Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులు, పెన్షనర్లూ.. మిమ్మల్ని వేధించింది ఎవరు?

-మిమ్మల్ని గౌరవించింది ఎవరు?
-ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ
-వచ్చే ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు-పెన్షనర్లకు టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు బహిరంగలేఖ రాశారు. ‘మిమ్మల్ని ఐదేళ్ల క్రితం గౌరవించింది ఎవరు? మీ హక్కులు కాపాడింది ఎవరు? రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నా మీ సౌకర్యాలను కొనసాగించింది ఎవరు? మరి ఈ ఐదేళ్లలో మీకు సక్రమంగా నెలజీతం కూడా ఇవ్వకుండా వేధించింది ఎవరు? పెన్షన్లు ఎప్పుడో ఇచ్చింది ఎవరు? మిమ్మల్ని అవమానించి, ఉద్యోగ సంఘ నేతలపై అక్రమ కేసులు పెట్టించింది ఎవరు? సీపీఎస్ రద్దుపై మిమ్మల్ని మోసం చేసింది ఎవరు? ఆలోచించండి. భయపడకండి. భయం వీడండి. కూటమిని గెలిపించి మిమ్మల్ని వేధిస్తున్న ప్రభుత్వాన్ని గద్దెదించండి’’ అని పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు లేఖ పూర్తి పాఠమిదీ..

తేది : 03.05.2024
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు,
టీచర్లు, పెన్షనర్లకు లేఖ
ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగస్వాములు. ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ప్రజల కోసం, ప్రభుత్వ ఆశయాల సాధన కోసం అంకిత భావంతో పనిచేసే మీ అందరికీ నా వందనం.

నాడు :
ఉద్యోగులు తమ పోస్టింగ్‌లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్‌ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న
ఉద్యోగాలను భర్తీ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసింది. విద్యలో నాణ్యత పెంచేందుకు 11 డీఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయడమైనది.

అంగన్‌వాడీ ఉద్యోగుల జీతాలను రూ.4,200 నుండి రూ.10,500కు పెంచింది. ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు అందించి, ఉద్యోగ సంఘనాయకులతో స్నేహపూర్వక చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించింది. అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్‌ కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పర్చకూడదని 2015 వేతన సవరణలో 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని అర్థిక ప్రయోజనాలను ఏనాడూ వెనుకాడకుండా సకాలంలో అందించిన విషయం మీ అందరికీ తెలుసు. ఎంతటి అర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ 1వ తేదీన జీతాలు ఇవ్వడంలో ఏనాడూ వెనకాడలేదు.

నేడు:
గత 5 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, మీ ఇబ్బందులను నేను కళ్ళారా చూశాను. నెలల తరబడి జీతాలు రాక, ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దీనగాధలు చూసి చలించిపోయాను. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బులు చేతికందక ఎందరో ఉద్యోగుల పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఆగిపోవడం వంటి కన్నీటి గాధలు, తమ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై పగబట్టి ప్రభుత్వ
కక్ష సాధింపు చర్యలు చూసి సహించలేకపోయాను.

వైసీపీ ప్రభుత్వం IR కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించి ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూలేని విధంగా రివర్స్‌ పీఆర్సీ ప్రకటించింది. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్‌ తగ్గించి వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని దూరం చేసింది. వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కి ఉద్యోగులను మోసగించడమే కాకుండా వారి ఆత్మహత్యలకు కారణమైంది. విద్యారంగంలో జీవో నెం.117 తీసుకువచ్చి పాఠశాలల విలీనంతో ఉపాధ్యాయ పోస్టులు రద్దుచేసి, 12,600 పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చింది.

తద్వారా విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రమాణాల స్థాయిని దిగజార్చింది. పదవీ విరమణ ఉద్యోగులకు రావలసిన బకాయిలన్నింటినీ 2029లో చెల్లిస్తామని, పెన్షనర్లు ఎంతగానో వేచిచూసే గ్రాట్యూటీ అందుకోకుండా జీవో ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామంటూ వారిని గాలికి వదిలేసింది.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందించి, సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర అన్ని ఆర్థిక ప్రయోజనాలను చెల్లించే ఏర్పాటు చేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వైసీపీ నాయకులు అవమాన పరుస్తున్నారు. మేము వచ్చాక వారి గౌరవాన్ని కాపాడుతాం. ఉద్యోగులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి స్నేహపూర్వక పరిస్థితులు నెలకొల్పుతాం. నేటి అప్రజాస్వామ్య, నియంతృత్వ పాలనతో గూండాయిజం, ఫ్యాక్షనిజంతో రాష్ట్రం మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కివెళ్లిపోయింది.

ఒక్క ఛాన్స్‌ నినాదాన్ని నమ్మినందుకు రాష్ట్ర భవిష్యత్‌ అంధకారమైంది. బ్రాండ్‌ ఇమేజ్‌ నాశనమైంది. రాష్ట్రం తీరని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మన అందరి కలలు సాకారం కావడానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్‌ అందించడానికి, రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కలసికట్టుగా పని చేద్దాం.
ఉద్యోగులారా ఆలోచించండి !!

ఎవరిది ప్రజాస్వామ్యం?
ఎవరిది అప్రజాస్వామ్యం?

ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం?
ఎవరిది ఉద్యోగుల అణచివేత ప్రభుత్వం?

భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి!
ఆలోచించండి ! చర్చించండి ! చైతన్య పరచండి!

సరైన నిర్ణయం తీసుకోండి !!!
ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.

– నారా చంద్రబాబునాయుడు
(తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు)

LEAVE A RESPONSE