ఆత్రేయ జయంతి వేళ..
ఎన్నో గొప్పనాటకాలూ, ఆ నాటకాల్లో ఎన్నో గొప్ప మాటలు, ఎన్నో గొప్ప సినిమా పాటలు, సినిమాల్లో ఎన్నో గొప్ప మాటలు రాసిన గొప్ప రచయిత, కవి ఆత్రేయ.
సముద్రాల రాఘవాచార్య, మల్లాది రామకృష్ణశాస్త్రి, పింగళి ఈ ముగ్గురి తరువాత ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా సాహిత్యాన్ని చాల ప్రశస్తంగా నడిపించారు.
‘ఒక భాష సినిమా పరిశ్రమ ఒక రచయిత, కవి చుట్టూ తిరగడం ఆత్రేయ విషయంలో జరిగింది’. ఒక దశలో తెలుగు సినిమా ఆత్రేయ చుట్టూ తిరిగింది.
“అనుకున్నామని జరగవు అన్నీ,
అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని
అనుకోవడమే మనిషి పని” అని అంటూ ఆత్రేయ మనిషి జీవనానికి అవసరమయ్యే గొప్ప సూచన చేశారు.
సరళమైన భాష, శైలి, మనసుల్ని కదిలించగలిగే భావాలు వీటితో తెలుగు ప్రజలకు ఎంతో కావాల్సిన వారయ్యారు ఆత్రేయ.
ఆత్రేయ ఎన్.జీ.ఓ. నాటకం అప్పట్లో ఒక సంచలనం.
“డబ్బు డబ్బును సంపాయిస్తూంటుందీ కాలంలో”
“పల్లె పడుచు చేతిలో కొడవలుండక రాకెట్టుంటాందాండీ” వంటి సంభాషణలున్న నాటకాలతో ఆత్రేయ ఒక నాటక రచయితగా మధ్యతరగతి మధ్యలో పెద్ద పీట వేయించుకున్నారు.
“పాడుతా తీయగా చల్లగా
పసిపాపలా నిదురపో తల్లిగా”
అని అంటూ ఒక జోల పాట రాసిన ఆత్రేయ-
తోడు నీడ సినిమాలోని “అత్త ఒడి పూవువలే మెత్తనమ్మా…” పాటలో అచ్చతెలుగు పదాలతో “అమ్మలు కన్నుల్లు తమ్మి పూవుల్లు
తమ్మి పూవులు పూయు తళిరు వెన్నెల్లు” అని రాశారు.
సిరిసంపదలు సినిమాలోని నిండు “పున్నమి జాబిలి…” పాటలో “ఆలుక చూపి అటువైపు తిరిగితే
అగపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపువ్వులు
నీ నవ్వులకర్థం తెలిపేను” అని గొప్పగా రాశారు.
ఓ బాటసారి “ఇది జీవిత రహదారి…” పాటలో “కడుపు తీపికి ఋజువేముంది?
అంతకు మించిన నిజమేముంది?” అన్నారు.
“చూపుకన్నా ఎదురు చూపులే తియ్యన…” అన్నారు. “ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది అది కలిమి లేములను మరిపిస్తుంది” అన్నారు. “నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు” అన్నారు. “చేసినాను ప్రేమ క్షీరసాగర మథనం మింగినాను హలాహలం” అన్నారు. “మౌనమే నీ భాష ఓ మూగ మనసా” అన్నారు. ” “తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు ఏలాగైనా మనసుకొక్క గాయమైన మాసిపోదు చితిలోనైనా” అన్నారు. ఇది ఉర్దూ గజల్ స్థాయి అభివ్యక్తి. ఎన్నో గొప్ప భావాల్ని ఎంతో గొప్పగా విరచించారు ఆత్రేయ.
గొప్ప కవిగా తెలుగులో నిలబడిపోయారు ఆత్రేయ.
‘సినిమా పాటలను కూడా మాటలుగా అంటే గేయత్వం లేకుండా రాస్తాడు’ అని అనిపించుకున్న ఆత్రేయ “రేపంటి రూపం కంటి పూవింటి తూపులవంటి…” వంటి చిక్కటి గేయత్వంతోనూ పాటలు రాశారు. “తేటతేట తెలుగులా తెల్లవారి వెలుగులా” చిక్కటి గేయత్వంతో కడు గొప్ప పాట. “రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి” అని ఆ పాటలో ఆత్రేయ అనడం ఉర్దూ గజళ్లలో కనిపించే గజలియత్. “జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడూ” పాట భావం, పదాల పరంగా చక్కటి నిర్మాణం. “నేల మీది జాబిలి నింగిలోని సిరిమల్లి,..” పాట ఎంతో గొప్పగా రాశారు ఆత్రేయ.
‘ఆత్రేయపై తమిళ్ష్ కవి కణ్ణదాసన్ ప్రభావం ఉంది’ అన్నదాన్ని, అనడాన్ని ఆత్రేయే ఒప్పుకున్నారు. అంత ఆ కణ్ణదాసన్ కూడా ఆత్రేయ నుంచి తీసుకున్నారు. “నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి” అని ఆత్రేయ అన్నదాన్ని కణ్ణదాసన్ తీసుకున్నారు.
“తలచినదే జరిగినదా దైవం ఎందులకు” పాట పల్లవి చరణాలలో కణ్ణదాసన్ ను తీసుకున్నా ఆత్రేయ రెండవ చరణం మూలానికి భిన్నంగా “ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం… ” అంటూ చాల గొప్పగా రాశారు.
కణ్ణదాసన్ రాసిన సందర్భాలకు, ట్యూన్లకు కొన్నిసార్లు ఆత్రేయ చాల మెరుగ్గా రాశారు. గుప్పెడు మనసు సినిమాలో “నువ్వేనా…” పాట తమిళ్ష్ లో కణ్ణదాసన్ రాసిన దానికి సమాంతరంగా గొప్పగా ఉంటుంది. అందమైన అనుభవం సినిమాలోని కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు పాట తమిళ్ష్ లో కణ్ణదాసన్ రాసిన దానికన్నా మేలుగా ఉంటుంది.
ఆత్రేయ కాలం నుండీ తెలుగులో గొప్ప కవిత్వం అనేది ఎక్కువ శాతం సినిమా పాటల్లోనే వచ్చింది. (శేషేంద్ర, సినారె, దాశరథి కవిత్వం మినహాయింపు) ఆత్రేయ మొదలుగా ఇవాళ్టి వరకు సినిమా పాటల్లోనే బయటకన్నా గొప్ప కవిత్వం వస్తోంది.
ఆత్రేయ రాసినన్ని మనసు పాటలు ప్రపంచంలో మరే కవీ రాయలేదు. ఎంతో చెప్పచ్చు వారి గురించి, ఎంతో చెప్పుకోవాలి వారి గురించి.
ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు.
మనసు పండడం వల్లో, పండిన మనసు ఉండడం వల్లో ఆత్రేయలాంటి కవులు ఉంటారు. ఆత్రేయ గొప్ప మాటగానూ, గొప్ప పాటగానూ మనతో ఎప్పుడూ ఉంటారు.

9444012279