-
కర్త కర్మ క్రియ అంతా పేషీ లోని ఆ ఇద్దరే
-
ముందు అనామకుడి పేరు, నెంబరుతో అధికారులపై ఫిర్యాదు
-
విచారణ పేరుతో అధికారుల సస్పెన్షన్
-
తీరా విచారిస్తే తమకు తెలియదంటున్న ఫిర్యాదుదారులు
-
పేషీ స్వార్థానికి ఒక అధికారి సస్పెన్షన్
-
కోర్టు ఆర్డరు తెచ్చుకున్నా తప్పని బదిలీ
-
టీడీపీ సానుభూతిపరుల ఏజెన్సీలకు ఉపాథి దూరం
-
వారి స్థానాల్లో తాము ఎంచుకున్న వారికి పోస్టింగ్
-
ఫిర్యాదుదారు ఆడియోతో పేషీ నాటకం బట్టబయలు
-
నాకేమీ తెలియదన్న ఫిర్యాదుదారు
-
తన ఆధార్కార్డు పేరుతో ఫిర్యాదు ఇచ్చారని స్పష్టీకరణ
-
కార్మికశాఖలో ముదుర్లను పోషిస్తున్నది ఎవరు?
-
సీఎంఓలో పనిచేసే వారితో సంబంధాలు?
-
ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తున్న చెడ్డీగ్యాంగ్
-
ప్రిన్సిపల్ సెక్రటరీ కొరడా ఝళిపిస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
మంత్రుల పేషీలు అవినీతికి దూరంగా ఉండాలని.. మంత్రులు, వారి వద్ద పనిచేసే అధికారులు ప్రభుత్వ ప్రతిష్ఠ నిలబెట్టాలన్న సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు అరణ్యరోదనే అవుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం 75 ఏళ్ల వయసులోనో అవిశ్రాంతంగా కష్టపడుతుంటే.. మరోవైపు కొన్ని మంత్రుల పేషీలు అవినీతికి అడ్డాగా మారాయన్న ఇంటలిజన్స్ నివేదికలు, కూటమి సర్కారుకు అప్రతిష్ఠ తీసుకు వస్తున్నాయి. ప్రధానంగా కార్మిక శాఖ ‘కంప్లైట్స్ మాఫియా’కు అడ్డాగా మారిందన్న ఆరోపణలు, ఇంటలిజన్స్ వరకూ చేరడం సంచలనం సృష్టిస్తోంది.
కార్మికశాఖ పేషీలో అంతా తానై ‘చక్రం’ తిప్పుతున్న ఓ జూనియర్ అధికారి.. చివరకు డైరక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను బదిలీ చేయడంతోపాటు… థర్డ్పార్టీ ఏజెన్సీల ఎంపికలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శాఖకు చెందిన ప్రముఖుడి బలహీనతను ఆధారం చేసుకుని, ఆయన కుటుంబంలోని వారికి కావలసిన పనులు చేసి.. ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ల కంటే ఎక్కువ అధికారాలను, అనధికారికంగా అనుభవిస్తున్న ‘అవినీతి చక్రవర్తిపై’ ఇప్పటికే ఇంటలిజన్స్ కన్నేసినట్లు సమాచారం.
శాఖలో తనకు నచ్చని అధికారులుంటే.. వారిని అక్కడి నుంచి తప్పించేందుకు ఈయన భారీ స్కెచ్ వేస్తాడు. అదే సమయంలో ఆ స్థానంలోకి వచ్చేందుకు తన సామాజికవర్గానికి చెందిన మరొక అధికారిని మానసికంగా సిద్ధం చేస్తాడు. గత 10 నెలల కాలంలో కార్మిక శాఖలో కీలకశాఖలో పోస్టింగులు దక్కించుకున్నవారంతా ఒకే కులానికి చెందిన వారు కావడం! తన నివాసాన్ని చర్చిగా మార్చి, ఆదివారం నాడు చర్చి పాస్టర్ అవతారమెత్తే పేషీలో పనిచేసే ఆ జూనియర్ అసిస్టెంట్., మంత్రి దగ్గర తన పలుకుబడి వినియోగించి తన మతానికి చెందిన వారికి కీలక పోస్టింగులు ఇప్పించుకోవడం కార్మిక శాఖలో చర్చనీయాంశమయింది.
అదెలాగంటే.. ఫలానా అధికారి అవినీతికి పాల్పడుతున్నాడని, ఆయనకు మరో నలుగురు సహకరిస్తున్నారంటూ ముక్కు మొహం తెలియని పేరు- ఒక నెంబరుతో మంత్రికి లేఖ రాయిస్తాడు. పోనీ ఆ ఫిర్యాదుదారుకు కార్మిక శాఖతో సంబంధం ఉంటుందా అంటీ అదీ లేదు. ఆ లేఖను తానే స్వయంగా మంత్రి వద్దకు తీసుకువెళ్లి, ఇది ఫలానా అధికారితో విచారణ జరిపిద్దామని తానే సిఫార్సు చేస్తాడు.
ఆ విచారాణాధికారితో ఫిర్యాదు వచ్చిన అధికారిని సస్పెండ్ చేయించి, తాను ముందే మాట్లాడి ఉంచిన తన మతానికి సంబంధించిన అధికారిని అక్కడికి బదిలీ చేయిస్తాడు. నిజానికి ఇన్ని చావు తెలివితేటలు ఉండాలంటే.. ఆ ఉద్యోగికి 20 ఏళ్ల అనుభవం ఉండాలి. మంత్రులు, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర పనిచేసి ముదిరిపోయి అయినా ఉండాలి. కానీ ఆశ్చర్యంగా అతగాడికి ఉన్న అనుభవం, ఎక్కడో జిల్లాల్లో జూనియర్ అసిస్టెంటుగా మాత్రమే. అయితే అతగాడికి మంత్రి దగ్గర పనిచేసే ఓ అధికారి దన్నుగా నిలవడమే దానికి కారణం. తాజాగా సదరు అధికారి కాకినాడలో రెండు థర్డ్పార్టీ ఏజెన్సీలకే ఆర్డరు ఇవ్వాలంటూ, జిల్లా అధికారులతో సంబంధం లేకుండా నేరుగా ఫ్యాక్టరీ యజమానులకే ఫోన్లు చేసి ఆదేశించిన వైనం చర్చనీయాంశంగా మారిందట.
చావు తెలివితేటలు ఎప్పుడూ పనిచేయవు. కాలం కర్మం పనిచేసినంతవరకే. మంత్రిగారి పేషీలోని ఒక ‘అవినీతి చక్రవర్తి’ బండారం, అతగాడికి దన్నుగా ఉన్న మరో అధికారి అతి తెలివి కూడా ఇలాగే బయటపడింది. అదెలాగంటే.. అనకాపల్లి జిల్లా, మాకవరపు
పాలెం మండలం, రాచపల్లి గ్రామానికి చెందిన ఆర్.తాతాజీ మీ సేవ నిర్వహిస్తుంటారు. అతని పేరుతో కార్మికశాఖ మంత్రి సుభాష్కు లేఖ వచ్చింది. 8 నవంబర్ 2024 న తాతాజీ రాసిన లేఖలో.. డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ దంతలూరి చంద్రశేఖర వర్మ, ఇన్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పైడి చిన్నారావుతోపాటు.. థర్డ్పార్టీ సేఫ్టీ ఏజెన్సీలకు చెందిన బమ్మిడి శ్రీనివాసరావు, గుమ్మడి శివసుబ్రమణ్యం, బలగం రవీంద్ర, సుధాకర్ వర్మ అవినీతికి పాల్పడుతున్నారని నాలుగు పేజీల లేఖ రాశారు. ఇంతవరకూ బాగానే ఉంది.
ఒక ముద్దాయిపై మరో ముద్దాయి విచారణ
ఆ లేఖ సంగతి ముందుగానే తెలిసిన పేషీలో పనిచేసే ఓ అధికారి, చక్రం తిప్పుతున్న మరో జూనియర్ అసిస్టెంట్ మంత్రికి అందించారు. సాధారణంగా ఏ అధికారిపై ఫిర్యాదు వచ్చినా దానిని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపి, విచారణకు ఆదేశించాలి. కానీ మంత్రి విచిత్రంగా డైరక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ చంద్రశేఖర్ వర్మకు పంపించి, విచారణకు ఆదేశించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. అసలు ఫిర్యాదుదారుడైన తాతాజీ రాసిన లేఖలో, సదరు చంద్రశేఖర్వర్మ కూడా అవినీతిపరుడేనని పేర్కొనడం! అంటే ఒక ముద్దాయిని మరో ముద్దాయిపై విచారణ చేయమని చెప్పడమన్న మాట. మరో ఆశ్చర్యమైన విషయమేమిటంటే.. చిన్నారావు అనే అధికారిపై, వర్మ విచారణకు పంపించిన మరో అధికారిపై అవినీతి ఆరోపణలు ఉండటమే విచిత్రం.
దానితో రంగంలోకి దిగిన సదరు అధికారి.. చిన్నారావుపై వచ్చిన ఫిర్యాదులు నిజమేనని ధృవీకరించడంతో, చిన్నారావును సస్పెండ్ చేశారు. అయితే విచారాణాధికారి.. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగుల నుంచి డాక్యుమెంటరీ ఆధారాలు తీసుకుని, తన సిఫార్సు నివేదికకు జత పరిచారు. తర్వాత కథ ఇక్కడే కొత్త మలుపు తిరిగింది. కొద్దిరోజుల తర్వాత.. చిన్నారావు అనే అధికారిపై ఫిర్యాదు చేసిన అదే ఇద్దరు ఉద్యోగులు అడ్డంతిరిగి.. విచారణాధికారి తమను బెదిరించడంతో, చిన్నారావుకు వ్యతిరేకంగా చెప్పాల్సి వచ్చిందని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. ప్రస్తుతం దానిపై విచారణ జరుగుతోంది. మరిప్పుడు ఎవరిపై చర్యలు తీసుకుంటారో చూడాలి.
బాధితుడు టీడీపీ సానుభూతిపరుడే
సీన్ కట్ చేస్తే.. అసలు కథ ఇక్కడి నుంచే మొదలయింది. ఎవరైతే చిన్నారావు అండ్ అదర్స్ మీద ఫిర్యాదు చేసిన, మీ- సేవ నిర్వహకుడు తాతాజీ కూడా అడ్డం తిరగడమే ఇక్కడ ఆశ్చర్యం. అదెలాగంటే.. తనపై అకారణంగా ఫిర్యాదు చేసినందున, తన కుటుంబం రోడ్డున పడిందని, దాని ఆధారంగా తనకు థర్డ్ పార్టీ ఏజెన్సీ ఇవ్వకుండా ఆపేశారంటూ.. టీడీపీకి చెందిన గుమ్మడి శివ సుబ్రమణ్యం.. సదరు తాతాజీకి ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో టీడీపీ కోసం తన సొంత నియోజకవర్గమైన వేమూరులో ఆర్ధిక వనరులు వెచ్చించిన కమ్మ సామాజికవర్గానికి చెందిన గుమ్మడి శివ సుబ్రమణ్యం, ఫిర్యాదుదారు లేఖతో ఆర్ధికంగా నష్టపోయి రోడ్డుపాలయ్యారు. చివరకు అతని పక్షాన మాజీ మంత్రి, పొలిట్బ్యూరో సభ్యుడు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చెప్పినా, కార్మికమంత్రి బేఖాతరు చేయడం ఇక్కడ మరో విశేషం.
అడ్డం తిరిగిన ఫిర్యాదుదారు
అయితే సదరు తాతాజీ.. ‘ఆ ఫిర్యాదుతో తనకెలాంటి సంబంధం లేదు. ఎవరో నా ఆధార్ కార్డు తీసుకుని నా పేరుతో ఫిర్యాదు చేశారు. కావాలంటే నాకెలాంటి సంబంధం లేదని నేను రాసిస్తా. నేను మూడురోజులు ఊళ్లో ఉండను. తర్వాత వస్తే మీకు నేను లిఖితపూర్వకంగా రాసిస్తా’’ నని శివ సుబ్రమణ్యంతో, తాతాజీ మాట్లాడిన మాటలు రికార్డయ్యాయి.
ఇదిలా ఉండగా.. ఈ కంప్లైట్ మాఫియాపై శాఖాపరంగా విచారణ ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారయిన తాతాజీకి అధికారులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా తీయడం లేదు. దానితో విచారణ ఆలస్యమవుతోంది. అయితే.. ఈలోగా సస్పెండయిన చిన్నారావు.. తనపై ఆరోపణలు వచ్చిన శివ సుబ్రమణ్యం తమ వద్ద ఉన్న ఆధారాలను ఉన్నతాధికారులకు అందించారు.
కోర్టు ఆదేశాలు బేఖాతర్
ఇదిలాఉండగా, తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన చిన్నారావును, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయినా దానిని అమలుచేయకుండా, డైరక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ వర్మ అత్యుత్సాహంగా ఆర్ధికశాఖకు రాశారు. అది నెలన్నర సమయం పట్టింది. తర్వాత ఎట్టకేలకు చిన్నారావును పెద్దగా ఫ్యాక్టరీలు లేని ఒంగోలు-2కు బదిలీ చేశారు. నిజానికి.. తనతోపాటు మీరు కూడా నిందితుడయినందున, తనను విచారించే అధికారం మీకు లేదని చిన్నారావు ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరక్టర్ వ ర్మకు మెయిల్ పెట్టిన వెంటనే దానిపై స్పందించకుండా, చిన్నారావును రెండునెలల తర్వాత సస్పెండ్ చేయడం ఇంకో ఆశ్చర్యం.
కూన, ధూళిపాళ్ల చెప్పినా బేఖాతర్
కాగా ప్రభుత్వ విప్ కూన రవికుమార్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సైతం చిన్నారావుపై సస్పెన్షన్ తీసేయాలని మంత్రిని కలిసి కోరినా, మంత్రి లెక్కచేయకపోవడం మరో విశేషం. లిక్కర్, మైనింగ్ వంటి వేల కోట్లరూపాయల కుంభకోణంలో.. నిందితులుగా ఉన్న అధికారులను సస్పెండ్ చేయడానికే దాదాపు ఏడెనిమిది నెలలు పట్టింది. జత్వానీ కేసులో నిందితుడైన పీఎస్సార్ను కూడా 10 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. కానీ ఒక బీసీ అధికారి అయిన చిన్నారావుపై ఫిర్యాదు అందిన 20 రోజులకే సస్పెండ్ చేయడమే ఇక్కడ ఆశ్చర్యం.
అసలు ఒక అధికారిపై వచ్చిన ఫిర్యాదులు నిజమా? కాదా?.. ఫిర్యాదుదారు సంబంధిత శాఖకు సంబంధించిన బాధితుడా అన్నది పరిశీలించకుండా చర్యలు తీసుకోవడం బట్టి.. కార్మికశాఖలో కంప్లైంట్ మాఫియా ఏ స్థాయిలో పాతుకుపోయిందో అర్ధమవుతుంది. నిజానికి ఫిర్యాదుదారైన తాతాజీకి, కార్మికశాఖతో ముడిపడిన ఎలాంటి వ్యాపారాలు లేవు. కాంట్రాక్టులూ లేవు. అతను ఒక సాధారణ మీ-సేవ సర్వీసు నిర్వహకుడు మాత్రమే. అది కూడా అనకాపల్లి జిల్లాలో. మరి అలాంటి వ్యక్తి చేసే ఫిర్యాదుకు.. విశ్వసనీయత ఎంతన్న దానిపై అటు కార్మిక శాఖ మంత్రి గానీ, ఇటు ైడె రక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గానీ మెదడుతో ఆలోచించకపోవడమే ఆశ్చర్యం.
మెదడుతో ఆలోచించరా?
అసలు ఫ్యాక్టరీస్ విభాగంలో జరిగే వ్యవహారాలు, అనకాపల్లిలో మీ-సేవ నిర్వహకుడికి ఎలా తెలుస్తుంది? పోనీ ఫిర్యాదుదారు ఏమైనా కార్మికశాఖలోని చిన్నారావు అండ్ అదర్స్ బాధితులా అంటే అదీకాదు! ఫిర్యాదుదారుకు ఎలాంటి పరిశ్రమతో సంబంధం లేదు. అతని వృత్తి ఏమిటంటే.. సర్టిఫికెట్లు జారీ చేసే మీ-సేవ నిర్వహణ మాత్రమే! మరి ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు అతగాడికి ఎలా తెలిశాయి? అన్న ప్రశ్నలు తలపై మెడ ఉన్న ఎవరికయినా వచ్చి తీరాలి. కానీ కార్మికమంత్రి, డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కు అలాంటి ఆలోచన రాకపోవడమే విచిత్రం. కార్మిక శాఖలో చక్రం తిప్పుతున్న ఓ జూనియర్ అసిస్టెంట్, మరో అధికారితో కలసి ఆడుతున్న ఈ గేమ్ గురించి.. మొత్తం కార్మికశాఖ అధికారులు, ఉద్యోగులకు తెలిసినా.. కార్మిక మంత్రికి తెలియదనుకుంటే అమాయకత్వమేనన్నది ఆ శాఖ అధికారుల ఉవాచ.
ఆ నష్టం పూడ్చేదెవరు?
ఈ మొత్తం పరిణామాల్లో దొంగాట ఆడిన కంప్లైంట్ మాఫియాకు ఒక బీసీ అధికారి బ(ది)లి అయి, టీడీపీకి చెందిన ఓ మరో ఏజెన్సీ వ్యక్తి కుటుంబం రోడ్డుపాలయింది. ఇప్పుడు అసలు ఫిర్యాదుదారుడితోపాటు.. మరో ఇద్దరు ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు తాము ఎలాంటి ఫిర్యాదు చే యలేదని.. తమతో బలవంతంగా ఫిర్యాదు రాయించుకున్నారని లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. మరి ఇప్పుడు చర్యలు ఎవరిపై తీసుకుంటారు? అకారణంగా నెలలపాటు సస్పెండయి, తర్వాత బదిలీ వే టు పడిన చిన్నారావు అనే బీసీ అధికారికి జరిగిన నష్టం ఎవరు పూడుస్తారు? థర్డ్పార్టీ ఏజెన్సీపైనే ఆధారపడి జీవించే శివసుబ్రమణ్యం అనే టీడీపీ కార్యకర్తకు జరిగిన ఆర్ధిక నష్టాన్ని ఎవరు భ ర్తీ చేస్తారన్నదే ఇక్కడ ప్రశ్న.
శేషగిరిబాబు ఏం చేస్తారు?
కాగా సమర్ధుడైన అధికారిగా పేరున్న శేషగిరిబాబు కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చిన తర్వాత ప్రక్షాళన ప్రారంభమయింది. అవినీతిమయంగా మారిన శాఖను గాడిలో పెట్టేందుకు, ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటీవలి కాలంలో జిల్లా అధికారులతో నిరంతర సమీక్షలు నిర్వహిస్తు, అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
సమస్యలపై సునిశిత దృష్టి, పరిష్కార మార్గాలపై విశేష అనుభవం ఉన్న శేషగిరిబాబు సమర్థత ఇప్పుడు, అక్రమార్కులకు ఇబ్బందిగా మారింది. ఆయనకు ముందున్న ఓ అధికారి, డైరక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ సిఫార్సులను గుడ్డిగా అమలుచేశారన్న విమర్శలు లేకపోలేదు. శేషగిరిబాబు అందుకు విరుద్ధంగా.. తనకు వచ్చిన సమాచారం ఆధారంగా, వివిధ ఫిర్యాదులు-సమస్యలపై దృష్టి పెడుతుండటం విశేషం. నిజానికి ఐఏఎస్ అధికారుల దృష్టికోణం అదే కోణంలో ఉంటుంది.
ఈ క్రమంలో మంత్రి పేషీ కేంద్రంగా జరుగుతున్న ‘కంప్లైంట్ మాఫియా’పైదృష్టి సారించి.. అవినీతి తిమింగలాలపై చర్యల కొరడా తీసుకుంటారన్న ఆశాభావం, కార్మికశాఖ అధికారుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా పేషీతో పాతుకుపోయిన ఆ ఇద్దరు ఉద్యోగులపై వేటు వేయాల్సిన అవసరం ఉందంటున్నారు. వారిద్దరు కీలక వ్యక్తుల కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలపై మరి శేషగిరిబాబు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి!
నత్తలూ నవ్వుతున్నాయ్!
సహజంగా ఎవరిపైనయినా ఫిర్యాదులు వస్తే వాటిపై విచారించేందుకు మహా అయితే వారం రోజుల సమయం పడుతుంది. అంటే ఫిర్యాదుదారును పిలిచి, ఆయన వాంగ్మూలం నమోదు చేసుకుని, దానిపై నివేదిక ఇవ్వడం పెద్ద పని కాదు. కానీ ఈ కేసులో విచారణ జరుపుతున్న కార్మికశాఖ అధికారులు మాత్రం.. ఇప్పటికి మూడు తేదీలు ఇచ్చి, రెండుసార్లు వాయిదా వేసి, మూడురోజుల పర్యటనను రెండురోజులకు కుదించుకుని, ఇప్పటివరకూ ఫిర్యాదుదారు వద్ద వాంగ్మూలం తీసుకోలేదంటే.. దీనిపై ఏ స్థాయి వ్యక్తుల ప్రభావం ఉందో అర్ధం చేసుకోవచ్చని కార్మిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
నిజానికి ఈ నెల 4 వ తేదీన విచారణకు వస్తామన్న అధికారులు, దానిని 12 వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ తర్వాత 22వ తేదీ నుంచి మూడురోజులు అందుబాటులో ఉన్నామన్న అధికారులు, రెండురోజులే సమయం ఇచ్చి, మిగిలిన ఒకరోజును సిటీ సైట్ సీయింగ్కు కేటాయించారన్న ఆరోపణలు లేకపోలేదు. ఫిర్యాదుదారులైన ముగ్గురు విశాఖ, అనకాపల్లిలోనే ఉంటారు కాబట్టి, వారిని విచారించడానికి, ఒకటి రెండురోజులు కూడా పట్టదు. కానీ ఇప్పటివరకూ అసలు ఏ ఒక్క ఫిర్యాదుదారు నుంచి స్టేట్మెంట్ తీసుకోకపోవడం బట్టి, కార్మిక శాఖ విచారణ ఎంత వేగంగా జరుగుతోందో ఊహించుకోవచ్చు. విచిత్రంగా.. ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనిని బాధితులే నడుం బిగించి ఆధారాలు సేకరించడం సిగ్గుచేటైన వ్యవహారమే.
బండారం బట్టబయలు
తమపై మీ సేవ నిర్వహకుడు తాతాజీ చేసిన ఫిర్యాదును తెలుసుకున్న టీడీపీ సానుభూతిపరుడైన థర్డ్పార్టీ జెన్సీ నిర్వహకుడు గుమ్మడి శివసుబ్రమణ్యం గూఢచారి అవతారమెత్తడంతో, బండారం మొత్తం బట్టబయలవడం విశేషం. తనపై ఫిర్యాదు చేసిన తాతాజీ వద్దకు వెళ్లిన శివ సుబ్రమణ్యం.. ఫిర్యాదుదారుతో మాటామంతీ కలిపారు. ఎలా ఫిర్యాదు చేశారని ఆరా తీయగా.. తనకు అసలేమీ
తెలియదని, గతంలో తనకు ఒక నెంబరు వచ్చిందని వివరించారు. ఆ మేరకు అసలు ఆ ఫిర్యాదు చేసింది తాను కాదని స్పష్టం చేస్తూ.. లిఖితపూర్వకంగా రాసివ్వడం.. ముందుజాగ్రత్తగా శివసుబ్రమణ్యం దానిని వీడియో తీయించడం జరిగిపోయింది. మరిప్పుడు తాతాజీ ఫిర్యాదును అడ్డు పెట్టుకుని ఆయనను సస్పెండ్ చేసి, కొన్ని నెలల తర్వాత కోర్టు ఆర్డరుతో బదిలీ చేసిన చిన్నారావు అనే అధికారికి ఎవరు న్యాయం చేస్తారు? థర్డ్పార్టీ ఏజెన్సీ ద్వారా తన జీవన భృతి దెబ్బతిన్న శివసుబ్రమణ్యానికి ఎవరు న్యాయం చేస్తారు? అసలు ఈ మొత్తం ఈ వ్యవహారంలో రింగ్ మాస్టర్లుగా వ్యవహరించిన కార్మికశాఖ మంత్రి పేషీ, పెద్ద తలల కుటుంబసభ్యులు.. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ పెద్ద తలలపై ఎవరు చర్యలు తీసుకుంటారన్నదే ప్రశ్న.