– పాత డేట్ వేసి, ఈఎన్సీతో సిడబ్ల్యుసికి ఉత్తరం రాస్తే ఏం లాభం?
– రేవంత్ రెడ్డి లేఖ రాయకపోవడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే
– మాజీ మంత్రి హరీశ్ రావు సూటి ప్రశ్న
హైదరాబాద్: గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్ లో ఉందని, ప్రాసెస్ చేస్తున్నం అని స్పష్టం చేస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23, 2025 తేదీ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిండు.
ఇదే విషయాన్ని నేను 11.10.2025 నాడు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి నిలదీశాను. అయినా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. అనుమతులు ఇవ్వొద్దు అంటూ కేంద్ర మంత్రికి ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయకపోవడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే.
06.10.2025 నాడు ఏపీ DPR టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాన్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి గానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గాని ఇప్పటివరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇదే విషయంలో తెలంగాణ ఇరిగేషన్ సెక్రెటరీ, ఎందుకు కేంద్ర జలశక్తి సెక్రటరీకి ఉత్తరం రాయడం లేదు?
పాత డేట్ వేసి, ఈఎన్సీతో సిడబ్ల్యుసికి ఉత్తరం రాస్తే ఏం లాభం? ఒకవైపు ఏపీ అక్రమ ప్రాజెక్టు కట్టేందుకు వేగంగా ముందుకు కదులుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలను బ్యాక్ డేటెడ్ లెటర్లతో మభ్యపెడుతున్నది. గోదావరి నదీ జలాలను వరద జలాల పేరిట తరలించేందుకు తలపెట్టిన ఏపీ అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నది.
ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు మొదలు.. డీపీఆర్ కు టెండర్లు ఆహ్వానించే వరకు ప్రతి సారి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, నిద్ర లేపుతూ వచ్చింది. బనకచర్ల ద్వారా తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాసే కుట్రలకు పాల్పడుతున్నదని ఎన్నిసార్లు ముల్లుకర్రతో పొడిచినా, రేవంతు రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు.
తెలంగాణ భవన్ వేదికగా మొన్న (11.10.2025) ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే, మూడు రోజుల తర్వాత నెమ్మదిగా నిద్రలేచి పాత డేట్ తో లేఖ విడుదల చేయడం సిగ్గుచేటు. బనకచర్లను అడ్డుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నిలదీసిన ప్రతి సారి.. లేఖలు రాయడం, ‘మ మ ‘ అనిపించి చేతులు దులుపుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారింది. చోద్యం చూడటం తప్ప బనకచర్లను నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చిత్తశుద్దితో చేసిన కృషి ఏమీ లేదు.
బనకచర్ల ప్రాజెక్టు నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వారి డిమాండ్లు, అభ్యంతరాలను స్పష్టంగా కేంద్రానికి తెలిపితే, తెలంగాణ మాత్రం ఇన్ని రోజులుగా మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటో రేవంత్ రెడ్డికే తెలియాలి. కర్ణాటక కాంగ్రెస్, ఆంధ్రా టీడీపీ, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంటే రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నడు.
22 నెలల్లో 55 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏనాడూ తెలంగాణ నీటి ప్రయోజనాలు గుర్తు రాకపోవడం మన దౌర్భాగ్యం. రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కుళ్ళు రాజకీయాలు మానేసి తెలంగాణ ప్రయోజనాల కొరకు అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్ళు. తెలంగాణ నీటి హక్కులు కాపాడటం కోసం న్యాయ పోరాటానికి సిద్ధపడు.