Suryaa.co.in

Andhra Pradesh

పప్పుబెల్లాల్లా ప్రైవేటు బ్యాంకుల్లో వెంకన్న సొమ్ము డిపాజిట్లు

-జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిటు చయాలన్న నిబంధనకు పాతర
-తిరుపతి టౌన్ బ్యాంక్‌లో పదికోట్ల డిపాజిట్లు
-అది జాతీయ బ్యాంకా అని ప్రశ్నిస్తున్న భక్తులు
-ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా? లేదా?
-బ్యాంకు దివాలా తీస్తే ఎవరిది బాధ్యత
-చైర్మన్, ఈఓ, జేఈఓ నుంచి వసూలు చేస్తారా?
-భగ్గుమంటున్న వెంకన్న భక్తులు
-తిరుపతి టౌన్ బ్యాంక్‌లో టీటీడీ రూ.10 కోట్ల డిపాజిట్ పై దుమారం
– తిరుమల తిరుపతి శ్రీవారి సొమ్ము డిపాజిట్లపై వివాదం

తిరుమల వెంకన్న అందరివాడు. ఆయనకు భక్తులు రోజూ సమర్పించే ముడుపుల రూపంలో వచ్చే కానుకలు, వందలకోట్లకు పైమాటే. ఆ డబ్బుతోనే ఆలయ అభివృద్ధి-భక్తుల సౌకర్యాలు ఏర్పాటుచేస్తుంటారు. టీడీపీ పాలకవర్గం-అధికారులు కేవలం వాటికి కాపలాదారులే. టీటీడీ ఏం చేయాలన్నా దానికి కొన్ని నిబంధనలున్నాయి. దానినే అనుసరించి, అమలుచేయాలి.
కానీ ప్రస్తుత పాలకవర్గం ఒక ప్రైవేటు బ్యాంకులో అడ్డగోలుగా, నిబంధనలకు పాతరేసి 10 కోట్ల రూపాయలు డిపాజిటు చేసింది. నిబంధనల ప్రకారం జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిటు చేయాలి. ఆర్బీఐ అనుమతించి, ఆర్బీఐ వద్ద షరతుల మేరకు డిపాజిట్లు చేసిన ఇతర బ్యాంకులలో డిపాజిట్లు చేయవచ్చు. అంటే తగినంత సొమ్మును సదరు ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐ వద్ద గ్యారంటీ కింద చెల్లించాలి.

మరి టీటీడీ డిపాజిటు చేసిన తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బీఐ షరతుల మేరకు డిపాజిట్లు చేసిందా? అసలు బోలెడు జాతీయ బ్యాంకులు ఉండగా, ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్లు చేయాల్సిన పనేమిటి? ఇది ఎవరి మెహర్బానీ కోసం చేశారు? ఎవరి మెప్పు కోసం చేశారు? కమిషన్ల కోసం చేస్తే అది మహాపాపమే. ఒకవేళ సదరు బ్యాంకు దివాళా తీస్తే ఆ డబ్బు టీటీడీ చైర్మన్-డైరక్టర్లు-ఈఓ-జేఈఓ నుంచి వసూలు చేస్తారా? వెంకన్న సొమ్మును పప్పు బెల్లాల్లా పంచడానికి, టీటీడీ పాలకవర్గానికి ఏం అధికారం ఉంది?.. ఇదీ వెంకన్న భక్తుల ధర్మాగ్రహం.

టీటీడీ ట్రస్టు… అనుమతితో అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న టీటీడీ .. ఇప్పటివరకు ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, విజయ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లను తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో 8.5 శాతం వడ్డీ రేటుతో డిపాజిట్ చేయడంతో టీటీడీ బ్యాంకుల్లో శ్రీవారి నిధులు డిపాజిట్ చేయడం చర్చకు దారితీసింది.

తిరుమల తిరుపతి క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య సగటున రోజుకు 65 వేల నుంచి 70వేల మందికి పైగానే ఉంటుంది. రోజువారీ హుండీ ఆదాయం సగటున మూడున్నర కోట్ల నుండి రూ. 4 కోట్లు వరకు ఉంటుంది.

స్వామివారిని ఏడాదికి దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు 2.56 కోట్ల మందికి పైగా ఉంటుండగా టీటీడీ ఈమధ్య విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ.15938 కోట్ల నగదు డిపాజిట్లు. 10258 కిలో బంగారు డిపాజిట్లు తిరుమల వెంకన్న ఆస్తుల లెక్క చెప్పింది. ప్రతినెల శ్రీవారి హుండీ ఆదాయం కూడా రూ.100 కోట్లకు పైగానే ఉంటుండగా శ్రీవారి సొమ్ము డిపాజిట్ ల వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది.

తిరుపతి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో రూ.10 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా టీటీడీ డిపాజిట్ చేసిందన్న విషయం దుమారం రేపింది. తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో వెంకన్న ఖజానా నుంచి రూ.10 కోట్లు నిధులను డిపాజిట్ చేసింది. దీనికి సంబంధించిన డిపాజిట్ బాండ్లను కూడా టీటీడీకి టౌన్ బ్యాంక్ అందజేసింది.

టీటీడీ నిబంధనల మేరకు వడ్డీ కాసుల వాడి సొమ్ము అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలన్న నిబంధన టీటీడీలో ఉంది. మరోవైపు ప్రభుత్వం ఆమోదించిన ప్రైవేట్ రంగ బ్యాంక్ లు కొటేషన్లు సమర్పించే అర్హత పొందడానికి అత్యధిక క్రెడిట్ రేటింగ్ కలిగి వుండాలన్న షరతు కూడా ఉంది.

వెంకన్న సొమ్ము డిపాజిబ్ చేసేందుకు టీటీడీ జాతీయ బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తుందో తెలియజేస్తూ సీల్డు కవర్స్ లో కొటేషన్ లను పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లను తిరుపతి టౌన్ బ్యాంకులో 8.5 శాతం వడ్డీ రేటుతో డిపాజిట్ చేయడంతో, టీటీడీ బ్యాంకుల్లో శ్రీవారి నిధులు డిపాజిట్ చేయడం చర్చకు దారితీసింది.

టీటీడీ శ్రీవారి నిధులను సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు యత్నించడంపై గతంలోనూ భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇప్పుడు సప్తగిరి గ్రామీణ బ్యాంకు, తిరుపతి సహకార టౌన్ బ్యాంకుల్లో టీటీడీ రూ.50 కోట్ల వరకు డిపాజిట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రూ.10 కోట్లను గత వారం తిరుపతి టౌన్ బ్యాంక్ లో డిపాజిట్ చేసి బాండ్లను పొందడంపై విమర్శలను టీటీడీ ఎదుర్కోవాల్సి వచ్చింది.

తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు వంద ఏళ్ల చరిత్ర ఉందంటోంది. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో డిపాజిట్లను చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. టీటీడీ డిపాజిట్ చేసిన స్థానిక బ్యాంకులు దివాళా తీస్తే టీటీడీ కి వచ్చే ఆపార నష్టం పైనా దృష్టి సారించాల్సి అవసరం ఉందన్న అభిప్రాయం భక్తుల్లో ఉంది.

ఆర్ధికంగా పరిపుష్టి కలిగి ఉండే జాతీయ బ్యాంకులు, ఏ ఇతర కారణాలతో నష్టాలతో సమస్యలు ఉత్పన్నం కాకుండా నగదు రక్షణకు తీసుకుంటున్న చర్యల పట్ల టీటీడీ ముందస్తు సమాచారం భక్తులకు ఇవ్వాలన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది

LEAVE A RESPONSE