రాత్రింబవళ్ళు ప్రభుత్వ యంత్రాంగం వరద సహాయక చర్యల్లోనే..

-రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సకాలంలో అవసరమైన అన్నిముందుస్తు చర్యలు తీసుకోవడంతో గోదావరి వరదల్లో ప్రాణ నష్టం లేకుండా చూడ గలిగాం. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు,తూర్పు గోదావరి, ఏలూరు,పశ్చిమ గోదావరి,కోనసీమ జిల్లాలు అత్యధికంగా ప్రభావితం అయ్యాయి.

ఆయా జిల్లాల మంత్రులు,జిల్లా ఇన్చార్జి మంత్రులు, ఎంఎల్ఏలు, కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు,గ్రామ సర్పంచ్ ల వరకూ అంతా నిరంతరం రేయింబవళ్ళు క్షేత్రస్థాయిలోనే ఉండి ప్రజలకు సేవలందించారు.అన్నిటికంటే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా లంక, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి వారిని సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం లేకుండా కాపాడగలిగాం.

వరద ప్రభావానికి లోనైన 5 జిల్లాల్లో 191 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, లక్షా 30వేల 574 మందిని వాటిలోకి తరలించి వారికి అవసరమైన తాగునీరు,ఆహారం వంటి కనీస అవసరాలను కల్పించడం జరుగుతోంది. 256 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడం తోపాటు వదర ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబల కుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పునరావాస కేంద్రాలల్లోని వారికి కోటి 64 లక్షల ఆహార పొట్లాలను సిద్దం చేసి పంపిణీ చేశాం.

అదే విధంగా 14 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందించాం.ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు 10 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు ప్రాంతంలోని బాధితులకై 10వేల ఆహార పొట్లాలను అందించడంతో పాటు రాజమహేంద్రవరం నుండి మరో 10 వేల ఆహార పొట్లాలను కూడా పంపిస్తున్నాం. పునరావాస కేంద్రాల నుండి ఇంటికి తిరిగివెళ్ళే వారికి కుటుంబానికి 2వేల రూ.లు వంతున ఆర్ధిక సహాయాన్ని అందించండ జరుగుతోంది. అదే విధంగా వదర ప్రభావానికి లోనై పునరావాస కేంద్రాల్లో లేని కుటుంబాల వారికి కుటుంబానికి 25కిలోల బియ్యం,కిలో కందిప్పు,కిలో ఉల్లిపాయలు,కిలో బంగాళా దుంపలు, కిలో ఆయిల్ తోపాటు పాలు వంటి సరుకులను ఉచితంగా అందిస్తున్నాం. మరోవైపు కోనసీమ ప్రాంతంలో 31చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉండి గండ్లు పడే అవకాశం ఉన్న చోట్ల ఇసుకబస్తాలు వేసి గండ్లు పడకుండా ప్రజలను కాపాడాం.

చంద్రబాబులా ఏరియల్ విహార యాత్ర చేయలేదు
గత ప్రభుత్వంలో చంద్రబాబులా ఏరియల్ సర్వే పేరుతో హెలికాప్టర్‌లో విహార యాత్రలు మేం చేయలేదు. సీఎం జగన్‌ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏరియల్‌ సర్వే చేశారు. చంద్రబాబు హయాంలో వర్షాలు లేవు.. ఎప్పుడూ కరువే. దాంతో ప్రజాగ్రహం అనే వరదలో చంద్రబాబు కొట్టుకుపోయారు. వరద ప్రభావానికి గురైన ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం అంతా అహర్నిశలు శ్రమిస్తుంటే.. వాస్తవాలను కప్పి పుచ్చి కేవలం రాజకీయ లబ్దికోసం ప్రతిపక్షనేతలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు. చంద్రబాబు హయాంలో నిత్యం కరువు పరిస్థితులే నెలకొన్నాయి.

ప్రతిపక్షం అంటే ఆపదలో ఉన్న వారికి ఓదార్పు నివ్వాలి, ప్రభుత్వం అందించే సహాయ చర్యల్లో ఏమైనా లోపాలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలి తప్ప లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదు. పునరావాస కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాన్ని నేను కూడా స్వయంగా తిన్నాను. మీరు ఒడ్డున కూర్చుని విమర్శలు చేయడం కాదు. పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూడాలంటే.. రండి వెళదాం. మేమే స్వయంగా చూపిస్తాం. కానీ కొన్ని పత్రికా యాజమాన్యాలు రాజకీయంగా సమాధి అయిన చంద్రబాబును, పైకి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు తన రాజకీయాల కోసమే ప్రతి అంశాన్ని వాడుకుంటాడు.

హెలికాఫ్టర్ లో తిరిగితే ప్రజల కష్టాలు తీరతాయా.. అని మాట్లాడుతున్న చంద్రబాబులా వరదల్లో నాలుగు ఫోటోలు దిగి, మీ మీడియాలో ప్రచారం చేసుకుంటే కష్టాలు తీరతాయా..?. చంద్రబాబు మాట్లాడినంత మాత్రాన, రాసే ఈనాడు పత్రికకు అయినా బుద్ధి ఉండాలి కదా..? చంద్రబాబును చూస్తే వాన దేవుడు కూడా పారిపోతాడు. ఆయన హయాంలో ఎప్పుడూ కరువే. తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని ఓ వర్గం మీడియా తప్పుడు రాతలు రాస్తుంది. పిల్లలకు పాలు లేవు అని ఈనాడు రాతలు రాస్తుంది. మరి, లోకేష్ కు పాలు లేక.. చంద్రబాబు, ఈనాడు రామోజీ ఏడుపేమో. చంద్రబాబు ఏడిస్తే.. రామోజీకి ఎందుకు ఏడుపొస్తుందో వారే చెప్పాలి. వరద బాధితులను వదిలేశామనే రాతలు ఇకనైనా మానుకుంటే మంచిది.

మీ నాయకులు ఎవరైనా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారా అంటే లేదు. ఇటువంటి ప్రకృతి విపత్తు వచ్చిన సమయాల్లో, గతంలో ఒక అధికారి పనిచేస్తే.. ఇప్పుడు ఒకరి స్థానంలో సచివాలయాలు, జిల్లాల పునర్విభజన ద్వారా ఆరుగురు పనిచేస్తున్నారంటే, పరిపాలనను ఎంత సమర్థవంతంగా జగన్ గారు ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళామో అర్థం అవుతుంది.

పార్టీ పెట్టి 14 ఏళ్ళు అయినా, పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. నిన్న మండపేట వచ్చి.. తన పార్టీని ఏ పార్టీలో విలీనం చేయనని మాట్లాడితే.. ఎవరు నమ్ముతారు..?. పవన్ కల్యాణ్ కు విశ్వసనీయత ఎక్కడ ఉంది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి విశ్వరూప్ లు మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. రెండు రోజులుగా వరద పరిస్థితి ఉందని, అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం అని తెలిపారు. లంక గ్రామాల్లో కూడా భోజనం, వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా.. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో ఆయిల్, ఉల్లి, ఆలు గడ్డలు ప్రతి బాధిత కుటుంబానికి అందిస్తున్నట్లు తెలిపారు. వరదల్లో కూడా చంద్రబాబు బురద రాజకీయం చేయడం దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు విమర్శలను ఓ వర్గం మీడియాలో ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. మీడియా బాధ్యతగా ప్రవర్తించాలన్నారు.

Leave a Reply