Suryaa.co.in

Editorial

రాహుల్ సారీ సరే.. జగన్ సంగతేమిటి?

  • సిక్కుల ఊచకోతపై క్షమాపణ చెప్పిన కాంగ్రెస్ యువనేత రాహుల్

  • తనకు సంబంధం లేకున్నా క్షమాపణ చెప్పి సిక్కుల మనసు గెలిచే యత్నం

  • రాహుల్ క్షమాపణతో సిక్కుల్లో కాంగ్రెస్‌పై తగ్గుతున్న కోపం

  • రాహుల్‌పై తటస్థులలో పెరుగుతున్న సానుకూలత

  • మరి జగన్ కూడా రాహుల్‌ను అనుసరిస్తారా?

  • తన హయాంలో జరిగిన తప్పిదాలకు సారీ చెబుతారా?

  • అమరావతి నిర్వీర్యం, కమ్మ-కాపులపై అణచివేత, ఉద్యోగులపై వేధింపులు, పరదా పర్యటనలపై జగన్ సారీ చెబుతారా?

  • నేతలకు సమయం ఇవ్వకపోవడంపైనా విచారం వ్యక్తం చేస్తారా?

  • జగన్ సారీ చెబితే కొన్ని వర్గాలు శాంతిస్తాయంటున్న సీనియర్లు

  • అమరావతి, కమ్మ- కాపు అణచివేతపై స్పందిస్తేనే మంచిదని సీనియర్ల సూచన

  • తటస్థులు కూడా శాంతిస్తారన్న సలహాలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన ఊచకోత, మారణకాండ గుర్తుంది కదా? ఇందిర హత్య వార్తతో సిక్కు వర్గాలపై తెగబడిన కాంగ్రెస్ మూకలు, వారిని దారుణంగా హతమార్చారు. ఆస్తులు ధ్వంసం చేశారు. ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటి వరకూ సిక్కులకు కాంగ్రెస్‌పై ఆగ్రహం. కసి!

నిజానికి ఆ సమయంలో రాహుల్ చిన్నపిల్లవాడు. రాజకీయాలతో సంబంధం లేదు. కానీ.. ఆ మారణకాండపై ఇప్పుడు రాహుల్ విచారం వ్యక్తం చేశారు. పెద్ద మనసుతో క్షమాపణ చెప్పారు. ఫలితంగా.. సిక్కులు చల్లబడుతున్నారు. రాహుల్ క్షమాపణ వారిని శాంతింపచేస్తోంది. దానివల్ల వారి కోపం ఇప్పుడే చల్లారకపోవచ్చు. కానీ కాంగ్రెస్‌పై కోపం చల్లారేందుకు ఒక సానుకూల పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు రాహుల్ క్షమాపణ అంశం.. వైసీపీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ అధినేత జగన్ కూడా.. తన ఐదేళ్ల పాలనలో జరిగిన అనేక విధ్వంసాలు, దారుణాలు, వివిధ వైఫల్యాలపై మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటే.. తాము స్వేచ్ఛగా జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుందన్న చర్చ మొదలయింది.

రాజీవ్ వారసుడే భే షజం లేకుండా, తమ పార్టీ చర్యలకు క్షమాపణ చెబితే.. రాజీవ్ వల్ల పీసీసీ అధ్యక్షుడయిన రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్, తన పాలనా తప్పిదాలపై క్షమాపణ చెప్పడంలో తప్పేమీలేదని వైసీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

రాహుల్ గాంధీ స్ఫూర్తితో తమ అధినేత జగన్ కూడా, తమ ఐదేళ్లలో జరిగిన పొరపాట్లు, దానివల్ల ఇబ్బందిపడిన వివిధ వర్గాల ప్రజలకు క్షమాపణ చెబితే, ప్రజల్లో తమ పార్టీపై ఉన్న కోపం తగ్గిపోయి, తాము కూడా నిర్భయంగా, నిస్సంకోచంగా జనంలోకి వెళ్లే వెసులుబాటు ఉందంటున్నారు.

ప్రధానంగా రాజధాని అమరావతిపై కక్ష కట్టి, భూములిచ్చిన రైతులపై ప్రతీకార ధోరణి అవలంబించి.. అమరావతికి వ్యతిరేకంగా తన పార్టీ నేతలతో ప్రకటనలు ఇప్పించడంపై.. జగన్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగి, క్షమాపణ చెబితే హుందాతనంగా ఉంటుందని సీనియర్లు సూచిస్తున్నారు. ప్రధానంగా మూడు రాజధానుల నిర్ణయం తప్పని, అమరావతిపై తన పార్టీ చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని మారిన మనసుతో జగన్ వెల్లడిస్తే, జనంలో పార్టీపై కోపం కొంతవరకూ తగ్గే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

ఇక ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని రంగాలనూ ప్రభావితం చేసే కమ్మ వర్గమే లక్ష్యంగా జగన్, ఆయన పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. కమ్మ వర్గానికి చెందిన పోలీసు అధికారులను వేధించారు. పోస్టింగులు ఇవ్వకుండా నాలుగేళ్లు వేధించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పటికీ అలాంటివారికి న్యాయం జరగపోవడం వేరే విషయం. డీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు, మరికొందరు ఐపిఎస్, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలకు ఏళ్ల తరబడి పోస్టింగులు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చినా లూప్‌లైన్ పోస్టింగులే ఇచ్చారు.

ప్రధానంగా టీడీపీకి ఆర్ధికంగా దన్నుగా నిలిచి, గతంలో తన ఓటమికి కారణమయ్యారన్న కసితో, సీఎం అయిన తర్వాత జగన్ ఆ కుల నిర్వీర్యానికి ప్రయత్నించారు. టీడీపీ హయాంలో పనులు చేసిన మ్మ కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపివేశారు. ఫలితంగా ఏపీలోని కాంట్రాక్టర్లు తెలంగాణ, కర్నాటక, గోవా, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి పనులుచేసుకుంటున్న పరిస్థితి.

నిజానికి జగన్ భయంతో, అప్పుడు ఆయా రాష్ట్రాలకు వెళ్లి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు.. ఇప్పటికీ అదే భయంతో ఏపీకి తిరగిరాకపోవడం విశేషం. ఇప్పుడు పెట్టుబడులు పెట్టినా, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటన్నదే వారి భయానికి కారణంగా కనిపిస్తోంది. అంటే దీన్నిబట్టి కమ్మ వర్గాన్ని జగన్ ఏ స్థాయిలో భయపెట్టారో స్పష్టమవుతుంది.

ఈ నేపథ్యంలో.. రాహుల్‌ను ఆదర్శంగా తీసుకుని జగన్ కూడా.. గత ఐదేళ్ల పాలనలో కమ్మవారిపై వేధింపులకు పాల్పడినందుకు క్షమాపణ కోరితే, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, గోదావరి జిల్లాల్లోని కమ్మవారిలో పార్టీపై ఉన్న కోపం ఎంతోకొంత చల్లారుతుందని మాజీ మంత్రి ఒకరు విశ్లేషించారు. నిజానికి కమ్మ వర్గం.. గత ఎన్నికల్లో కేవలం జగన్‌పై ఉన్న ద్వేషం-కసితోనే కూటమిని గెలిపించింది తప్ప, కూటమిపై ప్రేమతో కాదని ఆయన వివరించారు.

ఆయా జిల్లాల్లో ఇప్పటికీ కమ్మవర్గంలో కొంత శాతం స్థానికంగా ఫ్యాక్షన్ కోణం- వర్గాల కోణంలో వైసీపీలోనే ఉందని, అయితే వారు కూడా గత ఎన్నికల్లో తమ పార్టీకి మానసికంగా వ్యతిరేకంగా ఓటు వేసినవారేనని ఆ మాజీ మంత్రి విశ్లేషించారు.

‘నా అనుభవంలో కమ్మవారు చాలా తెలివిగలవారు. అధికారాన్ని బాగా వాడుకుంటారు. కాకపోతే వారికి మానసికంగా టీడీపీపై ప్రేమ ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆ పార్టీ నాయకులతో కలసి వ్యాపారాలు చేసుకుంటారు. ఎవరికీ హాని చేయని మనస్తత్వం. అలాంటి కులంపై మా నాయకుడు అనవసరంగా కోపం పెంచుకున్నారు. అసలిప్పుడు కమ్మవాళ్లకూ పెద్దగా జరుగుతున్నదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్లను పట్టించుకునేవాళ్లే లేరు. కాకపోతే వాళ్లు తమ ఇబ్బందులు బయటకు చెప్పుకోలేరు. ఆ అసంతృప్తి వాళ్లలో బాగా ఉంది. మా నాయకుడు మాదిరిగా.. వాళ్ల నాయకుడు తన కులాన్ని ప్రోత్సహించేందుకు భయపడతారు. మరి ఈ పరిస్థితిలో మేం అధికారంలో ఉన్నప్పుడు కమ్మవారిని వేధించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని, మా నాయకుడు చెబితే తప్పేమీలేదు. దానివల్ల మా పార్టీలోని కమ్మ నాయకులతో సహా మాలాంటి వారికీ వెసులుబాటు ఉంటుంది కదా’’ అని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇక రాష్ట్రంలో పెద్ద సామాజికవర్గమైన కాపులపైనా జగన్ ప్రభుత్వ వైఖరి ప్రదర్శించింది. కాపులకు మంత్రి పదవులిచ్చి టీడీపీ నేతలపై తిట్టించేది. తాము కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినప్పటికీ, మునుపటి ఎన్నికల్లో జగన్ గెలిచారు. ఆ తర్వాత జనసేన దళపతి పవన్‌పై, వ్యక్తిగత దాడి చేయడాన్ని కాపులు సహించలేకపోయారు. గత ఐదేళ్ల కాలంలో చాలామంది కాపు కాంట్రాక్టర్లకు, కమ్మ వారితో కలిపి బిల్లులు ఇవ్వలేదు. కాపు అధికారులకు సరైన పోస్టింగులివ్వలేదు. కమ్మవారితోపాటు, కాపులను కూడా దూరం పెట్టారు.

నిజానికి గత ఎన్నికల ముందు వరకూ జనసేనకు.. పవన్ ఇమేజ్ తప్ప, సంస్థాగత బలం యంత్రాంగం, బలం లేదు. అయినా టీడీపీతో కలసిన జనసేనకు.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో పట్టం కట్టడం విశేషం. ఈ క్రమంలో గత ఐదేళ్ల కాలంలో కాపులను విస్మరించినందుకు జగన్ క్షమాపణ కోరితే, ఆ ప్రభావం నాలుగైదు జిల్లాల్లో ఉంటుందని ఓ మాజీ మంత్రి విశ్లేషించారు.

‘మీకు చాలామందికి ఓ విషయం తెలియదు. ఇప్పడు మా కాపులేమీ ఆనందంగా ఏమీ లేరు. పవన్ కల్యాణ్ పక్కన ఉన్నారన్న ధైర్యంతో, టీడీపీలో ఉన్న కాపులను వాళ్ల పార్టీ నాయకత్వం పట్టించుకోవడం మానేసింది. దానితో వాళ్ల పరిస్థితి దారుణంగా మారింది. పోనీ అలాగని పవన్ ఏమైనా కాపునాయకులకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారా అంటే, అసలాయన కనిపించనే కనిపించరు. వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్లు ఇవ్వరు. దీనితో మా వాళ్ల పరిస్థితి ఎవరికీ ఏమీ చెప్పుకోలేక, కుల మీటింగులలో ఆవేదనతో సరిపెట్టుకోవలసి వస్తోంది’’ అని కాపు వర్గానికి చెందిన ఈ వైసీపీ నేత వ్యాఖ్యానించారు.

‘కాపు’ కాసేదెవరు?

వంగవీటి మోహనరంగా, కన్నా లక్ష్మీనారాయణ, మిరియాల వెంకట్రావు, పిళ్లా వెంకటేశ్వరరావు, ముద్రగడ, గాళ్ల సుబ్రమణ్యం వంటి కాపు నేతల పోరాటాలతో కాపునాడు ఉద్యమం పతాకస్థాయికి చేరి, అది రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. వైఎస్ హయాంలో చిరంజీవి పుట్టించిన ప్రజారాజ్యం పార్టీ కాపుల ఉనికిని చాటింది. 74 లక్షల ఓట్లుసాధించిన పీఆర్పీ, తర్వాత కాంగ్రెస్‌లో విలీనమయింది. ఇప్పుడు జనసేనను కాపులు గద్దెనెక్కించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా కాపులను పట్టించుకోని దుస్థితి. అలాంటి బలమైన కాపుల పరిస్థితి.. ఇప్పుడు అత్యంత దయనీయంగా మారిందన్న ఆవేదన, కాపునేతల్లో వ్యక్తమవుతోంది.

దానికి కారణం పవన్ కల్యాణ్ అన్న భావన కాపులలో లేకపోలేదు. పవన్ రాకతో టీడీపీ తన పార్టీలోని కాపులను పక్కనపెట్డడంతో, ఇప్పుడు తాము వారి వద్దకు వెళ్లలేకపోతున్నామని, కాపు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అటు పవన్ కూడా కాపులను దగ్గరకు రానీయడం లేదని, కమ్మవర్గానికి చెందిన లింగమనేని రమేష్‌తోపాటు, హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ రత్నం మినహా.. ఎవరినీ దగ్గరకు రానీయరని కాపు సంఘ నేతలు చెబుతున్నారు.

‘‘గత ఐదేళ్ల క్రితం మా పార్టీ, టీడీపీలో ఉన్న కాపులకు గౌరవం ఉండేది. మా జనాభా సంఖ్యను చూసి రెండు పార్టీలూ భయపడేవి. ఇప్పుడు కాపులు మా వైపు చూడలేని మొహమాటం. టీడీపీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాపులు, పవన్ పుణ్యాన అనాధలయ్యారు. మావాడు అని కులాభిమానంతో ఓట్లేసి గెలిపించిన పవన్.. అసలు కాపు సంఘాల నాయకులనే దగ్గరకు రానీయడం లేదు. ఆయన కమ్మ వర్గానికి చెందిన ఓ వ్యాపారి చెప్పిందే వింటున్నారు. ఇదీ మా వాళ్ల విషాదం’’ అని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా ఓ ప్రముఖుడు సుదీర్ఘ విశ్లేషణ చేశారు.

ఈ నేపథ్యంలో.. రాహుల్ మాదిరిగానే, తమ నాయకుడు జగన్ కూడా దిద్దుబాటుకు దిగి.. కాపులకు అన్యాయం చేసినందుకు మన్నించమని కోరితే, కాపు సామాజికవర్గంలో సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

అదేవిధంగా జగన్ జమానాలో ఐదేళ్లు ఉద్యోగులను వేధించారు. క్రమం తప్పకుండా జీతాలివ్వకపోవడంతో, వారు దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం వాడేసుకుంది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే, సీపీఎస్ అమలుచేస్తామని మొండిచేయి చూపారు. ప్రధానంగా టీచర్లను హాజరుపేరుతో నరకం చూపించారు. ఉద్యోగులు విజయవాడకు రాకుండా అరెస్టులు చేయించారు.

‘ఈనెల జీతం ఇస్తే అదే మహాప్రసాదం. ఇక డీఏలు ఎప్పుడిస్తారో వాళ్ల దయ. మా ప్రాప్తం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్లు ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోక తప్పదు’ అని భావించే పరిస్థితికి, ఉద్యోగులను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను వేధించి పొరపాటు చేశామని జగన్ చెబితే, కొంతవరకూ మేలు జరుగుతుందని సీనియర్లు చెబుతున్నారు.

ఎందుకంటే దళిత, గిరిజన ఉద్యోగులతోపాటు మతం మారిన క్రైస్తవులు, ముస్లింలలో మెజారిటీ ఉద్యోగులు, ఇప్పటికీ వైసీపీపై సానుభూతి చూపిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలో జగన్ క్షమాపణ చెబితే.. తటస్థంగా ఉండే ఉద్యోగులలో, తమ పార్టీపై ఉన్న వ్యతిరేకత చాలావరకూ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇక జగన్ తన పర్యటనల సందర్భంగా రోడ్డుకు అటు ఇటు పరదాలు కట్టించడంతో, ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. జగన్ సభ పూర్తయ్యేవరకూ ట్రాఫిక్ ఆపేసేవారు. చివరకు జగన్ హెలికాప్టర్‌లో వెళ్లినా, కింద ట్రాఫిక్ నిలిపేసి ఇబ్బందిపెట్టేవారు. అమరావతిలో అయితే జగన్ సచివాలయానికి వచ్చి వెళ్లే వరకూ.. ఇంటికో పోలీసు గ్రామంలో కాపలా కాసి, అమరావతి ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానిచ్చేవారు కాదు. దానితో సామాన్య ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఎన్నికల్లో పనిచేసింది. దానిని దృష్టిలో ఉంచుకుని.. తమ పాలనలో పరదాలు కట్టి తప్పు చేశామని జగన్ పశ్చాత్తపం వ్యక్తం చేస్తే, సానుకూల ఫలితాలు ఉంటాయని సీనియర్లు సూచిస్తున్నారు.

ఇక పార్టీ నాయకులకు సమయం ఇవ్వకపోవడంపై అప్పట్లో జగన్‌ను సొంత పార్టీ నేతలే విమర్శించేవారు. ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పెద్దారెడ్డి ఖర్మానికి వదిలేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తమయింది. అటు వాలంటీర్ల వ్యవస్థతో ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన వైనం పార్టీని ఓడించేందుకు కారణమయింది. తమ ఓటమికి వాలంటీర్లే కారణమని, మాజీ మంత్రి గుర్నాధరావు కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పార్టీ నాయకులకు తగిన సమయం కేటాయించకుండా పొరపాటు చేశామని జగన్ చెబితే, పార్టీ నాయకుల్లో కూడా మళ్లీ ఉత్సాహం వస్తుందని చెబుతున్నారు. నిజానికి జగన్ సైతం రెండు, మూడు సందర్భాల్లో కరోనా వల్ల కార్యకర్తలకు సరైన న్యాయం చేయలేకపోయామని, ఈసారి అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని వాదించి, నేనే రాజు-నేనే మంత్రినని భావించే జగన్.. వారి అభిప్రాయాలను గౌరవిస్తారనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఆయనలో అలాంటి మార్పు వచ్చిన దాఖలాలు, తమకేమీ కనిపించలేదని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన ఇంకా కోటరీ చట్రంలోనే చిక్కుకున్నారే తప్ప, నేలమీదకు వచ్చి ఆలోచించడం లేదని పలువురు సీనియర్లు బహిరంగంగానే చెబుతున్నారు.

‘మా నాయకుడి లో ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. జనం మనల్ని ఓడించి పొరపాటు చేశారనే భావిస్తున్నారు. మళ్లీ మనమే వస్తామంటున్నారు. ఇలాంటి భావన నేను చంద్రబాబులో కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాత చూసేవాడిని.ఆయనయితే మాకు పర్సంటేజీల తేడాల గురించి చెప్పేవారు. జగన్ గారయితే పార్టీ నియామకాలపై కూడా కసరత్తు చేయరు. సజ్జలతోపాటు , కోటరీ తయారు చేసిన లిస్టునే ఆమోదిస్తారు. ఇక అలాంటి నాయకుడి నుంచి క్షమాపణలు ఆశించడం అత్యాశ. రాహుల్ గాంధీకి అంటే రాజకీయ చరిత్ర, ఒక స్థాయి ఉంది. రాహుల్ క్షమాపణ తర్వాత తటస్థులు, మేధావులు, విద్యావంతుల్లో ఆయనంటే సానుకూలత, మెచ్చుకోలు కనిపిస్తోంది’’ అని ఢిల్లీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మరో సీనియర్ నేత విశ్లేషించారు.

LEAVE A RESPONSE