Suryaa.co.in

National

దూసుకొస్తున్న మిచాంగ్ తుపాను

– పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఢిల్లీ: దక్షిణ అండమాన్ సముద్రం మలక్కా జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇవాళ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ.. క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని… నవంబర్ 30 నాటికి ఇది మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు.

వాయుగుండం రానున్న 48 గంటల్లో నైరుతి, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ‘మిచాంగ్’ తుపానుగా పరిణామం చెందుతుందని వివరించారు. తుపాను ప్రభావంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 మధ్య దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

అండమాన్ నికోబర్ దీవుల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. తుపాను ధాటికి గంటకు 35 – 45 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్ 1న గంటకు 50 కి.మీ – 60 కి.మీ వేగంతో, డిసెంబర్ 2న గంటకు 50-60 కి.మీ నుండి 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు తీరప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం … బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాల కలెక్టర్‌లకు రాసిన లేఖలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

LEAVE A RESPONSE