– ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శ
– పాక్ మిలటరీ అధికారి తీరుపై భారత్ ఆగ్రహం
– మరోసారి ప్రపంచం ముందు దోషిగా పాక్
ఢిల్లీ: భారత్లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ వంటి సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐ అండదండలు అందిస్తోందని భారత్ చేస్తున్న ఆరోపణ నూరు శాతం నిజమని తేలిపోయిన ఈ పరామర్శ ఘటన, పాకిస్తాన్ను మరోసారి అంత్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టింది.
అంతర్జాతీయంగా నిషేధానికి గురైన ఉగ్రవాద సంస్థ సభ్యులను, ఒక దేశ సైనికాధికారి పరామర్శించచిన వైనం వెలుగుచూడటంతో, పాకిస్తాన్ మరోసారి అడ్డంగా బుక్కయింది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో భారత్పై నిందలు వేయబోయి, ఐరాసతో అక్షింతలు వేయించుకున్న పాక్కు తాజా పరిణామం మరో శరాఘాతమే.
‘ఆపరేషన్ సింధూర్’లో జైషే మహమ్మద్కు చెందిన పలువురు ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న బహవాల్పూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారి సదరు ఆసుపత్రిని సందర్శించడం అంతర్జాతీయంగా మరోసారి పాక్ను చిక్కుల్లో పడేసింది.
అక్కడ చికిత్స పొందుతున్న జెఈఎం ఉగ్రవాదులను అధికారి కలుసుకుని, వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్స, కోలుకుంటున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ఆ అధికారి ఆసుపత్రి సిబ్బందికి సూచించినట్లు తెలుస్తోంది.
భారత్లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ వంటి సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐ అండదండలు అందిస్తోందని భారత్ చాలా కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా జరిగిన ఈ పరామర్శ ఘటన, ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. అంతర్జాతీయంగా నిషేధానికి గురైన ఉగ్రవాద సంస్థ సభ్యులను ఒక దేశ సైనికాధికారి పరామర్శించడం తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నారు. తనకు అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్న భారత్.. పాక్ను మరోసారి దోషిగా నిలబె ట్టేందుకు సిద్ధమవుతోంది.