Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి దోపిడి వల్లే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి

-యూనిట్ రూ.5 లకే వస్తున్న విద్యుత్ ఉత్పత్తి చేయకుండా యూనిట్ రూ.9 పెట్టి
బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి?
-హిందూజా, షిర్దిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలతో జగన్ రెడ్డికి ఉన్న సంబందం ఏంటి?
-మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నందుకు జగన్ రెడ్డిని నమ్మాలా?
– మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు

2014లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో చంద్రబాబు పాలన మొదలైంది. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే చంద్రబాబు 2014లో ఉన్న 9,529 మెగావాట్ల సామర్ధ్యాన్ని 2019 నాటికి 19,080 మెగావాట్లకు పెంచి మిగులు విద్యుత్ను జగన్రెడ్డి చేతిలో పెట్టారు. గడచిన నాలుగేళ్లలో జగన్రెడ్డి అదనపు విద్యుత్ సామర్థ్యం పెంచలేదు. పైగా విద్యుత్ కోతలు పెంచారు. ఒకవైపు విద్యుత్ సేవలు తగ్గిపోయాయి. రెండోవైపు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.17,093 కోట్లు భారాలు మోపారు. ఇదికాక మరో రూ.37,500 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి మొత్తం రూ.57,188 కోట్లు భారాలు విద్యుత్ వినియోగదారులపై మోపారు. రూ.57 వేల కోట్ల భారాలు మోపినా కూడా విద్యుత్ సేవలు పెరగలేదు. పైగా విద్యుత్ కోతలు పెరిగాయి. అయితే రూ. 57 వేల కోట్లు ఎటుపోయాయి?ఎవరు లూటీ చేశారు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వుండే జెన్కో, సీజీయస్ లో ఒక యూనిట్ విద్యుత్ సరాసరి రూ.5 లకే వస్తున్నది. ఈ ప్రభుత్వ సంస్థలలో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా నిలిపివేసి కమిషన్ల కోసం ఒక యూనిట్ సరాసరి రూ.9 పెట్టి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశారు. బహిరంగ కొనుగోళ్లకు రూ.12,200 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ. 6 వేల కోట్లు కమిషన్ దండుకున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు అమ్మడం ద్వారా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. రూ.61 వేల విలువ చేసే ట్రాన్స్ ఫార్మర్ రూ.1.30 లక్షలకు పెంచి జగన్ రెడ్డి బినామి కంపెనీ అయిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ వద్ద భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. పులివెందులకు చెందిన షిర్డీసాయి ఓనర్ విశ్వేశ్వరరెడ్డికి రూ. 2,629 కోట్లు చెల్లించారు. హిందూఝా కంపెనీ నుండి హైదరాబాద్ కూకట్పల్లిలో జగన్ రెడ్డి కుటుంబ బినామీ కంపెనీ 11.10 ఎకరాలు క్విడ్ క్రింద కొట్టివేసింది. ఇందుకు బహుమానంగా రూ.1,234 కోట్లు డిస్కంల నిధులు హిందూజాకు దారాదత్తం చేస్తున్నారు. హిందూజా విద్యుత్ సరఫరా చేయనందున వారికి చెల్లించాల్సిన బాధ్యత లేదని విద్యుత్ సంస్థలు చెప్పినప్పటికీ, జగన్రెడ్డి క్యాబినెట్లో తీర్మానం చేయించి హిందూజాకు దారాదత్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు తెలంగాణాతోపాటు దేశంలో 10 రాష్ట్రాలకు పైగా వ్యతిరేకిస్తున్నవి. మరి జగన్ రెడ్డి మోటారుకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఎందుకు ఉరి బిగిస్తున్నారు?. మహారాష్ట్రలో ఒక్కొక్క స్మార్ట్ మీటర్ + అనుబంధ పరికరాలు+నిర్వహణకు సుమారు రూ. 18 వేలు ఖర్చు చేస్తుండగా, ఏపీలో రూ.30 వేలు ఖర్చు చేయడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికోసం రూ.13వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నది. ఇందులో భాగంగా మొదటి విడత రూ.4.592 కోట్లకు జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ కంపెనీలైన షిర్దిసాయి ఎలక్ట్రికల్స్, రాఘవ కన్స్ట్రక్షన్కు కాంట్రాక్టు కట్టబెట్టారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ఇలా దోపిడీ చేయబోతున్నారు. తన కేసుల మాఫీ కోసం అదాని సంస్థతో 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరాకు అధిక రేట్లతో ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల విద్యుత్ సంస్థలపై రూ. 21 వేల కోట్ల భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ. 34,776 కోట్లు బకాయిలు చెల్లించలేదు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణం. రూ.6 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. పన్నులు, ఛార్జీలు పెంచి మరో లక్ష కోట్లు ప్రజలపై భారాలు మోపారు. సంక్షేమ పథకాలకు ఇచ్చింది కేవలం 2 లక్షల కోట్లు (చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా తక్కువే). మిగిలిన రూ.5 లక్షల కోట్లు ఏమయ్యాయి? విద్యుత్ సంస్థలకు ప్రభుత్వ బకాయిలు చెల్లించకుండా విద్యుత్ఛార్జీలు పెంచుతున్నాడు. తెచ్చిన అప్పులు పెంచిన పన్నులు జగన్ రెడ్డి మరియు ఆయన ముఠా లూటీ చేస్తున్నారు.

LEAVE A RESPONSE