Suryaa.co.in

Telangana

సభకు సర్వం సిద్ధం!

– అధికారులతో మంత్రి దుద్దిళ్ల, స్పీకర్ గడ్డం ప్రసాద్‌బాబు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్: మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో ముందస్తు సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ఏర్పాట్లపై చర్చించారు.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) -రామకృష్ణారావు, GAD సెక్రటరీ రఘనంందన్ రావు, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ- రవి గుప్తా, రాష్ట్ర DGP డాక్టర్ జితేందర్, ADG, లా& ఆర్డర్ మహేష్ భగవత్, DG ఫైర్ నాగిరెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు -సివి అనంద్, సుధీర్ బాబు, అవినాష్ మహాంతి, ఇంటెలిజెన్స్ IG- కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్- కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి హాజరయ్యారు.

సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… బుధవారం నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని పెంపొందించే విదంగా ఏర్పాట్లు ఉండాలి. ఈసారి జరిగేవి బడ్జెట్ సమావేశాలు కావున ఎక్కువ రోజులు జరుగుతాయి. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. సభలో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సభకు, సభ్యులకు అందించాలి.

సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే పంపినట్లయితే వాటిని సభ్యులు చదువుకొని సభలో మాట్లాడడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుంది. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ బాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందించితే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుంది. శాఖకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి.

శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలి. సభ లోపలితో పాటుగా, పరిసరాలలో కూడా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే చర్చలు బాగా జరుగుతాయి. సభ జరుగుతున్న సమయంలో ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమర్ధవంతంగా, చురుకుగా పనిచేయాలి.

కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసన సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలన్నారు. సమావేశాలు జరిగే సమావేశం అన్ని శాఖల అధికారులు , మంత్రులు , ప్రజా ప్రతినిధులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. నోడల్ అధికారులను , లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని కోరారు.

అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో చాలా సంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమాలకు పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నందున పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమావేశాలు జరిగే రోజుల్లో అసెంబ్లీ , శాసన మండలి చుట్టూ మూడు అంచెల భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయన సూచించారు. అలాగే వీఐపీల నివాసాలు , అసెంబ్లీకి వచ్చే రూట్ లో కూడా భద్రతను ఏర్పాటు చేయాలి.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు జవాబులను త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమిస్తాం. తద్వారా అనుసంధానానికి సులభమవుతుంది.

LEAVE A RESPONSE