– చెప్పుడు మాటలు వినొద్దు
– ఎటువంటి న్యాయపరమైన చిక్కులు తెచ్చుకోవద్దు
-ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సూచన
మంగళగిరి: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెగా డిఎస్సీ నిర్వహించింది. బాధ్యతాయుతంగా అధికారం చేపట్టగానే సీఎం చంద్రబాబు డిఎస్సీ ఫైల్ పై సంతకం చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులు పూర్తి చేస్తోంది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంటే జగన్ ఆయన వందిమాగాదులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే… బులుగు మీడియా.. నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తోంది.
కూలంకుశంగా పరిశీలించి ఆప్షన్ లు పెట్టుకోవాలని దరఖాస్తులు పూర్తిచేసేటప్పుడే తెలిపారు. ఈ విషయం నోటీఫికేషన్ లోనే స్పష్టంగా పేర్కొన్నారు. అర్హత సాధించినవారు, ఉద్యోగాలు పొందిన వారిని వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్న సమయంలో వారిలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. 15రోజుల్లో వారికి నియామక పత్రాలు అందజేసే సమయంలో ఇలాంటివాటికి తెరలేపడం సరికాదు. ఎవరెవరు ఏ పాఠశాలల్లో పనిచేయాలో స్థలాలు కూడా కేటాయిస్తాం. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటివి పనికిరాదు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం జగన్ కు, సాక్షి పత్రికకు కంటకంగా మారింది. డిఎస్సీలో నో ఆప్షన్, పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతలను ఆయా ఉద్యోగస్తులు ఎంపిక చేసుకున్నారు. మళ్లీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని ఉద్యోగాలు పొందినవారిలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికి ప్రజలకిచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ అకాశాలు కల్పిస్తోంది.
ప్రస్తుతం ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలి. గతంలో జగన్ 23 వేల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం 16,347 పోస్టులు భర్తీ చేయడం జరుగుతోంది. దరఖాస్తు చేసుకొనే సమయంలోనే ఎస్జీటీ కావాలా? లేక స్కూల్ అసిస్టెంట్ పోస్టా, ఉర్దూ పోస్టా, ఎది కావాలని ప్రశ్నిస్తూ ఆప్షన్లు పెట్టారు. ఇప్పుడు గందరగోళం సృష్టిస్తున్నారు. మంచిగా జరుగుతున్న ఈ తీరును తప్పుడు ట్రాక్ లోకి తీసుకెళ్లడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అనేక అనుమానాలను తెరమీదికి తెస్తున్నారు.
చెప్పుడు మాటలు వినద్దు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో అందరూ పాల్గొని రాష్ట్ర విద్యాభివృద్ధిలో అందరూ పాలుపంచుకోవాలి. ఏడెనిమిదేళ్లుగా రాష్ట్రంలో డిఎస్సీ జరగలేదు. నిరుద్యోగులు వారి స్వప్నాన్ని సాకారం చేసుకుంటున్న సమయంలో బ్లూ మీడియా లో వచ్చిందనో, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు మాట్లాడారనో ఎలాంటి అనుమానాలకు, ఆందోళనలకు గురి కావద్దు. ఆ రోజు ఏ ఆప్షన్ పెట్టుకున్నారో, ఆ ఆప్షన్ తోనే ముందుకెళ్లండి. గతంలో సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. 1998, 2008 డిఎస్సీలకు సంబంధించినవారు నేటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇలా న్యాయసంబంధమైన చిక్కుల్లో పడొద్దు. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ప్రస్తుతం ఇస్తున్న 16,347 ఉద్యోగాలకు అడ్డుపడుతున్నారు. వైసీపీవారు దీన్ని సమర్థించాలి, ఉద్యోగాలు పొందుతున్నవారిని ఆశీర్వదించండి, వారికి అండగా నిలవండి. మంచినీళ్లల్లో బురద జల్లే కార్యక్రమం మానుకోవాలి. అనేక మందికి వయసు పెరిగింది. వారికి ప్రభుత్వం సడలింపునిచ్చింది. జులై 1వ తేదినాటికి గరిష్ఠ వయోపరిమితి 44గా పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు వయో పరిమితి 49 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా నిర్ణయించి, ఈ డిఎస్సీ నిర్వహించింది. దీంతో చంద్రబాబునాయుడు, లోకేష్ అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారు.
జగన్ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కుంభకర్ణుడిలా నిద్రపోయారు. జగన్ రాష్ట్రంలో 23 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఎన్నికలు రెండు నెలలు ఉన్నాయనగ కుంభకర్ణ నిద్ర వీడి డిఎస్సీ వదిలారు. దాన్ని కూడా పూర్తి చేయలేని చేతకాని నేత జగన్. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య రెండు మెగా డిఎస్సీలు నిర్వహించి 18 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబుది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సమగ్ర శిక్షలో దాదాపు 720 నాన్ టీచింగ్ పోస్టులు ఇటీవల భర్తీ చేసింది.
గిరిజన ప్రాంతాల్లో 90 ఎస్టీలకు కొత్తగా ఉపాధ్యాయులను నియమించింది. 700 కోయభారతి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసింది. గెస్ట్ ఫ్యాకల్టీలుగా జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 700 మంది సిబ్బంది సేవలను పునరుద్ధరించింది. కేవలం 10 వేల తో పనిచేస్తున్నవారికి 27 వేల జీతాన్ని పెంచింది. కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని వారికి అండగా నిలిచింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉపాధ్యాయులను అనేక అవమానపాలు చేసింది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు వారు కేవలం పాఠ్యాంశాలపైనే దృష్టి పెట్టేందుకు అనేక చర్యలు చేపట్టారు. అనేక యాప్ లతో ఇబ్బంది పడే ఉపాధ్యాయులకు ఒకే ఒక యాప్ ను తెచ్చింది. అనేక విశ్విద్యాలయాల్లో సంస్కరణలు డిగ్రీ, ఇంజనీర్ కళాశాలల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు నారా లోకేష్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.
కూటమి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోంది. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో యాజమాన్యలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూడా గంటల తరబడి ఆయా సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. దేశంలోనే విద్యా రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు లోకేష్ ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు, బ్లూ మీడియా రాష్ట్రంలో పాఠశాలలు మూతపడుతున్నాయని, విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోతోందని దుష్ప్రచారం చేస్తున్నాయి.
రకరకాల అవాకులు, చవాకులు పేలుస్తున్నారు. వారందరకీ సవాల్ విసురుతున్నాను. 2019-24లో విద్యా వ్యవస్థ బాగుందా ఈ 15 నెలల కాలంలో విద్యా వ్యవస్థ బాగుందా జనాలు చెప్పాలి. కూటమి ప్రభుత్వ కాలంలోనే విద్యా వ్యవస్థ గాడిలో పడింది. యూనివర్శిటీలలో వైస్ ఛాన్సలర్ల నియామకంలో వైసీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామక విషయంలో నిష్ణాతులైన, రాజకీయాలతో సంబంధం లేనివారిని ఉప కులపతులుగా నియమిస్తోంది. యూనివర్శీటలను ప్రక్షాళన చేస్తున్నాం.
వైసీపీ హయాంలో వారి బంధువులు, వారి పార్టీ అనుచరులైన ప్రసాద్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సుందరవెల్లిలను వీసీలుగా నియమించారు. అనర్హులను విశ్వవిద్యాయల వైస్ ఛాన్సలర్లుగా నియమించి విద్యా వ్యవస్థనే భ్రష్టుపట్టించారు. అలాంటివాటికి అవకాశం లేకుండా విజ్ఞులైనవారిని వీసీలుగా నియమించి విద్యావ్యవస్థకు పెద్దపీట వేశాం. ఈ విషయాల్లో వైసీపీ నాయకులు అవకాకులు చవాకులు పేల్చడం తగదు. వైసీపీలాగ లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని ఉపాధ్యాయులకు బదిలీ ఆర్డర్లు ఇవ్వలేదు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం