Suryaa.co.in

Andhra Pradesh

తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే తనిఖీల పేరుతో ఇబ్బందులు

-వైసిపి నేతల వేధింపులతోనే చేనేత కుటుంబం ఆత్మహత్య
-మీ బిడ్డలా ఆశీర్వదించండి…మంగళగిరి రూపురేఖలు మారుస్తా
-మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో యువనేత లోకేష్

మంగళగిరి: ఎన్నికల నిబంధనల పేరుతో ఈ రోజు రెండుసార్లు నా వాహనాన్ని తనిఖీ చేశారని, మూడు రోజుల్లో నాలుగు సార్లు తనిఖీ చేశారు, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారని నారా లోకేష్ మండిపడ్డారు.

పోలీసులు ఫేమస్ అయ్యేందుకో, లేక రెడ్ బుక్ లో ఎక్కాలనో నా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ వాహనాలు తనిఖీ చేసిఉంటే కనీసం గంజాయి అయినా దొరికేది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వాహనం తనిఖీ చేసి ఉంటే ఆయన తీసిన సినిమా టేప్ లైనా దొరికేవని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు జగన్ కాలనీ, మంగళగిరి 23వవార్డు అంబేద్కర్ బొమ్మ సెంటర్, నులకపేట క్వారీ ఏరియాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు.

తొలుత ఇటీవల వైసిపినేతల మోసం కారణంగా ఆత్మహత్య చేసుకున్న రాజంపేట నియోజకవర్గం కొత్త మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు, పద్మావతి, వారి కుమార్తె వినయలకు లోకేష్ నివాళులర్పించారు. అనంతరం రచ్చబండ సభల్లో లోకేష్ మాట్లాడుతూ… జగన్ పాలనలో ఎస్సీ, బీసీ, మైనార్టీలపై దాడులు పెరిగాయి. కడప జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు వైకాపా నేతలే కారణం.

సుబ్బారావుకు ఉన్న మూడెకరాల భూమిని వైకాపా ఎమ్మెల్యే అనుచరులు తమ పేరు మీద మార్చుకున్నారు. దీనిపై పోరాడి చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది తట్టుకోలేక భార్య, కూతురు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యను చంపితే వారి కుటుంబాన్ని ఆదుకున్నాం. నేడు చేనేత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డా కనీసం జగన్ రెడ్డి పరామర్శించలేదు, పరిహారం ఇవ్వలేదు. వీరా బిసిల గురించి మాట్లాడేది, టీడీపీని విమర్శించేది?

దళితులు, మైనారిటీలన్నా జగన్ కు చిన్నచూపే!

దళితులంటే కూడా జగన్ రెడ్డికి చిన్నచూపే. దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు. అలాంటి వారిని జగన్ రెడ్డి తన పక్కనే కూర్చోబెట్టుకుని సమీక్షలు చేస్తున్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్నివేధించడంతో సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మిస్బా అనే బాలిక ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణం. నర్సరావుపేటలో వక్ఫ్ భూములను కాపాడుకునేందుకు పోరాటం చేసిన ఇబ్రహీంను దారుణంగా చంపారు. టీడీపీ పాలనలో ఏనాడూ ఎస్సీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరగలేదు. రేపు జగన్ ముఠా మనవీధికి వస్తారు, మన కుటుంబం దగ్గరకు వస్తారు. నందం సుబ్బయ్య చావుకు కారణమైన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?

మిస్బా, సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు లేవు. గత అయిదేళ్లుగా ఒక పథకం ప్రకారమే ఎస్సీ, ఎస్టీ, బిసిలపై వరుసదాడులు కొనసాగుతున్నాయి.

మంగళగిరిలో ఐదుసార్లు గెలిచినోళ్లు ఏం చేశారు?
మంగళగిరిలో రెండు కుటుంబాలను 5సార్లు గెలిపించారు, వారు మంగళగిరికి చేసిందేమిటి, నేను గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినా 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద పేదవారు నివసించకూడదని ఇళ్లు పీకేశారు.

ఇప్పటం, ఆత్మకూరులో కూడా ఇల్లు కూల్చేశారు. ఆత్మకూరులో ఇళ్ల కూల్చివేతను మేం అడ్డుకున్నాం. ఇప్పుడు కరకట్ట కమలహాసన్ ఓటుకూడా ఇక్కడ లేకుండా వేరేచోటకు మార్పించుకున్నారు. ప్రజలు ఒక్క ఛాన్స్ మాయలో పడి మోసపోయారు. కరెంట్ ఛార్జీలు 9సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 3సార్లు పెంచారు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారు. నేను 3,132 కి.మీల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నా.

రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపించండి. మంగళగిరి రూపురేఖలు మార్చాలన్నదే నా లక్ష్యం. నన్ను ఆశీర్వదించండి. దేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, పేదవారికి ఇళ్లు నిర్మిస్తాం. జగన్ కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు చేస్తాం. తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలో ఇళ్లు కూల్చేసిన 200 కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు.

30 కుటుంబాలకు ఇప్పటికీ ఇళ్లు కట్టించి ఇవ్వలేదు. నేను 5,350 ఓట్లతో ఓడిపోయాను, 53,500 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించండి… పేదవారికి ఇళ్లు నిర్మించి ఇస్తాం. దేవుడు నాకు మంగళగిరి ప్రజలకు సేవచేసే అవకాశం ఇచ్చారు. నేనుచేసిన మంచి కార్యక్రమాలు చూసి నన్ను గెలిపించండి. చంద్రబాబుతో దెబ్బలాడి నిధులు తెచ్చి మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది.

లోకేష్ వద్ద మంగళగిరి ప్రజల విన్నపాలు

జగన్ కాలనీ వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తాడేపల్లిలో కష్టపడి ఇళ్లు కొనుగోలు చేస్తే అక్రమంగా కూల్చేశారని, ఇప్పటివరకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుచేసి జగన్ కాలనీలో ఇళ్లు నిర్మించుకున్నామని, ఆదుకోవాలని కోరారు. రోడ్లు లేవని, వీధిలైట్లు ఏర్పాటుచేయాలని, తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఆసుపత్రి సౌకర్యం కూడా కల్పించాలన్నారు. రాత్రి 8 దాటితే జగన్ కాలనీకి వచ్చేందుకు సౌకర్యాలు లేవని, మహిళలు రావాలంటే తాగుబోతుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి 23వ వార్డు వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలు అందించాలని కోరారు. స్మశానాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలు పరిష్కరిస్తానని, ఎస్సీ కార్పోరేషన్ కు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నులకపేట క్వారీ ఏరియా వాసులు సమస్యలను విన్నవిస్తూ… ఎసైన్డ్, కొండప్రాంతంలో నివసించే వారికి పట్టాలు ఇప్పించాలి. రోడ్లు, డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అధికారంలోకి వచ్చాక పట్టాలు ఇప్పించే బాధ్యత నాది. నియోజకవర్గంలో అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE