అవసరం. జనాభా లెక్కిస్తే దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే వీలుంటుంది. రిజర్వేషన్లు రద్దు చేయం అని, రిజర్వేషన్లు పెంచుతామని మోదీ, అమిత్ షా ఎక్కడా మాట్లాడటం లేదు. మా ఆరోపణలపై ఎక్కడా స్పందించడంలేదు. బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రమే కాదు. లెఫ్ట్ భావజాలం అని చెప్పుకునే ఈటెల కూడా ఈ విషయంపై ఎందుకు మాట్లాడటంలేదు? వాళ్ల పార్టీ విధానమేంటో వారికి స్పష్టంగా తెలుసు.. అందుకే వారు మాట్లాడటంలేదు.

తప్పించుకోవాలన్న ఆలోచనే తప్ప.. ఇది తప్పని అమిత్ షా, మోదీతో చెప్పిస్తామని ఎందుకు చెప్పడంలేదు? కేసీఆర్ అసలు ఈ విషయాన్నే ప్రస్తావించడంలేదు? అమెరికా నుంచి అమలాపురం వరకు.. చంద్ర మండలం నుంచి చింతమడక వరకు కేసీఆర్ అన్నీ మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేసే కుట్ర గురించి మాత్రం మాట్లాడటంలేదు.. ప్రశ్నించడంలేదు. గతంలోనే కేసీఆర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్చేయాలన్నారు.

రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆరెస్ వైఖరేంటో కేసీఆర్ చెప్పాలి. రిజర్వేషన్లు రద్దు చేస్తే మీ కార్యాచరణ చెప్పాలి. వంద రోజుల మా ప్రభుత్వాన్ని దిగిపొమ్మంటూ బస్సుయాత్ర చేస్తున్నావ్ కదా? రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోదీపై నీ కార్యాచరణ ఎక్కడుంది మీ టార్గెట్ వంద రోజుల మా ప్రభుత్వమా? పదేళ్లు ప్రజలను మోసం చేస్తున్న మోదీపైనా? బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో ఒప్పందం చేసుకున్నారు..

మల్కాజ్ గిరిలో బీజేపీ గెలుస్తుందని నిన్న మేడ్చల్ బీఆరెస్ ఎమ్మెల్యే చెప్పడమే ఇందుకు నిదర్శనం. నిజంగా బీజేపీతో వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ గెలుస్తుందని చెప్పిన ఎమ్మెల్యేను కేటీఆర్ సమర్ధించడం దేనికి సూచన? బీఆరెస్ ఐదు పార్లమెంట్ స్థానాలను బీజేపీ కి తాకట్టు పెట్టిందని నేను మొదట్నుంచీ చెబుతున్నా. గతంలో నన్ను ఎంపీగా ఓడించేందుకు 31 సమావేశాలు పెట్టిన కేటీఆర్… ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు కేవలం ఒక్క సమావేశం పెట్టారు. ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా కేటీఆర్ మాట్లాడలేదు.

కేసీఆర్, కేటీఆర్ కు వ్యతిరేకంగా ఈటెల మాట్లాడటం లేదు. పైగా భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని నాపై విమర్శలు చేస్తున్నారు. ఏందయ్యా రాజేందర్.. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? కేసీఆర్, కేటీఆర్ భూములు అమ్మినప్పుడు రాజేందర్ కు భూములు గుర్తు రాలేదా? కమిట్ మెంట్ తో మేం మాట్లాడుతుంటే మాపై విమర్శలు చేస్తున్నారు.

రైతులకు రుణమాఫీ చేయొద్దా? కేసీఆర్ ను సూటిగా డిమాండ్ చేస్తున్నా. బీజేపీతో మీకు ఒప్పందం లేకపోతే తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించండి. లేకపోతే తెలంగాణ సమాజం మీ ఒప్పందం బయటపడినట్లే భావిస్తుంది. అమాయకంగానో, అత్యుత్సాహంతోనో మేడ్చల్ ఎమ్మెల్యే కుండ బద్దలు కొట్టారు. ఇక కేసీఆర్, కేటీఆర్ గుండు పగలగొట్టడమే మిగిలింది.. కేసీఆర్ కు ఇంత అసహనం ఎందుకు.. అధికారం లేకపోతే ఊపిరి ఆగిపోతుందా? జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి సాక్షిగా మాట ఇస్తున్నా… ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతాం.. తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా… రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి.

LEAVE A RESPONSE