Suryaa.co.in

Telangana

ఓటేసిన పాపానికి రైతులను కాటేసిన కాలనాగు కాంగ్రెస్

– కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు
-తెలంగాణ రైతులను అవమానించిన పీసీసీ అధ్యక్షుడు
-ఇక్కడి వనరులు చూసి ఎందరో బతకడానికొచ్చారు
-వలస రైతులు మనకు వ్యవసాయం చేయడం నేర్పారనడం సరికాదు
-పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి
-లేదంటే నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టనివ్వం
-మంత్రులు తుమ్మల, ఉత్తమ్ ల నోట అదే అరిగిపోయిన రికార్డ్
-బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులని, వారికి బొత్తిగా తెలంగాణ సోయిలేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన రైతులు వ్యవసాయం చేయదం నేర్పారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిస్సిగ్గుగా అనడం ద్వారా తెలంగాణ రైతులను ఘోరంగా అవమానించారని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వేల సంవత్సరాలుగా
వ్యవసాయం చేస్తున్న తెలంగాణ రైతులు దేశానికే రోల్ మోడల్ అని జీవన్ రెడ్డి అభివర్ణించారు.

వ్యవసాయ రంగంలో తెలంగాణ రైతులు అగ్రగణ్యులని, ‘సాగు’ పాఠాలు నేర్పడం తప్ప నేర్చుకునే స్థితిలో వారు లేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో సాగు వనరులు చూసి ఎక్కడెక్కడి నుంచో ఎందరో బతకడాని కొచ్చారని ఆయన గుర్తు చేశారు. కానీ వలస రైతులు మనకు వ్యవసాయం చేయడం నేర్పారనడం సరికాదన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రాజకీయ అపరిపక్వతకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ రైతులు ఆగమయ్యారని, తెలంగాణ వ్యవసాయరంగం చితికిపోయిందని ఆయన అన్నారు.

ఈ నిజం మరిచి ఎవరి మెప్పో పొందడానికి ఏ రోటి కాడ ఆ పాట పాడే మహేష్ కుమార్ గౌడ్ అవకాశవాద రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పీసీసీ అధ్యక్షుడు భేషరతుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆయనను నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టనివ్వబోమని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కాగా, నిజామాబాద్ జిల్లా పర్యటనలో రైతులకు చేయని సాయం చేసినట్టు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ ల నోట అదే అరిగిపోయిన రికార్డ్ మారుమోగిందని ఆయన ఎద్దేవా చేశారు.రుణమాఫీ, రైతుభరోసా పై అమాత్యుల అబద్దాలకు హద్దే లేకుండా పోయిందని ఆయన ధ్వజమెత్తారు.ఓటేసిన పాపానికి రైతులను కాటేసిన కాలనాగు కాంగ్రెస్ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్ పదేళ్ళ పాలన రైతులకు వరం అని ఆయన తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, పంటల కొనుగోళ్లు, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటి చర్యలతో కళకళ లాడిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం కాంగ్రెస్ సర్కారు రావడంతో మసకబారిపోతోందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE