Suryaa.co.in

Andhra Pradesh

బడ్జెట్‌ పేరుతో ఎన్నికల ప్రసంగం…

– ఆంధ్రకు గుండు సున్నా
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కేవలం బడ్జెట్‌ పేరుతో చేసిన ఎన్నికల ప్రసంగమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు.

స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్‌ను ఏనాడూ చూడలేదని దుయ్యబట్టారు. గత పదేళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు, వాస్తవాలకు ఏ మాత్రం పొంతన లేదని, పైగా వచ్చే ఐదేళ్లలో భారత్‌ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని చెప్పుకోవడం ఎన్నికల ర్యాలీల్లో చేసిన ప్రసంగంలా ఉందని అన్నారు.

‘డెమొక్రసీ, డెమొగ్రఫీ, డైవర్సిటీ’ వంటి పదాలను మోదీ ప్రసంగంలో తరచూ వింటూనే వున్నామని, కానీ ఏనాడూ వాటి అర్థాలకు అనుగుణంగా ఆయన పాలన లేదని, పైగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని గుర్తుచేశారు.

గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయని చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. అదానీ, అంబానీలకు ప్రజల ఆస్తులను మూకుమ్మడిగా అప్పగించడమే గుణాత్మక మార్పా అని ప్రశ్నించారు.

రైతులు, మహిళలు, యువకులు, పేదలు గత పదేళ్లలో అభ్యున్నతి సాధించారని ఆర్థికమంత్రి చెప్పిన ప్రతిమాట పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. వారిలో ఏ ఒక్క వర్గమూ బాగుపడలేదని అన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెపుతూనే, మరోవైపు 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందిస్తున్నామని అంటున్నారని, పేదరికం లేకపోతే ఉచిత రేషన్‌ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందని, నిర్మల తర్కం అర్థరహితమని వ్యాఖ్యానించారు.

పీఎం కిసాన్‌ కింద ఏటా 11.8 కోట్లను రైతన్నకు అందిస్తున్నామని, 4 కోట్ల మందికి పంటల బీమా అందిస్తున్నామని చెప్పుకున్నారని, వారి లెక్కలబట్టి చూసినా, నేటికీ 70 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతుల్లో కనీసం 60 శాతం మందిని ప్రభుత్వం విస్మరించిందని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. కనీస మద్దతు ధర కంటితుడుపుగా ఉందని అన్నదాతలే ఘోషిస్తున్నారని, వారి ఆవేదన మోదీకి వినపడలేదా అని రామకృష్ణ ప్రశ్నించారు.

2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని, మహిళల అభ్యున్నతిని కళ్లారా చూశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో 20 కోట్లమందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండాలని, ఆ లెక్కలేవో చెప్పాలని కోరారు. భారత్‌లో నిరుద్యోగం ఎన్నడూ లేని విధంగా పెరిగిందని, పేదరికంలో దేశం ఏ మాత్రం తగ్గలేదని ప్రపంచ నివేదికలే చెపుతున్నాయని గుర్తుచేశారు.

ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్‌ ధన్‌ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని, అసలు బ్యాంకింగ్‌ ఖాతాల్లో దాని శాతమెంత? ఇది విని మహిళాలోకం విస్తుపోతున్నదని, అదే జరిగి ఉంటే మహిళా పేదరికం ఇంత తీవ్రస్థాయిలో ఎందుకుంటుందన్నారు. దేశ సంపదలో మహిళల ఆస్తుల విలువ 2 శాతం మాత్రమే. ఈ విషయం మహిళా మంత్రికి తెలీదా?

రుణవ్యవస్థపై చెప్పిన గణాంకాలన్నీ కాకిలెక్కలని కొట్టిపారేశారు. విదేశీ పెట్టుబడిదారులకు బార్లా తలుపులు తెరవడం, అదానీ, అంబానీల్లాంటి కార్పొరేట్‌ శక్తులకు ప్రజా ఆస్తులను అప్పగించడం వంటి దుశ్చర్యలు మోదీ సర్కారు గత పదేళ్లలో చేసిందని, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామని నిర్మల ప్రసంగంలో ఆమె చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రాలకు సహకారం ఇస్తున్నామని చెప్పడం కూడా పద్ధతిలేని మాటలకు నిదర్శనమని రామకృష్ణ అన్నారు. మోదీ పాలనలో రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైందన్న విషయం నిజం కాదా? కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినలేదు? జీఎస్‌టీ బకాయిలతో రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయని గర్తుకు రాలేదా?
పైగా, ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ పన్నువిధానంలో ఎలాంటి మార్పుల్లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ బడ్జెట్‌ పూర్తిగా నిరాశానిస్పృహలను కలిగిస్తున్నది. ఇంత నిరాశాజనకమైన బడ్జెట్‌ను ఏనాడూ చూడలేదు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రసంగం చేసిన నిర్మల సీతారామన్‌ మరోసారి బడ్జెట్‌ను ఏమైనా ప్రవేశపెడతారా? అన్న సందేహం కలుగుతోందని రామకృష్ణ ఎద్దేవా చేశారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆంధ్రప్రదేశ్‌కు మోదీగారు ఇంకోసారి మొండిచేయి చూపడం మరో ఎత్తు. బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావన లేనేలేదు. గతంలో ఆంధ్రాకు పార్లమెంటు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పదేళ్లలో ఎంతో మోసపోయిన పేదలు, రైతులు, మహిళలు, యువకులు రానున్న ఎన్నికల్లో మోదీని ఓడిరచడం ఖాయమని అన్నారు.

LEAVE A RESPONSE