Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ ఖేల్ ఖతం…దుకాణ్ బంద్

– సీఎం వ్యాఖ్యలే నిదర్శనం
– ఇగ రైతుల హామీలన్నీ గాలికొదిలేసినట్లే
– వృద్ధులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు
– మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేనని తేలింది
– నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇగ రాదు
– విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇగ ఇయ్యరని తేల్చేశారు
-మోసాల కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం
– రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం
– ‘‘సంవిధాన్’’ చేత పట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలేమైనయ్
– నిన్న కోమటిరెడ్డికి కూడా గడ్కరీ ఇదే విషయాన్ని చెప్పారు
– ఎల్లారెడ్డిపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ..

ఎల్లారెడ్డిపేట: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోతారేమనని దొంగలాగా చూస్తూ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘‘ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇగ అమలు చేయలేనని సీఎం తేల్చేశారు. ఇక వృద్ధులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు. మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేనని తేలింది. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇయ్యనట్లే. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్యరని తేల్చేసినట్లే. రైతులకిచ్చిన హామీలను గాలికొదిలేసినట్లే’’అని వ్యాఖ్యానించారు.

ఇగ తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం… దుకాణం బంద్ అయినట్లేనని అన్నారు. సంవిధాన్ పుస్తకం పట్టుకుని తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడెం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందన్నారు. ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి రేపటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామని చెప్పారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ప్రెస్ క్లబ్ ను సందర్శించారు. స్థానిక విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.

సంజయ్ ఏమన్నారంటే… తెలంగాణ రాష్ట్రమనే కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాతో ఏం కాదు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా. రాష్ట్రం దివాళా తీసింది. అని మాట్లాడటం సిగ్గు చేటు. ఇప్పటికే కాంగ్రెస్ పట్ల ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నరు. నిన్న సీఎం మాటలతో కాంగ్రెస్ పనైపోయింది. ఖేల్ ఖతం దుకాణ్ బంద్.
సీఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మా భవిష్యత్తు ఏమిటనే భయంతో ఉన్నరు. ఇంటికి ఏదైనా సమస్య వస్తే ఇంటి పెద్ద కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ సమస్యను అధిగమించేందుకు యత్నిస్తరు. కానీ రాష్ట్రానికి పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీసిండు. దేశం ముందు తలదించుకునేలా చేసిండు. యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం నిన్న పూర్తిగా మంట కలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇంతకంటే అవమానం మరొకటి లేనేలేదు. ఢిల్లీకి పోతే అపాయింట్ మెంట్ కూడా ఇస్తలేరని చెప్పడం పచ్చి అబద్దం. ప్రధానమంత్రిని చాలా సార్లు కలిశారు. కేంద్ర మంత్రులను ఎప్పుడంటే అప్పుడు కలుస్తూనే ఉన్నడు. అయినా ఏం మాట్లాడుతున్నరు.

‘‘వీడొస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతరేమోననే భయంతో దగ్గరికి కూడా రానీయడం లేదు.’’అని అంటున్నడు. ఈ చెప్పులెత్తకపోవడమేంది? ఈ చెప్పులెత్తకపోవడమేంది? నాకైతే అర్ధం కాలే. కాంగ్రెస్ లో అట్లనే చేస్తరేమో. ఆ పార్టీ సంస్కృతి అదేనేమో. 2023 డిసెంబర్ లో, 2024 జులైలో, 2025 ఫిబ్రవరిలో కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కేంద్ర మంత్రులైతే లెక్కేలేదు. నిన్న కూడా గడ్కరీ గారు కలిశారు. అయినా అపాయిట్ మెంట్ ఇయ్యడం లేదు. చెప్పులు ఎత్తకపోయేవాడిలా చూస్తున్నరనడం సిగ్గు చేటు.

సీఎం వ్యాఖ్యలను పరిశీలిస్తే…. ఆయన పూర్తిగా చేతులెత్తేశారు. హామీలను అమలు చేయలేం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేం. ఇచ్చిన హమీలను అమలు చేయలేమని చెప్పిండు… ఇగ ప్రజలే ఆలోచించాలి. ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెప్పిండు. అయినా వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చిండు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నడు. హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. కానీ సీఎం సీటెక్కంగనే చేతులెత్తేసిండు. ఇగ మీ ఖర్మ అని చేతులెత్తిసిండు. ఓట్లేసి గెలిపించినందుకు మీ తీట మీది అని అంటున్నడు. ఇకపై రైతులకిచ్చిన హామీలను అమలు చేయడు. వృద్ధులకు రూ.4 వేల ఫించన్ ఇయ్యడు. మహిళలకు రూ.2500లు ఇయ్యరు. తులం బంగారం ఇయ్యరు.

మాట తప్పిన కాంగ్రెస్ ను ఇగ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాట ఇచ్చి తప్పినందుకు ఆ పార్టీ సంగతి తేలుస్తాం. ఏం ఆశించి ఎన్నికలప్పుడు హామీలను అమలు చేస్తామన్నరు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎందుకు బాండ్ పేపర్ రాసిచ్చారు? ఇప్పుడెందుకు చేతులెత్తేశారో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి.

కాంగ్రెస్ రాక్షసత్యం బయటపడింది. సంవిధాన్ పుస్తకం చేత పట్టుకుని రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు చేతులెత్తేశారో సమాధానం చెప్పి తీరాల్సిందే. అప్పటిదాకా కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం. రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం. ప్రజలతో కలిసి అడ్డుకుని తీరుతాం.

B ఏమైనా మాట్లాడితే కేంద్రం ఏమీ చేయలేదంటరు. ఇచ్చేదంతా కేంద్రమే. అభివృద్ధి జరుగుతున్నదంతా కేంద్ర నిధులతోనే. రోడ్ల కోసమే 1.2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. రైల్వేల కోసం 32 వేల కోట్లు ఖర్చు చేసినం. వడ్ల కొనుగోలు కోసం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లు ఇచ్చినం. కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బాగా సాయం చేస్తుందని పొగుడుతారు. బయటకు వచ్చినంక నయాపైసా ఇయ్యడం లేదని రెండు నాల్కల ధోరణితో మాట్లాడతారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతటి దుర్మార్గులంటే… చేసిన తప్పులన్నీ చేసేస్తారు. పాపాలన్నీ చేస్తారు….అవన్నీ బయటకొస్తున్నయని తెలిసే సరికి ఎదుటి వాళ్ల మీద రుద్ది బయటపడాలనుకుంటరు. నిన్న ఓ మంత్రి రాజీవ్ రహదారిని 6 లేన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తడు. ఇదేం పద్దతి? అరే.. రాజీవ్ రహదారిని నిర్మించింది నాటి కాంగ్రెస్ పార్టీయే. ఆ కాంట్రాక్టర్ తో కలిసి కమీషన్లు కక్కుర్తి పడి రోడ్డును అడ్డదిడ్డంగా నిర్మించింది కాంగ్రెస్సే. భారీ ఎత్తున కమీషన్లు దండుకుంది కాంగ్రెస్సే…. అట్లాంటి పార్టీ నేతలు ఇయాళ ఏమంటున్నరు?

రాజీవ్ రహదారిని 8 (ఎయిట్) లేన్ రోడ్డుగా మార్చండి… కేంద్రం పట్టించుకోవడం లేదని నిందలేస్తున్నరు. ఇంతకంటే సిగ్గు చేటు ఇంకొకటి ఉందా? 2036 దాకా ఆ కాంట్రాక్ట్ కొనసాగేలా ఒప్పందం చేసుకుందే కాంగ్రెస్ పార్టీ.

అయినా సరే… తెలంగాణ ప్రజలపై మోదీ ప్రభుత్వానికి ఉన్న అభిమానంతో రాజీవ్ రహదారిని 6 లేన్ జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పుడే కాదు. 2022లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇదే మాట చెప్పింది. ఇదిగో ఆధారం(3.6.2022న కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వు కాపీని చూపిస్తూ….). ‘‘హైదరాబాద్ నుండి కరీంనగర్ మీదుగా మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారినికి 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ తో చేసుకున్న ఒప్పందం దృష్ట్యా ఆ సమస్యను పరిష్కరించుకోండి. ఆ కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన డబ్బులను సెటిల్ చేసుకోండి. అవసరమైతే గ్రీన్ ఫీల్డ్ అలైన్ మెంట్ కింద లేదా జాతీయ రహదారిగానైనా విస్తరిస్తాం’’ అని చాలా స్పష్టంగా పేర్కొంది.

ఆ కాపీలను కూడా మీకు పంపిస్తా… చెక్ చేసుకోండి. ఇదే కాదు… తెలంగాణ అభివ్రుద్ది కోసం కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే 10 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఖర్చు చేసినం. రాబోయే 2 ఏళ్లలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే మరో 2 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనం. కలిసి పనిచేసేందుకు మేమెప్పుడూ సిధ్దమే. ఇకనైనా కేంద్రంపై బురద చల్లడం మానుకొని ప్రజల బాధలను అర్ధం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టాలని సూచిస్తున్నా.

LEAVE A RESPONSE