చంద్రబాబుతో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ముచ్చట్లు

– ఎయిర్‌పోర్టులో మాటామంతీ
– తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు భేటీ అయ్యారు. బెంగళూరుకు వివాహ కార్యక్రమం కోసం వెళుతున్న పద్మారావును, అదే విమానంలో బెంగళూరుకు వెళుతున్న చంద్రబాబునాయుడు ఎదురయ్యారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంలో ‘ ఏం తమ్ముడూ బాగున్నావా?’ అని చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్‌padma-ncb పద్మారావును పలకరించారు. తర్వాత రన్‌వేలోని ఫ్లైట్‌ కనెక్టివిటీ బస్సులో ఇద్దరూ ప్రత్యేకంగా ప్రయాణించారు. ఆ సందర్భంగా రాజకీయ-కుటుంబ విషయాలు ముచ్చటించారు. ‘ఏపీలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందన్నా’ అని పద్మారావు వాకబు చేయగా.. ‘అక్కడ రౌడీరాజ్యం ఉంది. అసెంబ్లీలో నాలాంటి వాళ్లు మాట్లాడే పరిస్థితి లేదు. జగన్‌ అప్పులతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నార’ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వాస్తవ పరిస్థితి గ్రహించారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు.

ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎలా ఉన్నారని పద్మారావును చంద్రబాబు వాకబు చేశారు. పద్మారావు కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా పద్మారావు తన సతీమణిని చంద్రబాబుకుpadma-ncb1 పరిచయం చేశారు. తాము బెంగళూరులో బంధువుల వివాహ కార్యక్రమం కోసం వెళుతున్నామని, తమ కుటుంబం చాలా పెద్దదని, తానే అన్ని బాధ్యతలు తీసుకోవలసి ఉందని పద్మారావు వివరించారు.

ఈ సందర్భంగా రాజకీయ నాయకులు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీ ఆరోగ్యం ఎలా ఉందని చంద్రబాబును ప్రశ్నించగా పర్‌ఫెక్ట్‌లీ ఆల్‌రైట్‌ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత విమానంలో కూడా వారిద్దరు రాజకీయ-ఆర్ధిక-సంక్షేమ రంగాలపై చర్చించుకున్నారు. ఆ సందర్భంలో చంద్రబాబునాయుడు తన అనుభవాలను పద్మారావుతో పంచుకున్నారు. గతంలో చంద్రబాబునాయుడు తల్లి మృతి చెందినప్పుడు, పద్మారావు నారావారిపల్లెకు వెళ్లి బాబును పరామర్శించిన విషయం తెలిసిందే.

కాగా తాను చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని, అందులో ఎలాంటి ప్రత్యేక లేదని పద్మారావు చెప్పారు. కుటుంబసభ్యులతో బెంగళూరుకు వెళుతున్న సందర్భంలో చంద్రబాబు ఎయిర్‌పోర్టులో కలిశారని వివరించారు.

Leave a Reply