Suryaa.co.in

Andhra Pradesh

తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో దళితుల ఎజెండా ఉండాలి

– అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య, పలువురు నాయకులు ఉద్ఘాటన

తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని, అందులో దళితుల జెండా, ఎజెండా బలంగా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాజకీయ పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారని, ఆ మేనిఫెస్టోలో వైకాపా పరిపాలనలో దగాపడ్డ, దిగాలు పడ్డ ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీల బతుకు తెరువుకు, భద్రతకు భరోసా ఇవ్వాలి అన్నారు.

ముఖ్యమంత్రి మేనమామ పేరు చెప్పి, దళితులకు చెందిన 27 రకాల సంక్షేమ పథకాలను నిలిపేశారని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లకు నిధులు లేకుండా చేశారని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను దూరం చేశారని చెప్పారు. 33 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారన్నారు. మరోపక్క నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ నుండి కంచికచర్ల శ్యాం కుమార్ వరకు దాడులు, హత్యలు, అత్యాచారాలు,శిరోముండనాలు, మూత్ర విసర్జనలు జరిగాయని తెలిపారు.ఈ సంఘటనలు అన్నింటిపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి భద్రత కల్పిస్తారో మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

కుంతీదేవి పాండవులకు అన్నం పెట్టేటప్పుడు సగభాగం భీమసేనుడికి, మరో సగభాగం మిగిలిన నలుగురు పాండవులకు పెడుతుందని, కురుక్షేత్ర యుద్ధంలోనూ భీమసేనుడి పాలు సగభాగమని అంటూ, రేపటి వైసిపిపై జరిగే యుద్ధంలో దళితుల పాత్ర భీమసేనుడి పాత్ర వంటిదని అభివర్ణించారు. 2009, 2019 లలో జరిగిన చారిత్రక తప్పిదాలను జరగనివ్వబోమని హెచ్చరించారు. అలాంటి తప్పులు జరిగితే రాష్ట్ర భవిష్యత్తును ఊహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు.

కలుపుకోవాల్సిన శక్తులను కలుపుకోవాలని, యుద్ధం సక్రమంగా జరగాలని , అందుకు తాము కాపలా కాస్తామని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బహుజన ఐకాస నాయకులు మామిడి సత్యం, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శిరంశెట్టి నాగేంద్ర రావు, నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు, ఐకాస కార్యదర్శి వజ్రాల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE