కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

కార్పొరేట్ పాఠశాలల కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం అమీర్ పేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్ధులకు అగర్ వాల్ సమాజ్ ఆధ్వర్యంలో షూస్ మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్ధులకు విద్యాబోధన జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన బస్తీ, మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం 7200 కోట్ల రూపాయలను కేటాయించారని పేర్కొన్నారు. మొదటి విడతలో 33 శాతం పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగా అమీర్ పేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 90 లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

వీటితో పాఠశాల భవనం మరమ్మతులు, పెయింటింగ్, టాయిలెట్స్ నిర్మాణం, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం కల్పించడం, ఫర్నిచర్ ను కొనుగోలు చేయడం వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఇవే కాకుండా విద్యార్ధులకు అవసరమైన క్రీడా సామాగ్రి, సాంస్కృతిక ప్రదర్శనలకు కావలసిన పరికరాలు, దుస్తులు వంటివి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలలో ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని 15 రోజులలో అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు.

తాను దత్తత తీసుకుంటున్న పాఠశాలను రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి, విద్యార్ధులు తమ విద్యను ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగించే విధంగా చేయూతను అందిస్తున్న అగర్ వాల్ సమాజ్ నిర్వహకులను మంత్రి ఈ సందర్బంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో అనుభవం కలిగిన టీచర్స్ ఉన్నారని, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా యూనిఫాం, పుస్తకాలను అందిస్తున్నదని మంత్రి తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ముందుగా కనకదుర్గమ్మ దేవాలయంలో అగర్ వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యూరిపైడ్ వాటర్ కూలర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధు, అగర్ వాల్ సమాజ్, అద్యక్షులు రితేష్ జగ్ నాని, రాజ్ కుమార్ అగర్ వాల్, డిప్యూటీ DEO యాదయ్య, సంజయ్, అనూప్ కేడియా, దినేష్ అగర్ వాల్, కునాల్ అగర్ వాల్, అంజనా జగ్ నాని, TRS అద్యక్షుడు హన్మంతరావు, గులాబ్ సింగ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply