Suryaa.co.in

Telangana

అర్బన్ నక్సలైట్లను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టాలి

– విద్యా కమిషన్ సభ్యురాలు సుజాత సభ్యత్వాన్ని రద్దు చేయాలి
– ఆపరేషన్ సింధూర్ ను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సుజాత
– బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్: ఆపరేషన్ సింధూర్ ను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం అత్యంత సాహసోపేతంగా ఆపరేషన్ సింధూర్ పేరిట దాయాది దేశంలోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తే, దానిని తప్పుబట్టేవిధంగా ప్రొఫెసర్ సుజాత వ్యవహరించడం దుర్మార్గం. ఇది ముమ్మాటికి దేశద్రోహమే.

ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైన్యాన్ని అభినందిస్తూ కులమతాలకు అతీతంగా భారతీయులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తుంటే, అర్బన్ నక్సలైట్లు జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. రాష్ట్ర విద్యాకమిషన్ సభ్యురాలైన సుజాత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధి చాటుకోవాలి.

అంతేకాదు, తక్షణమే ఆమెను సస్పెండ్ చేసి, రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. లేకుంటే, భారత సైనిక శౌర్యపరాక్రమాలను కించపరిచేందుకు అర్బన్ నక్సలైట్లకు అనుమతిచ్చినట్టే అవుతుంది.

టెర్రరిస్టులు మారణాయుధాలతో మనపై దాడి చేస్తుంటే, ఇలాంటి అర్బన్ నక్సలైట్లు ఆయుధాలు వాడకుండానే అంతకన్నా ఎక్కువే దేశంపై, దేశ సమగ్రతపై దాడి చేస్తున్నారు. దేశద్రోహ చర్యలకు పాల్పడే అర్బన్ నక్సలైట్లను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టాలి. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ పార్టీని దూరం పెడతారు.

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వార్త విని పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. టెర్రరిస్టులకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇలాంటి ఆపరేషన్ లు మరిన్ని చేపట్టాలని వారు కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా భారత సైన్యం చేపట్టే ప్రతి చర్యకు ప్రజలు అండగా నిలవాల్సిన సమయంలో, సైనికుల మనోస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు.

LEAVE A RESPONSE