Suryaa.co.in

Andhra Pradesh

మోదీ గురించి మాట్లాడే దైర్యం జగన్ కి ఉందా?

-బొత్సతో మోదీని తిట్టిస్తున్న జగన్ కి నేరుగా విమర్శించే దమ్ము ఉందా?
-మే 13 న ప్రజలు వైసీపీ ఫ్యాన్ కి ఉరి వెయ్యాలి
-ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స జగన్ కి తాకట్టు పెట్టారు
-జగన్ తప్పుడు ప్రచారం నమ్మెద్దు, నేనొస్తే రెట్టింపు సంక్షేమం
-పట్టాదారు పాసు పుస్తకాలపై ఉండాల్సింది జగన్ బొమ్మకాదు రాజముద్ర
-కూటమి అధికారంలోకి రాగానే హోంగార్డుల జీతాలు పెంచుతా
-చీపురుపల్లికి పరిశ్రమలు తెస్తా…తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి మీ పొలాలకు నీళ్లిస్తా
– చీపురుపల్లి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

చీపురుపల్లి: వైసీపీ అవినీతి, అరాచక, దోపిడి ప్రభుత్వానికి మే 13న ప్రజలు ఉరి వెయ్యాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం నాడు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ…..మేం అధికారంలోకి రాగానే బాదుడు లేని సంక్షేమం అందిస్తాం, పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఉత్తరాంధ్రకు బొత్స ఏం చేశారు? విశాఖను సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు దోచుకుంటుంటే నోరు మెదపకుండా వాళ్లకు బొత్స ఊడిగం చేశారు.

ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స తాకట్టు పెట్టారు. ఉత్తరాంధ్ర పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి. బొత్స సోదరుడు అప్పలనర్సయ్య గజపతి నగరం ఎమ్మెల్యే, మేనల్లుడు చిన్న శ్రీను జడ్పీ చైర్మన్, మరొక తమ్ముడు అప్పల నాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే, బొత్స భార్య విశాఖ ఎంపీ ఉత్తరాంధ్రలో బొత్స కుటుంబం తప్ప ఇంక వేరే ఎవరూ సమర్ధులు లేరా? బొత్స కుటుంబానికి సీట్లు ఇచ్చారని జగన్ ఉత్తరాంధ్రను దోచుకున్నా పట్టించుకోవడం లేదు.

మోదీ అవినీతి పరుడని బొత్స మాట్లాడుతున్నారు. మోదీ గురించి బొత్స కాదు.. ధైర్యం ఉంటే జగన్ మాట్లాడాలి. మరుసటి రోజు జగన్ ఎక్కడుంటారో చూడండి. బటన్ నొక్కి ప్రజలకు జగన్ ఇచ్చినది ఎంత.. జగన్ తిన్నదెంత? 5 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగాయా? జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే..ఎప్పుడూ నిజం మాట్లాడరు. సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ, అన్నక్యాంటీన్, పండుగ కానుకలు, చంద్రన్న భీమా వంటి 100 సంక్షేమ పధకాలు అమలు చేశాం. కానీ జగన్ రూ. 10 ఇచ్చి రూ. 100 దోచుకుంటున్నారు. జగన్ మ్యానిఫెస్టోలో పాత అంశాలే పెట్టి తన చేతకానితనాన్ని నిరూపించుకున్నాడు.

టీడీపీ హయాంలో ఒక్కసారి కరెంట్ చార్జీలు పెంచలేదు, నేడు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మద్య నిషేధంపై జవాబు చెప్పి జగన్ ఓటు అడగాలి. నాడు రూ. 60 ఉన్న క్వాటర్ నేడు రూ. 200 కి అమ్ముతున్నారు. ఈ డబ్బంతా జగన్ జేబులోకి వెళ్తున్నాయి. నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారో చెప్పాలి? జగన్ కి ఓటడిగే అర్హత లేదు. జగన్ రెడ్డివి నకిలీ రత్నాలు. ప్రజల జీవితాలను మార్చేందుకే సూపర్ సిక్స్ తెచ్చాం. వచ్చే ఐదేళ్లు అద్భుతంగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటా. డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు పెట్టింది నేనే. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీనే. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత నాది.

మే 13 న ప్రజలు వైసీపీ ఫ్యాన్ కి ఉరి వేయాలి
మీ పట్టాధారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మేంటి? ఆ భూములేమైనా జగన్ తాత ఇచ్చాడా? వైసీపీ నేతలకు పిచ్చి పట్టింది, విచక్షణా మర్చిపోయారు. ఇప్పుడిచ్చిన పాసుపుస్తకాలన్నీ చింపి చెత్తబుట్టలో వేస్తాం, ఆ పుస్తకాలు రద్దు చేసి కూటమి అధికారంలోకి రాగానే రాజముద్రతో పాసుపుస్తకాలు జారీ చేస్తాం. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారు, అది వస్తే మీ భూమి మీ పేరు మీద ఉండదు. 1 బీ, అడంగల్ ఏమీ ఉండదు. రికార్డులు తారు మారు చేసి తన వాళ్ల పేర్ల మీద రాసుకుంటారు. సెంటు భూమి అమ్మాలన్నా సైకో జగన్ అనుమతి కావాలి, అధికారంలోకి రాగానే ఈ చట్టం రద్దు చేస్తాం. ప్రజలు వైసీపీ ప్రభుత్వ ఉరి నుంచి బయట పడాలంటే మే 13 న జగన్ ఫ్యాన్ కి ఉరివేయాలి.

నేనొస్తే సంక్షేమ పధకాలు ఆగిపోతాయని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను వస్తే సంక్షేమ పధకాలు పెంచుతా, ఉద్యోగాలు, ఉపాధి కల్పించి ప్రజల ఆదాయం పెంచుతాం. నేనొస్తే జగన్ మద్యం దోపిడి, ఇసుక దోపిడి, భూ కభ్జాలు, అక్రమ మైనింగ్ ఆగిపోతుంది అదే జగన్ బాధ.

ఓటు అనే వజ్రాయుధంతో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి. మాకేం అని ఓటు వెయ్యకుండా ఇంట్లో ఉండొద్దు, ఏ మాత్రం ఏమారినా తర్వాత గొడ్డలి మీ ఇంటికొస్తుంది. వివేకానందరెడ్డిని ఎలా చంపారో వివేకం సినిమాలో చూపించారు, ఆ సినిమా ప్రజలంతా చూడాలి. బాబాయిని గొడ్డలితో లేపేసి నారాసుర రక్త చరిత్ర అంటూ డ్రామాలాడారు, కోడికత్తి డ్రామా ఆడారు, నేడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. జగన్ ఎప్పుడైనా నిజాలు మాట్లాడారా? నిజం చెబితే జగన్ కి తల వెయ్యి ముక్కలవుతుంది , అందుకే నిజాలు చెప్పడు. నేను అధికారంలకోకి రాగానే సూపర్ సిక్స్ అమలు చేస్తాం, పేదల్ని ఆర్దికంగా పైకి తెస్తాం.

బ్యాలెట్ ఓటింగ్ మొత్తం టీడీపీకే పడ్డాయి. పోలీసులు సైతం మనకే ఓట్లు వేశారు, ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ బకాయిలన్నీ ఇస్తాం. హోంగార్డుల జీతం రూ. 9 వేల నుంచి రూ. 18 వేలకు పెంచింది నేనే. అధికారంలోకి వచ్చాక రూ. 25 వేలకు పెంచుతా. టీడీపీ,జనసేన బీజేపీ కార్యకర్తల జోలికొచ్చిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. ఖబద్దార్.

తోటపల్లిని ప్రారంభించింది నేనే, దాన్ని పూర్తి చేసి చివరి భూములకు నీళ్లిస్తాం. పెర్రో అలాయస్ కూడా రివైజ్ చేసి వాళ్లకు న్యాయం చేస్తాం. ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. ఆర్.ఈసీకి సమస్యను పరిష్కరిస్తాం. మళ్లీ సొసైటీగా చేస్తాం. పొత్తులో భాగంగా ఎచ్చెర్ల బీజేపీ ఇవ్వటంతో ఇక్కడ కళా వెంకట్రావుకు సీటిచ్చాం. కిమిడి నాగార్జున భవిష్యత్ నేను చూసుకుంటా. కళా వెంకట్రావును ఎమ్మెల్యేగా అప్పలనాయుడిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు.

LEAVE A RESPONSE