Suryaa.co.in

Telangana

పసుపు రైతుల బాధలు పట్టవా…రేవంత్ రెడ్డి ?

– రైతుల కన్నీళ్లు తుడిచే బాధ్యత లేదా మీకు ?
– పసుపుకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు
– క్వింటాలు పసుపుకు రూ 15 వేల ధర కల్పిస్తామన్న హామీ ఏమైంది ?
– రూ 15 వేలు చెల్లించి ప్రభుత్వమే పసుపును కొనుగోలు చేయాలి
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్

హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పసుపు రైతులను చిత్తు చేస్తున్నాయని, పసుపు రైతుల బాధలు, కష్టాలు పట్టవా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పంటకు గిట్టుబాటు ధర లేక పసుపు రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

గిట్టుబాటు ధరలు లేక నిజామాబాద్ లో పసుపు రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి మద్ధతుగా మంగళవారం నాడు ఎమ్మెల్సీ కవిత ప్రకటన విడుదల చేశారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని నిలదీశారు. మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని ఎండగట్టారు.

క్వింటాలు పసుపుకు 15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు పసుపు కు కనీసం 9 వేలు రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బిజెపి, ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని, పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలవడం లేదని వివరించారు. పసుపు కు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర బండి సంజయ్ చెప్పారని, కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE