అందరి ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయవాడ:జగన్ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం జీవో1 ద్వారా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తోందని అన్నారు.నిన్న యూటిఎఫ్ వాళ్లు గన్నవరంలోని దర్మస్థలంలో దీక్ష పెట్టుకుంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.జీవో 1తో అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రపై కేసులు పెడుతున్నారని, మైక్ లేకుండా ఎవరైనా పాదయాత్ర చేస్తారా? అని నిలదీశారు. కింద మాట్లాడవద్దంటే బాల్కనీ ఎక్కి లోకేష్ మాట్లాడ వలసి వచ్చిందన్నారు. మీరేమైన పోలీసులా? అని ప్రశ్నించారు.

కోర్టులు ఉండబట్టి సరిపోయింది.. లేక పోతే ఈ మూర్కుడు సీఎం జగన్ ఇంకా ఎన్ని తిప్పలు పెట్టేవారోనని రామకృష్ణ వ్యాఖ్యానించారు. సీనియర్ ఐఎఎస్‌లు కూడా చివాట్లు తింటున్నారని అన్నారు. అందరి ఫోన్‌లు ట్యాంపరింగ్ చేస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే చెపుతున్నారన్నారు. ఒక శాసనసభ్యుడిని బజారులో ఈడ్చుకు వెళతామని వాళ్ళు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఛలో అసెంబ్లీకి పిలుపు ఇవ్వాలని, అన్నిపక్షాలు కచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపిచ్చారు. ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతోందని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

Leave a Reply