– టీడీపీ అంటే ఒక జవాబుదారి పార్టీ
– హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హిందూపురం: రాయలసీమ గడ్డ నాఅడ్డా.. టీడీపీ కార్యక ర్తల జోలికి వస్తే తాటతీస్తా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్. హిందూపురం ప్రజలకు అండగా ఉంటా నని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ నేతలను హెచ్చరించారు. సోమవారం హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
హిందూపురం మండలం ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు హిందూపురం అంటే రెండో పుట్టినిల్లుగా భావించేవారని బాలకృష్ణ అన్నారు. టీడీపీ అంటే ఒక జవాబుదారి పార్టీగా పేరుగాంచిందని చెప్పారు.
సీఎం చంద్రబాబు ఒక విజనరీ ఉన్న లీడర్ అని, కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో రూ. 50 కోట్ల నిధులతో పనులు చేయించానని గుర్తుచేశారు. హిందూపురంలో శాశ్వత తాగునీటి పథకానికి రూ. 136 కోట్ల నివేదికలు సిద్ధం చేశామని అన్నారు.
మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామని తెలిపారు. 1984లోనే ఎన్టీఆర్ తూముకుంట వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం, హిందూపురం ప్రజలు మర్చి పోలేనిదని అన్నారు.