– గాలి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీ ఖాన్లకు ఏడేళ్ల శిక్ష
– సబితా ,ఏ8 కృపానందం నిర్దోషి
– సీబీఐ కోర్టు శిక్ష ఖరారు
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్ధన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఏ8 కృపానందంను నిర్దోషిగా సీబీఐ కోర్టు ప్రకటించింది.
ఈ కేసులో శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డితో పాటు ఏ3 వీ.డీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ7 అలీ ఖాన్లకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఓఎంసీ కేసులో కేసులో గాలి సోదరుడు బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది.
దాదాపు 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత నాలుగు చార్జ్షీట్లను ఇప్పటికే సీబీఐ కోర్టు ముందు సీబీఐ అధికారులు సమర్పించారు. 14 ఏళ్ల పాటు విచారణ అనంతరం సీబీఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
ఈ కేసులో ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి)కింద సీబీఐ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించారు. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని సీబీఐ విచారణలో అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే సీబీఐ కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది.
ఇదీ ఓబుళాపురం కథ
ఓబులాపురం అక్రమ మైనింగ్పై 2009, డిసెంబర్ 7న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2011లో మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొదటి ఛార్జ్షీట్లోనే ఏ1, ఏ2లుగా ఉన్న గాలి జానార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కలిసి అక్రమంగా ఓబులాపురం మైనింగ్స్ను తవ్వి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
దీని ద్వారా దాదాపు రూ.844 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆ ఛార్జ్షీట్లో పొందుపర్చారు. ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. వారి ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని ఈకేసులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి.
డాక్యుమెంట్ ఎవిడేషన్ను కూడా సీబీఐ న్యాయస్థానం ముందు పెట్టింది సీబీఐ. డాక్యుమెంట్ ఎవిడేషన్ కింది దాదాపు 3337 డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచింది. సాక్షుల స్టేట్మెంట్లు, డాక్యుమెంట్లను వెరిఫై చేసిన తర్వాత న్యాయస్థానం దోషులకు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అప్పటి ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మాత్రమే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ కాలేదు. ఈ కేసులో మిగిలిన నిందితులంతా కూడా అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఈ కేసులో సబిత డిశ్చార్జ్ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఈకేసులో ఈమె పాత్ర కీలకమని గతంలో డిశ్చార్జ్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
అయితే ఈ కేసులో సబిత, కృపానందరం పాత్ర లేదని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.