Suryaa.co.in

Andhra Pradesh

మహిళా సంక్షేమమే.. టీడీపీ ధ్యేయం

– మహిళా శక్తిని మహాశక్తిగా చేయాలన్నదే సంకల్పం
– చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
– నగర మహిళ… అంగన్వాడీ కమిటీల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో టీడీపీ నేతలు

రాజమహేంద్రవరం : ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, స్త్రీ సంక్షేమం గురించి కృషి చేస్తోంది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. స్థానిక తాడితోటలోని రవణం శ్రీరాములు కల్యాణ మండపంలో టీడీపీ నగర మహిళ కమిటీ, టీడీపీ నగర అంగన్వాడి కమిటీల ప్రమాణ స్వీకారం నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, టిఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, బీసీ సీనియర్ నాయకులు రెడ్డి రాజు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, నగర మహిళ కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండిప్రియ, నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి తదితరులు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనగానే ఐటీ అభివృద్ధి, ఈ-గవర్నెన్స్, సంస్కరణలే కాదు… సమాజంలో.. మహిళలు శక్తివంతులుగా ఎదగడానికి.. ఆయన చేసి కృషిని ప్రముఖంగా చెప్పుకోవాలన్నారు.

మరో రకంగా చెప్పాలంటే.. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనే అని అన్నారు.. మహనీయుడు ఎన్టీఆర్ పాలనలో మగవారితో సమానంగా ఆస్తిహక్కు, తిరుపతిలో తొలి మహిళా యూనివర్శిటీ ఏర్పాటు, రాజకీయాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు,సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసి.. మహిళలకు ఆత్మగౌరవం కల్పించారని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత.. చంద్రన్నపాలనలోనే.. మహిళలు.. ఆకాశమంత ఎత్తుకు ఎదిగారని, పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం.. డ్వాక్రా సంఘాల ఏర్పాటు.. మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

దేశంలోనే తొలి మహిళా స్పీకర్ ప్రతిభాభారతి నియామకం, తొలి మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహణ చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. మహిళలను శక్తివంతులుగా చేయడాని.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మహిళ పేరు మీదనే ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, భూమి కొనుగోలును టీడీపీ హయాంలోనే చేపట్టారని, మగవారితో సమానంగా సమాజంలో మహిళలు ఎదగడానికి.. మహిళా కండకర్ల నియామకం, రైతు బజార్ల నిర్వహణ, జనరిక్ షాపులు, ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలు మహిళలకే అప్పగించారని గుర్తు చేశారు.

దీపం పథకం ప్రవేశపెట్టి 61 లక్షల మంది పేదింటి మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రూ.8500 కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారని, పసుపు – కుంకుమ కింద రూ.10,000 కోట్లు ఇచ్చారని, వడ్డీ రాయితీ కింద రూ.2,514 కోట్ల సాయం చేశారని గుర్తు చేశారు. అభయహస్తం పథకం కింద డ్వాక్రా మహిళలకు పెన్షన్లు అందించారన్నారు. ఎస్సీ,ఎస్టీల మహిళల ఆర్థిక పురోగతికి ఉన్నతి పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో రాణించి.. ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ధ్యేయంగా .. టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేశారని, చంద్రన్న పాలనలోనే మహిళా విప్లవం సాధ్యమైందన్నారు.

పుట్టిన బిడ్డకు బ్యాంకులో రూ.5 వేల డిపాజిట్ చేసి 12 ఏళ్ల వరకు వడ్డీ ఇచ్చేలా బాలిక శిశు సంరక్షణ పథకం ప్రారంభించారని, ఆడపిల్లలు.. సమాజంలో ఉన్నతస్థితికి రావాలంటే.. బాగా చదవుకుని ఉండాలని, అందుకు పాఠశాలలకు వెళ్లే 8,9,10 తరగతి విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీని ప్రారంభించారని గుర్తు చేశారు. రక్ష పథకం కింద స్కూల్ విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్లు ఇచ్చారన్నారు. 35 ఏళ్లు దాటిన మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్ పేరుతో 11 రకాల పరీక్షలు, అన్న అమృత హస్తం కింద 27 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పథకం ఇచ్చారన్నారు.

నవజాత శిశువులకు ఎన్టీఆర్ బేబీకిట్లు, తల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్ పథకం కింద చిన్నారులకు బాలామృతం, గర్భిణీలకు ఆర్థిక సాయం అందించారన్నారు. మహిళా శక్తిని మహాశక్తిగా చేయాలని, పేదవారిని ధనికులుగా చేయాలనే ధృఢ సంకల్పంతో… రాజమండ్రి టీడీపీ మహానాడులో చంద్రబాబు నాయుడు తొలి మేనిఫెస్టో ప్రకటించారని గుర్తు చేశారు. మహాశక్తి పథకాలు .. రాష్ట్రవ్యాప్తంగా.. మహిళల్లో జోష్ నింపిందన్నారు. టిడిపి ప్రకటించిన తొలి మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించేలా.. 18 నుండి 59 సంవత్సరాల మహిళల ఖాతాలో నెలకు 1,500 రూపాయలు.. తల్లికి వందనం పేరుతో 15,000 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు.

మహిళలకు దీపం పథకం కింద .. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. వంటి ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ముందుగా అధిక సంఖ్యలో తెలుగు మహిళలు ర్యాలీగా కల్యాణ మండపం చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతి సుందరి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, పార్లమెంట్, నగర కమిటీల నాయకులు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE