– బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రర్ రావు
హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టులో అదే అంశంపై కేసు పెండింగ్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు, ముందుగా హైకోర్టులో వాదనలు వినిపించాలి అని చెప్పడం సహజ ప్రక్రియ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామ్ చంద్రర్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే… కాంగ్రెస్ మంత్రులు పెద్ద హడావుడి చేసి ఏదో సాధిస్తామంటూ తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లారు. దీనిపై రాజకీయంగా ప్రయత్నిస్తూ, “ఏదో సాధించాం” అని కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూరం, పొరపాటే. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, హైకోర్టులో న్యాయనిపుణులతో వాదనలు వినిపించి బీసీలకు న్యాయం చేయాలి.
సుప్రీంకోర్టులో డిస్మిస్ కావడానికి కారణం హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండటం మాత్రమే. బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని బీజేపీ మొదటినుండి కోరుతోంది. అందుకు మద్దతు ఇచ్చాం, కట్టుబడి ఉన్నాం.
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు చేతకానితనం!
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేద, మధ్యతరగతి వర్గాలపై సిటీ బస్సు చార్జీల పెంచి భారం మోపిందని రామ్ చంద్రర్ రావు విమర్శించారు. ఒక చేతితో ఇచ్చి, మరో చేతితో లాక్కోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ. హైదరాబాద్-సికింద్రాబాద్లో సిటీ బస్సుల కనీస ఛార్జీని ఒక్కసారిగా రూ.10 పెంచడం పేద, మధ్యతరగతి ప్రజలపై నేరుగా భారం మోపుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బస్సు ఛార్జీల పెంపును రద్దు చేయాలి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికకు అభిప్రాయాలు సేకరించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం. ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, కోమల ఆంజనేయులు ఉన్నారు. కమిటీ ద్వారా పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేసి ప్రకటిస్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.
భారతీయ జనతా పార్టీలో చేరికలు
మహేశ్వరం నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ్ చందర్ రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రామ్ చందర్ రావు కొత్తగా పార్టీలో చేరినవారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముస్లిం మైనారిటీలు లబ్ధి పొందుతున్న నేపథ్యంలో, బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి.