గుంటూరు : టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించిన ఘటన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గిలో నిన్న కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం తెలుగు జాతిని అవమానించినట్లే. దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే తెలుగుజాతి ఊరుకోదు’’ అని హెచ్చరించారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి యత్నించిన నేపథ్యంలో తెదేపా ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు దుర్గిలో 144సెక్షన్ విధించారు. పల్నాడు ప్రాంతంలో పలువురు తెదేపా నేతలను అరెస్టు చేశారు. కారంపూడి వద్ద తెదేపా నేత చిరుమామిళ్ల మధుబాబు, ఒప్పిచర్ల వద్ద జూలకంటి బ్రహ్మరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు- తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నరసరావుపేట తెదేపా ఇన్ఛార్జి చదలవాడ అరవింద్బాబును గృహనిర్బంధం చేశారు. ఘటనను ఖండిస్తూ గుంటూరు చంద్రమౌళినగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెదేపా నిరసన కార్యక్రమం చేపట్టింది. కోవెలమూడి రవీంద్ర, రావిపాటి సాయికృష్ణ, పిల్లి మాణిక్యాల రావు, హనుమంతరావు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసనలో పాల్గొన్నారు.