Suryaa.co.in

Andhra Pradesh

అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగింపుతో ఆనందంలో అన్నదాతలు

ఎంపీ విజయసాయి రెడ్డి

ఆగస్టు 21:ఆంధ్రప్రదేశ్ లో 32 లక్షల ఎకరాలపై ఆంక్షల తొలగింపుతో భూములపై అన్నదాతలకు సంపూర్ణ హక్కులు లభించాయని, దీంతో రైతన్నలు ఆనందంలో మునిగి తేలుతున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల వేదికగా సోమవారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంతో అన్నదాతల ఆర్థిక, సామాజిక భరోసా ఏర్పడిందని అన్నారు.ఈ భూములన్నింటినీ 22(ఎ) జాబితా నుండి ప్రభుత్వం తొలగించిందని, తద్వారా కొత్త రుణాలు, భూ మార్పిడి, క్రయవిక్రయాలు వెసులుబాటు కల్గిందని అన్నారు.

చిరు ధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్
చిరుధాన్యాల ఎగుమతుల్లో దేశంలో ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందని అన్నారు.2022-23లో ఎగుమతుల్లో దేశం మొత్తం మీద 1,69,049 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేస్తే కేవలం ఏపీ నుంచి 1,319.78 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసారని అన్నారు.

పప్పుధాన్యాల సాగును కేంద్రం ప్రోత్సాహించాలి
గత సంవత్సరంతో పోలిస్తే విత్తిన విస్తీర్ణం 10% తగ్గినందున పప్పుల ధరలు పెరగవచ్చుని విజయసాయిరెడ్డి అభిప్రాయ పడ్డారు. ధరల పెరుగుదలను అరికట్టడానికి, పప్పుధాన్యాలు, మినుములు, కూరగాయల సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అభ్యర్థిస్తున్నానని అన్నారు.

సర్వే లన్నింటిలో ప్రజా తీర్పు వైకాపా వైపే
టైమ్స్ నౌ-ఈటీజీ ఒపీనియన్ పోల్స్ 2024లో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 ఎంపీ సీట్లను వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకుంటుందన్న అంచనాలను బలపరుస్తున్నాయని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ తన వాగ్దానాలను నెరవేర్చేందుకు నిస్వార్థంగా పనిచేస్తున్నారని రాష్ట్రంలో తిరుగులేని ప్రజానాయకుడిగా కొనసాగుతున్నారని అన్నారు.

చంద్రబాబు మాయాజాలం
చంద్రబాబు ఇచ్చే రాఖీ కట్టుకుంటే ఇంటర్ బైపీసీ చదివి ఇంజనీర్ కావచ్చు. పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చు, స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొనవచ్చు. “అది నేనే కట్టా, ఇది నేనే పెట్టా అని మాట్లాడొచ్చు” అన్నట్లు ఉంటుందని అన్నారు.

LEAVE A RESPONSE