– సమస్యల సాధనకు సమరమే శరణ్యం
– సర్కారును మూడుచెరువుల నీళ్లు తాగించండి
– బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు
హైదరాబాద్: బి ఆర్ ఎస్ పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలి. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలి. బి ఆర్ ఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలి.
రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు….ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరత పై అసెంబ్లీ లో మండలి లో పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి.
రాష్ట్రం లో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరు పై మాట్లాడాలి. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డి ఎ ల పెండింగు పీఆర్సీ అమలు పై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మహిళలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కొట్లాడాలి. ఆరు గ్యారంటీ ల అమలు లో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలి.
విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదలచేయక పోవడం గురించి , వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రహజసమస్యలపై ఎండగట్టాలి.
దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాలి. గొర్రెల పెంపకం.. చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ మండలి లో ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బి ఆర్ ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని పశ్నించాలని అధినేత కేసీఆర్ నేటి సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.
కాగా. అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించింది. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజాసమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. బి ఆర్ ఎస్ అధినేత అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా….శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు పాల్గొన్నారు.