– దేశద్రోహ చర్యగా భావించి అరెస్టు చేయించాలి
– ఆపరేషన్ సింధూర్ ను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు
– బిజెపి ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
హైదరాబాద్: ఆపరేషన్ సింధూర్ ను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేయాలి. రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యత్వం నుంచి తొలగించాలి. అవసరమైతే, దేశద్రోహ చర్యగా భావించి అరెస్టు చేయించాలి.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం అత్యంత సాహసోపేతంగా ఆపరేషన్ సింధూర్ చేపడితే సూరేపల్లి సుజాత దానిని ఎగతాళి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ ను ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినందుకా? పహల్గాం లాంటి దాడులు మరిన్ని జరగాలని కోరుకుంటున్నారా?
యావత్ దేశం భారత సైనికుల శౌర్య పరాక్రమాలను కీర్తిస్తుంటే, కొందరు అర్బన్ నక్సలైట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులకు రుజువులు అడిగి అభాసుపాలయ్యారు. ఇప్పుడు అదే దుర్బుద్ధితో సూరేపల్లి సుజాత లాంటి అర్బన్ నక్సలైట్లు ఆపరేషన్ సింధూర్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
టెర్రరిస్టులు మారణాయుధాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటూ, అర్బన్ నక్సలైట్లు దేశద్రోహ భావజాలంతో విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అర్బన్ నక్సలైట్లను చేరదీస్తోన్న కాంగ్రెస్ ఇప్పటికైనా వారిని దూరం పెట్టాలి. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతారని గుర్తించాలి.
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలు నిండుమనసుతో స్వాగతిస్తున్నాయి. టెర్రరిస్టులకు గట్టిగా బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా వారు కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా భారత సైన్యం చేపట్టే ప్రతి చర్యకు ప్రజలు అండగా నిలవాల్సిన సమయంలో, సైనికుల మనోస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలి.