– ప్రభుత్వం దగ్గర పైసలు లేవా?
– సురేఖమ్మ, సీతక్క రాఖీ కట్టినప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అడగలేదు?
– కమిషన్లకు వచ్చే దగ్గర మాత్రం ప్రభుత్వానికి పైసలు ఉంటాయి
– ఫ్యూచర్ సిటీలో వీళ్ళు.. వీళ్ళ చుట్టాల భూములు
– ఈ 50 వేల కోట్ల కాంట్రాక్టు ఎక్కడి నుంచి వచ్చాయి రేవంత్ రెడ్డి?
– దమ్ముంటే గన్మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా యూనివర్సిటీకి రా
– రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మాట తప్పడం దుర్మార్గం
– స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఆశా కార్యకర్తలను పిలిపించి మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలి
– 50 వేల కోట్లకు కాంట్రాక్టులు పిలిచిన ప్రభుత్వానికి ఆశా కార్యకర్తలకు జీతం ఇవ్వడానికి డబ్బులు లేవా?
– హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆశా కార్యకర్తల మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: ఆశా కార్యకర్తలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మాట ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు.. మీరు ఏ మాటిచ్చారో ఆ మాట నెరవేర్చండి అని మీరు అడుగుతున్నారు. ఇది కొత్త విషయం కాదు. గొంతెమ్మ కోరిక అసలే కాదు. హెల్త్ డైరెక్టరేట్ దగ్గర ఆశా కార్యకర్తలను పోలీసులను పెట్టి కొట్టించారు.
మీరు ప్రభుత్వానికి టైం ఇచ్చారు పరిష్కరించడానికి. ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తారా లేదంటే ఉద్యమించమంటారా? ప్రభుత్వం దగ్గర పైసలు లేవా? కమిషన్లకు వచ్చే దగ్గర మాత్రం ప్రభుత్వానికి పైసలు ఉంటాయి. HMWSలో భాగంగా మల్లన్న సాగర్ నుండి హైదరాబాదు కు గోదావరి కాళేశ్వరం నీళ్లను తెచ్చి మూసి మోరీలు పూస్తా అని అంటున్నాడు.
గోదావరి నీళ్లను మూసిలో పోసేందుకు 6000 కోట్లను ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని చెప్తున్నారు. HMWS లో 4000 కోట్ల రూపాయలతో ఎస్టీపీలను రేవంత్ రెడ్డి పెడుతున్నాడు కమీషన్లు, కాంట్రాక్టుల కోసం. HMDA పదివేల కోట్లతో టెండర్లు పిలిచారు. GHMC లో 6000 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు.
ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల రహదారి కోసం టెండర్లు పిలిచారు. అక్కడ సిటీ లేదు ఏమి లేదు. వీళ్ళు వీళ్ళ చుట్టాల భూములు ఉన్నాయి. వీటన్నింటికీ మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశ కార్యకర్తలకు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు. ఈ 50 వేల కోట్ల కాంట్రాక్టు ఎక్కడి నుంచి వచ్చాయి రేవంత్ రెడ్డి? మా ఆశాలకు, అంగన్వాడీలకు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వనంటావా?
మాట తప్పావు రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ లేదు. మా ఉద్యోగులు డీఏ అడిగినా, జీపీఎఫ్ గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు అడిగినా డబ్బులు లేవు అని చెబుతావు. ఇంటిగ్రేటెడ్ స్కూలు పెడతా అన్నావు 250 కోట్లతో. పదివేల కోట్లతో టెండర్లు పిలిచారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం, ఊర్లలో పేదవారికి సేవ చేసే ఆశాలంటే ఎందుకు చిన్న చూపు రేవంత్ రెడ్డి?
కేసీఆర్ కరోనా సమయంలో ఆశా వర్కర్ల సేవలను ఎంత మంచిగా గౌరవించారో గుర్తుతెచ్చుకోండి. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాత్రింబవులు పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడిన ఆశా వర్కర్ల విషయంలో మాట తప్పడం అన్యాయం. ఆనాడు 2,200 ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని 10,000 కి పెంచుకున్నాం. గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు మీక్కూడా జీతాలను పెంచారు కేసీఆర్ .
రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు సంపాదన పెంచుడు తెలుసు. పంచుడు తెలుసు అన్నాడు. సంపద పెంచుడు నువ్వు నీ కుటుంబ సభ్యులు దంచుకొనుడు తప్ప, పేదలకు పెట్టే సోయి నీకు లేదు. ఆశాలు, అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఊర్లలో ఆసుపత్రిలో బీపీకి వాడే టేల్మా గోళీలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. గతంలో టేల్మా గోళీలు కావాలి ప్రజలు అడుగుతున్నారని మీరు నాకు చెప్తే, మన గవర్నమెంట్ బిపి కి టెల్మా గోలీలను తెచ్చి అందించాం.
గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కి కొంత డబ్బును కేటాయించే వాళ్ళం. శానిటేషన్ డబ్బులు కూడా గ్రామపంచాయతీలకు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. గ్రామపంచాయతీలో ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. గ్రామాల్లో విష జ్వరాలు విజృంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త సేకరణ లేదు. బ్లీచింగ్ పౌడర్ లేదు. గ్రామాలు నిర్వీరమైపోయాయి. దవాఖానకు పోతే సూది లేదు గోలి లేదు.
రేవంత్ రెడ్డి.. రేపో మాపో పంచాయతీ ఎలక్షన్లు పెడతా అంటున్నావ్. ఎలక్షన్లలోపు ఆశ కార్యకర్తలను పిలిచి మాట్లాడి వారి కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు వాళ్లే చేసి చూపిస్తారు. ఆరు గ్యారెంటీలు 4 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారు. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ.
ఈరోజు రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోతే విద్యార్థులను మూడు రోజుల ముందే అరెస్ట్ చేస్తున్నారు. గజానికో పోలీసోన్ని పెట్టి ఇనుప కంచెల మధ్య, నిర్బంధాల మధ్య యూనివర్సిటీని ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన బిల్డింగ్ ని ప్రారంభించడానికి పోయాడు. రేవంత్ రెడ్డి కట్టర్ జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. బీఆర్ఎస్ ప్రారంభించిన పనులకు రిబ్బన్లు కట్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి ఒక దవఖాన కట్టింది లేదు. బిల్డింగ్ కట్టింది లేదు.
రేవంత్ రెడ్డి మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశాడు. ఇప్పటివరకు పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు రెండు ఏండ్ల నుండి స్కాలర్షిప్ లేదు. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని మోసం. కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం అని మోసం.
దమ్ముంటే గన్మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా యూనివర్సిటీకి రా రేవంత్ రెడ్డి. ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే విద్యార్థులు తరిమికొట్టారు. సందులో పడి పారిపోయాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు బిల్లులు లేదు. అన్నం పెట్టిన కార్మికులకు 6 నెలల జీతాలు లేవు. కాంగ్రెస్ క్యాబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నా మహిళలయిన ఆశాలు, అంగన్వాడీలు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు. సురేఖమ్మ, సీతక్క రాఖీ కట్టినప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అడగలేదు? అవసరమైతే అసెంబ్లీని స్తంభింప చేసి మీ ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతాం.
ఆరోగ్యశ్రీ డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆశాలకు రావలసినవి కూడా ఇవ్వడం లేదు. 30వ తారీఖులోగా మా బిల్లులు ఇవ్వకపోతే ప్రైవేట్ హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పారు. వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయండి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆశా కార్యకర్తలకు నెల చివరి రోజున జీతాలు వేసేవాళ్ళం. ఉద్యోగులకు ఆపైనా సరే మీకు మాత్రం ఫస్ట్ తారీకులోపే వేసేవాళ్ళు. రేవంత్ రెడ్డికి ఆశాలన్నా అంగన్వాడీలన్నా చిన్నచూపు. గురుకుల హాస్టల్లో 6 నెలల నుండి మెస్ బిల్లులు, ఏడు నెలల నుంచి కాస్మోటిక్ చార్జెస్ లెవ్వు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ఛానల్ పెట్టి గురుకులాల బిల్లులు విడుదల చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పాడు. ముఖ్యమంత్రి కుర్చీకుండే విలువ కూడా రేవంత్ రెడ్డి దిగజార్చాడు.