– సర్ ప్లస్ రాష్ట్రంగా రూ.1700 కోట్ల మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చాం
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి 87 వేల కోట్లు చేయని అప్పును కూడా బిఆర్ఎస్ హయాంలో చేశామని అదనంగా చూపిస్తున్నారు
– తెలంగాణ రాష్ట్రం లో 99, 385 కోట్లు మేము చేయని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసి మీ తెలివిని ప్రదర్శిస్తున్నారు
– బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే
– ముందు ఓఆర్ఆర్ టెండర్లను రద్దుచేసి ఆ తర్వాతే దానిపై విచారణ జరిపించండి
– శాసనసభలో చర్చ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అప్పులపై వాస్తవాలను వివరించిన మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: మా గొంతు నొక్కినా మేం నిజమే చెబుతాం. అర్ధరాత్రి నిద్రలో అడిగినా మేం నిజమే చెబుతాం. వివరాలకు వెళ్లే ముందు సభా సాక్షిగా ఆర్థిక మంత్రి భట్టి కి ఒక ఛాలెంజ్. భట్టి విక్రమార్క చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ చేయలేదని, రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మెస్ చార్జీలు పెంచలేదన్నారు, అది ఇంకా పెద్ద అబద్ధం.
ప్రభుత్వ ఆస్తులు అమ్మడం లేదు అని ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క అబద్ధం చెప్పారు. 26 జూన్ 2024 రంగారెడ్డి జిల్లాలో గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని ఎకరా రూ.75 కోట్ల చొప్పున రూ. 30 వేల కోట్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది. ఇదే భూమిపై టీజీఐఐసి వారు 20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అమ్మకుండా టీజీఐఐసీ ద్వారా ఈ భూములను అమ్మే ప్రయత్నం చేస్తుందని భట్టి చెప్పకనే చెప్పారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం దండు మల్కాపూర్ లో టీఎస్ ఐఐసీకి ఒక్క రూపాయి తీసుకోకుండా 400 ఎకరాల భూమిని ఇచ్చింది.మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు 75 కోట్లకు ఎకరం చొప్పున టీజీఐఐసీకి ఇస్తున్నది? ఫామ్ మేకనైజేషన్, డ్రిప్పు, స్ప్రింక్లర్లకు మేం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు, రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు. గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదు అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు.
ఈ అసెంబ్లీ సాక్షిగా భట్టి విక్రమార్క కి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మేం ఇవ్వలేదని మీరు రుజువు చేస్తే ఇక్కడే స్పీకర్ ఫార్మాట్లో నేను నా రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాను. మీరు అబద్ధం చెప్పినట్టయితే, మీరు కూడా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాలి. మెస్ చార్జీలు మేం పెంచింది నిజం, డ్రిప్పు, ఫామ్ మెకానైజేషన్ కు డబ్బులు ఇచ్చింది నిజం.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమాకు 2018 -19లో – రూ. 883 కోట్లు, 2019- 20లో రూ.950 కోట్లు, 2020-21లో- రూ.1456 కోట్లు, 2021-22లో – రూ.1166 కోట్లు, 2022-23లో రూ.1139 కోట్లు కట్టింది. ఆర్థికమంత్రి భట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫైనాన్స్ వైట్ పేపర్లో బీఆర్ఎస్ హయాంలో 6,71,756 కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. ఈ రోజు కూడా సభలో మీరు పెట్టిన రిపోర్టులో కూడా ఏడాది కాంగ్రెస్ పాలనలో రూ. 1,27,208 కోట్లు కాంగ్రెస్ అప్పు చేసిందని చెప్పారు.
మీరు మొదటి ఆర్థిక సంవత్సరమే రూ. 1,27,208 కోట్లు అప్పు చేశారంటే.. ఐదేళ్లలో రూ. 6 లక్షల 38వేల కోట్ల అప్పు అవుతుంది. ఎఫ్ ఆర్ బీ ఎం లిమిట్ పెరిగితే ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తామని మీరు పెట్టిన రిపోర్టు ఆధారంగానే ఒప్పుకున్నారు. 2014లో రెవెన్యూ మిగులు రూ. 369 కోట్లు ఉంటే, 2022 23లో మిగులు రూ. 5994 కోట్లకు పెరిగింది. 2023 24 బడ్జెట్ ఆర్ఈలో రూ. 1704 కోట్ల మిగులు బడ్జెట్ అని ఇదే భట్టి ఆర్థికమంత్రిగా ఇదే సభలో చెప్పారు. అంటే సర్ ప్లస్ రాష్ట్రంగా రూ.1700 కోట్ల మిగులు బడ్జెట్ తో మా బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పాం.
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 68 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్. దశ దిశ లేని రాష్ట్రాన్ని దేశంలో అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి. రూ. 2 లక్షల 93 వేల కోట్ల బడ్జెట్ తో మీకు అప్పజెప్పాం. మేం అధికారంలోకి వచ్చిన నాడు 2014 ఈ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం రూ. 35 వేల 770 కోట్లు మాత్రమే. 2023లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ. 1,53,837 కోట్లు. అంటే రూ. 35 వేల కోట్ల నుండి మేం 1,50,000 కోట్లకు ఆదాయాన్ని పెంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించాం. ఎక్స్పెండిచర్ 2014లో రూ. 62,000 కోట్లు ఉంటే, 2022-23 లో రూ.2 లక్షల 4 వేల 85 కోట్లకు పెంచాం. తలసరి ఆదాయం 2014లో రూ.1,24,000 ఉంటే, 2023లో రూ.3 లక్షల 56 వేల 564. 2014లో జి ఎస్ డి పి రూ.4 లక్షల 51 వేల కోట్లు ఉంటే. 2023 లో రూ.15 లక్షల 10 98 వేల కోట్లకు పెంచాము. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒకటి పాయింట్ 1.75 శాతం ఎఫ్ ఆర్ బి ఎం పరిధి పెంచి అప్పు ఇచ్చింది కాపిటల్ ఎక్స్ పెండిచర్ కోసం.
2020- 21లో రూ.17,568 కోట్ల అప్పు. 2021-22 కరోనాలో రూ. 10,724 కోట్ల అప్పు ఉదయ్ స్కీం బలవంతంగా కేంద్రం రుద్దితే రూ. 9000 కోట్ల అప్పు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన టాక్స్ డివల్యూషన్ను అప్పుగా తీసుకోమని కేంద్రం ఇచ్చినది రూ. 2,459 కోట్ల అప్పు. కరోనా వల్ల, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వంపై 40 వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పుల భారం పడింది.
భట్టి విక్రమార్క శ్వేత పత్రాల లెక్క ప్రకారం రూ. 6 లక్షల 71 వేల కోట్లు అన్నారు. అది తప్పు. ఈ 6 లక్షల 71 వేల కోట్ల అప్పులో… తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణకు వారసత్వంగా వచ్చిన అప్పు రూ. 72,658 కోట్లు. వివిధ సంస్థలకు గ్యారెంటీల రూపంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన అప్పు రూ. 15,000 కోట్ల రూపాయలు కూడా తెలంగాణ ప్రభుత్వంపై పడింది.
రూ. 6,71,000 కోట్ల అప్పులో భట్టి గారి మేధస్సుతో 7 డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, రాష్ట్ర ప్రభుత్వ అప్పుని 2024 మార్చి వరకు కలిపి బీఆర్ఎస్ ఖాతాలో వేసి చెప్పడం మీకే చెల్లుతుంది. 2023 డిసెంబర్ నుండి 2024 మార్చి వరకు రూ.15,118 కోట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పును కూడా మా ఖాతాలోనే వేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వారసత్వంగా వచ్చిన 72,000 కోట్లను కూడా మా ఖాతాలోనే కలిపారు. ఇలా రూ. 87 వేల కోట్లు చేయని అప్పును కూడా బిఆర్ఎస్ హయాంలో చేశామని అదనంగా చూపిస్తున్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తున్న భట్టి గారికి అభినందనలు. 2014 కంటే ముందు గ్యారంటీల పేరు మీద వారసత్వంగా వచ్చిన అప్పు రూ. 11,609 కోట్లు, డిసెంబర్ 23 నుండి మార్చి 24 వరకు భట్టిగారు చేసిన అప్పు రూ. 15,118 కోట్లు, వారసత్వంగా వచ్చిన అప్పు రూ. 72 వేల కోట్లు ఇవన్నీ మాపైన వేసి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.
రూ. 99, 385 కోట్లు మేము చేయని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసి మీ తెలివిని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు అవాస్తవాలను పదే పదే చెప్పడం సరైనది కాదు. కాళేశ్వరం, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది ఎఫ్ ఆర్ బి ఎం అప్పు రూ. 3,89,673 కోట్లు. కార్పొరేషన్ అప్పులు రూ. 1,27,208 కోట్లు గవర్నమెంట్ గ్యారెంటీ లోన్స్, కట్టవలసిన అవసరం లేనిది రూ. 95 వేల కోట్లు.
గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వనిది, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనిది రూ. 59,000 కోట్లు. గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేని అప్పు మొత్తం 1,54,876 కోట్లు. అంటే మొత్తంగా శ్వేత పత్రంలో మీరు చూపించిన రూ.6 లక్షల 71 వేల కోట్ల నుండి మేం తీసుకోని అప్పు రూ. 99,385 కోట్లు, ప్రభుత్వం కట్టవలసిన లేని అప్పు 1,54,876 కోట్లు తీసేస్తే, బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే.
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 1,27000 కోట్ల అప్పు చేసిందని నిజం ఒప్పుకున్నందుకు భట్టి విక్రమార్కకి ధన్యవాదాలు.
కేసీఆర్ హయాంలో ఈ రాష్ట్ర రైతాంగానికి మొత్తం రూ. 4 లక్షల 8 వేల 902 కోట్లు ఇచ్చాం. ఇందులో రైతుబంధుకు రూ. 73,162 కోట్లు ఇచ్చాం. రైతు బీమా కింద రూ. 5,465 కోట్లు ఇచ్చాం. రైతు రుణమాఫీ కోసం 28000 కోట్లు. రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 65 వేల కోట్లు ఇచ్చాం. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం రూ. 2,37000 కోట్లు ఖర్చు చేశాం. ఇలా ఈ రాష్ట్ర రైతంగం కోసం 4,08,902 రూపాయలను ఖర్చు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దాని ఫలితమే ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి.
ఔటర్ రింగురోడ్డు పైన నేను విచారణ కోరుకున్నప్పటికీ, విచారణ చేస్తామని ముఖ్యమంత్రి లేచి చెప్పారు. విచారణకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు విచారణ చేసుకోండి. ముఖ్యమంత్రి ఎంత కన్వీనెంట్ గా మాట మారుస్తారనేది అసెంబ్లీ సాక్షిగా ఈరోజు రుజువైంది. భట్టి పదేపదే లేచి ఓఆర్ఆర్ అమ్ముకున్నారని పదేపదే అంటుంటే.. ఆ ఒప్పందాన్ని రద్దు చేయండి అని కోరాము. ముందు ఓఆర్ఆర్ టెండర్లను రద్దుచేసి ఆ తర్వాతే దానిపై విచారణ జరిపించండి.
ఇప్పుడు ఆర్.బి.ఐ. లెక్కలకు వస్తే…ఆర్.బి.ఐ. ఇచ్చిన రిపోర్టులో పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి విషయాలను వెల్లడించింది. తెలంగాణలో నిరుద్యోగిత 2013 – 14లో ప్రతి 1,000 కి 65 ఉంటే అది మేం దిగిపోయే నాటికి 35 వరకు తగ్గించాం. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేట్ ప్రతి 1,000 కి 94 ఉంటే దాన్ని 73 వరకు తగ్గించాం.
సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, మీరు దాన్ని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అన్న మాటలు మీకు గుర్తు లేదా? మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ధనయజ్ఞం.. ఈ రోజు జలయజ్ఞం అయిందా ? మీరు చేసేది నిజమైతే ఇదే శాసనసభలో చర్చ పెట్టి వాస్తవాలను చెప్పండి.