రబీంద్రనాథ్ టాగోర్ జయంతి వేళ..
నొబేల్ పురస్కారాన్ని అందుకున్న ఆసియా ఖండపు తొలి కవి, యూరోపిఅన్ కాని తొలికవి రబీంద్రనాథ్.
రబీంద్రనాథ్ టాగోర్ కవి మాత్రమే కాదు నాటక, నవలా రచయిత కూడా. ఒక సంగీతజ్ఞులు ఆయన. రబీంద్ర సంగీతం అన్న ఒక సంగీత ధోరణి(genre) ఉంది. బంకిచంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం పాటను తొలి సారి స్వరపరిచి పాడింది రబీంద్రనాథ్.
రబీంద్రనాథ్ అనగానే మనకు ఆయన కృతి గీతాంజలి గుర్తుకు వస్తుంది. తెలుగులో ఆ గీతాంజలికి 300కు పైగా అనువాదాలు వచ్చాయి. అయినా రబీంద్ర కవిత తెలుగు కవితను ఏ మాత్రమూ ప్రభావితం చెయ్యలేకపోవడం దురదృష్టకరం. రబీంద్ర కవిత ప్రభావితం చేసుంటే తెలుగు కవిత ఇవాళున్న అతి దుస్థితిలో కాకుండా చాల మెరుగైన స్థితిలో ఉండేది. మత, కుల, ప్రాంతీయతా వాద ఉన్మాదకవులు, ఉచ్చల కవులు అంతర్జాతీయ స్థాయి రబీంద్ర కవిత్వం ఉందన్న సంగతైనా తెలుసుకోవాలి.
సినిమా నటుడు, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి జగ్గయ్యగారు రబీంద్ర గీత పేరుతో రబీంద్రుని కవితలు కొన్నిటిని అనువదించారు. జగ్గయ్య చాల గొప్పగా అనువదించారు.
వాటిల్లో కొన్ని పంక్తులు:
1 ఉదయ రోచిస్సు ప్రియవయస్యుని విధాన నా గృహద్వార సన్నిధి నగవు లీను…
2 ఇంద్రియ ద్వారముల మూయ నెపుడు నేను…
3 కార్మికుడు మమ్ము నడిపించు కర్మయోద్ధ!
4 బ్రతుకుతోఁ జేయిగలిపి నర్తన మొనర్చు.
బాగా చిన్నప్పుడు కనకమేడల అనువదించిన గీతాంజలిని చదివాను. ఆ వయసుకే గీతాంజలి నాకు నచ్చింది. తెలుగులో కవిత్వం అన్నదానికి నేను బలికాకుండా ఉండడానికి కారణం ఆ చదవడమేనేమో? తొంభై శాతం తెలుగు వాళ్లలా కవిత్వం విషయంలో నేను భ్రష్టుణ్ణి కాకపొవడానికి రబీంద్ర గీతాంజలి కూడా ఒక కారణం.
రబీంద్రనాథ్ టాగోర్ ఒక అంతర్జాతీయ స్థాయి కవి. ఇవాళ అంతర్జాతీయంగా ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ ఎక్కువగా ఏ విధమైంది చదవబడుతోందో ఆ విధమైంది రబీంద్ర కవిత.
తెలుగులో గత 50యేళ్లుగా గొప్ప కవులుగా(?) అనిపించుకుంటున్న వాళ్లకు ఇవాళ ప్రపంచంలో ఏది ఉత్తమస్థాయి కవిత్వంగా చలమణిలో ఉందో తెలియదు. దారుణమైన పరిస్థితి ఇది. వాళ్లకు లోక జ్ఞానం లేదు. సిగ్గు కూడా లేదని వేఱే చెప్పక్కఱ్లేదు. వాళ్లు ఒక్కటంటే ఒక్క కవిత అన్న తమ రచన్ని ఆ ధోరణిలో రాయలేకపోయారు.
ఎఱుక, పరిథి, అభిరుచి, ప్రతిభ లేకపోవడం అందుకు కారణాలు. మతం, కులం, ప్రాంతీయత, మందు, ముఠాతత్త్వం, అసభ్యత వీటితో తెలుగు కవులు(?) కవిత్వాన్ని కుళ్లబెట్టారు. రబీంద్రుడి రచనలపట్ల ఉండాల్సిన ఆసక్తి, అభినివేశం తెలుగులో లేవు.
రబీంద్రనాథ్ పై శ్రీశ్రీ పేలిన మాటలు ఆయన కుత్సితానికో లేదా కపటానికో లేదా ఆయన వికారానికో నిదర్శనాలు. రబీంద్రుడు ఒక కవిగా ఎందుకు అంతర్జాతీయమయ్యాడో తెలుగు కవికి, విశ్లేషకుడికి తెలియరాలేదు.
కులవాద, మతవాద, ప్రాంతీయతా వాద ఉన్మాదంతో, అసభ్యతతో, బూతుతో, కవుల(?)వల్ల, విమర్శకుల(?)వల్ల, కమ్యూనిజమ్ వల్ల తెలుగు కవిత్వం కకావికలం అయిపోయింది.
“మురికిని మంచినీళ్లతోనే శుభ్రం చేసుకోవాలి’ ఆన్న తీరులో అంతర్జాతీయ స్థాయి కవిత్వంతో మనం తెలుగు కవిత స్థితిని, గతిని పునర్నిర్మించుకోవాలి. ఆ పనిలో భాగంగా రబీంద్రనాథ్ కవితకు మాలిమి అవుదాం.
రబీంద్ర జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళిగా ఆయన ఒక కవితను తెలుగులోకి తెస్తున్నాను. ఇదిగో…
* *
అదెందుకు జరిగింది?
ఎందుకు దీపం బయటకు వెళ్లిపోయింది?
నేను దాన్ని తొడుగుతో మూశాను గాలి నుంచి దాన్ని కాపాడుదామని,
అందుకే ఆ దీపం బయటకు వెళ్లిపోయింది.
ఎందుకు పువ్వు వాడిపోయింది?
నేను ఆత్రం నిండిన ప్రేమతో నా హృదయానికి హత్తుకున్నాను,
అందుకే ఆ పువ్వు వాడిపోయింది.
ఎందుకు ప్రవాహం ఎండిపోయింది?
నేను నా ఉపయోగం కోసం ఆనకట్ట కట్టాను,
అందుకే ఆ ప్రవాహం ఎండిపోయింది.
ఎందుకు నా వీణ తీగ తెగిపోయింది?
నేను దాని శక్తికి మించిన స్వరాన్ని బలవంతంగా ప్రయత్నించాను,
అందుకే ఆ వీణ తీగ తెగిపోయింది.
*
ఇవాళ తెలుగు కవిత్వాన్ని ఉచ్చలమయమూ చేసేశారు… ఈ స్థితి నుంచీ, శివారెడ్డి, గోపి, అఫ్సర్ వంటి వాళ్లను కూడా గొప్ప, ప్రముఖ కవులు అని అనుకోబడుతున్న దుస్థితి నుంచీ, దుర్గతి నుంచీ, మానసిక రుగ్మతల నుంచీ
కవిత్వాన్ని నిలబెట్టుకునేందుకు రబీంద్రుడి కవిత ఇవాళ తెలుగుకు ఎంతో అవసరం

9444012279