– ఆపరేషన్ సింధూర్ను కించపరిచిన ప్రొఫెసర్ సుజాతపై చర్యలు తీసుకోవాలి
– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్
హైదరాబాద్: భారత ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” పట్ల దేశమంతటా గర్వంతో స్పందిస్తున్న తరుణంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు మరియు శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరపెల్లి సుజాత అభ్యంతరకరంగా, హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఉగ్రవాదుల దాడిలో అమాయక 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనకు బదులుగా, ఉగ్రవాదులపై.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” పట్ల ప్రొఫెసర్ సుజాత “శవాలు, శకలాలు, రక్తసింధూరం” అంటూ అపహాస్యం చేయడం, దేశ భద్రతను తక్కువ చేయడమే కాకుండా, దేశభక్తి, రాజ్యాంగ నిబద్ధతను అవమానపరిచే చర్య.
ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి ప్రభుత్వ పదవుల్లో కొనసాగడం రాష్ట్ర ప్రజలకు, యువతకు, విద్యార్థులకు తప్పుదారి చూపే అంశం. సుజాతపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ప్రొఫెసర్ పదవి నుంచి ఆమెను సస్పెండ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యత్వం నుంచి తక్షణమే తొలగించాలి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా దేశాన్ని ప్రేమించే నాయకుడై ఉంటే, దేశ భద్రతను కించపరిచే వ్యక్తిని ప్రోత్సహించకూడదు. అధికార పదవుల్లో ఇలాంటి అర్బన్ నక్సల్ భావజాలాన్ని కలిగినవారిని తక్షణమే తొలగించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా భద్రతా బలగాలు మాత్రమే కాదు, వారికి అండగా నిలిచే ప్రజల మనోభావాలను గౌరవించాలి. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతారని గుర్తించాలి.