తెలుగు భక్తుల కోసం అయోధ్య, కాశీలో వసతి, పార్కింగ్ వంటి నిర్మాణాలకు భూమి కేటాయించాలి
– యూపీ సీఎంకు రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
-డాక్టర్ కె.లక్ష్మణ్ విజ్ఞప్తి
తెలుగు రాష్ట్రాల నుండి అయోధ్య శ్రీరామమందిరం మరియు కాశీ విశ్వనాథ ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయోధ్య శ్రీ రామమందిరం మరియు కాశీ విశ్వనాథ ఆలయాలను దర్శించేందుకు తెలుగు రాష్ట్రాల నుండి తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి వినతి పత్రం అందజేశాను.
ఈ క్రమంలో భక్తులకు తక్కువ ధరలకు సురక్షితమైన వసతి, భోజన, పార్కింగ్, శుచి గృహాల వంటివి అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్ల అవసరం ఉంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ రోజు నేను (డా. కె. లక్ష్మణ్, ఎంపీ – రాజ్యసభ) లక్నోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి.. కాశీ మరియు అయోధ్యలో వసతి, భోజన, పార్కింగ్, శుచి గృహాల వంటి నిర్మాణానికి అవసరమైన భూమిని – కనీసం 2000 చదరపు గజాల నుండి 1 ఎకరం వరకు కేటాయించాలని కోరాను.
భూమిని కేటాయించిన తర్వాత, అవసరమైన వసతుల నిర్మాణాన్ని నా ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా లేదా ఇతర సంబంధిత నిధుల సహాయంతో చేపడతానని సీఎం గారికి తెలియజేశాను. దక్షిణాది రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో, వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్తున్నాను.
ఈ విషయం పట్ల ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం చాలా ఆనందంగా ఉంది. దీంతో భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చడమే కాకుండా, తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి స్పందన హర్షణీయం. భవిష్యత్లో తెలుగు భక్తుల యాత్ర మరింత సౌకర్యవంతంగా, గౌరవప్రదంగా ఉండేలా చర్యలు తీసుకుంటాను.