Suryaa.co.in

Family

మానవ జీవితానికి – ప్రశాంతత ఎలా లభిస్తుంది?

జనక మహారాజు ఓ జ్ఞాని వద్దకు వెళ్లి.. “నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను” అన్నాడు..
“నువ్వు నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా..” అని అడిగారు ఆ జ్ఞాని.. అష్టావక్ర మహర్షి
“మా రాజ్యానికి శత్రు భయం లేదు. దొంగల భయం లేదు. మా రాజ్యంలో పన్నులు తక్కువే. న్యాయ వ్యవస్థ కూడా బాగుంది. ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగదు. ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు. కానీ నాకే ప్రశాంతత లేదు. నేను ఏం చెయ్యాలి” అని రాజు ప్రశ్నించాడు.

“సరే నీ బాధ అర్ధమైంది. నేనొకటి చెప్తాను. అలా చెయ్యి. నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసే” అన్నారు జ్ఞాని.” అంతకన్నా ఇంకేం కావాలి.. “తీసుకోండి.. ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నా రాజ్యాన్ని” చెప్పాడు రాజు.
“సరే నాకిచ్చావు, నువ్వేం చేస్తావు..” జ్ఞాని అడిగారు. “నేను ఎక్కడికైనా వెళ్లి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను” అన్నాడు రాజు.
ఎక్కడికో వెళ్ళడం ఎందుకు.. ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చెయ్యవలసిన పనులు చెయ్యి. ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు.
చెయ్యగల సమర్దుడివి, ఓ ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తాను” అని చెప్పారు జ్ఞాని.
ఒక సంవత్సరం గడిచింది, జ్ఞాని రాజుని చూడటానికి వచ్చారు, రాజు మొహంలో ఆనందం కనిపిస్తోంది. ఎక్కడా ఆవ గింజంత దిగులు కనిపించడం లేదు. జ్ఞానిని సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేసి లెక్కలు చూపించాడు రాజు.
“ఆ లెక్కలు అలా పక్కన పెట్టు గానీ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు” అడిగారు జ్ఞాని. “హాయిగా ఉన్నాను. కావలసినంత ప్రశాంతత అనుకోండి. మునుపెప్పుడు ఇంత హాయిగా లేను. మీకు నా ధన్యవాదాలు” అన్నాడు రాజు.
“సరేగానీ పూర్వం నువ్వు చేసిన పనులకు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏవైనా తేడాలు తెలిసాయా” అని అడిగారు జ్ఞాని. “లేదు.. అప్పుడు చేసే పనులే ఇప్పుడు కూడా చేస్తున్నాను” రాజు సమాధానమిచ్చాడు.
“అప్పుడు ఎందుకు మానసిక ఒత్తిడికి లోనయ్యావు.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదా..” అని జ్ఞాని అడగ్గా రాజు అసలు విషయం తెలిసి జ్ఞాని వంక చూసాడు.
అప్పుడు జ్ఞాని ఇలా అన్నారు…
“అప్పట్లో నువ్వు ఇది నా పని ఇది నాది అని ఆలోచించావు. ఇప్పుడు నువ్వు ఇది నాది కాదు. నేనిక్కడ కేవలం ఒక ప్రతినిధిని అనుకున్నావు. ఇది ఒక బాధ్యత మాత్రమే అనుకుంటున్నావు ఆ ఆలోచన మనసులోకి వచ్చిననుండీ నీలో మార్పు మొదలయ్యింది కనుక ఆ మనసే అన్నింటికీ మూలం…
నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా ఆన్ని ఒత్తిడులూ, సమస్యలూ నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి. అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు.
ఈ దేహం నాది కాదు. ఈ ఊపిరి నాది కాదు… ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు.. అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి. ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు. నీ విధులు నువ్వు సాగించు. నీకు కావలసినంత ప్రశాంతత లభిస్తుంది”…

ప్రతిరోజూ గంటలు గంటలు నిద్రపోతాము, ఒక 10 నిముషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.
ప్రతిరోజూ అనవసరమైన ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాము, రోజులో ఒక్క 10 నిమషాలు మీకు ఇష్టమైన దైవ నామాన్ని జపించండి.
ప్రతిరోజూ ఎంతో సమయం ఫోన్, టీవీ చూడడానికి వృథా చేస్తాము. దానిలో ఒక్క 10 నిమషాలు భగవంతుని రూపాన్ని చూస్తూ గడపండి.
ప్రతిరోజూ ఎదో ఆహారపదార్థం ఎంతోకొంత వృథా చేయడమో, పాడయిందని పడేయడమో చేస్తాము అలా పాడవకుండానే ఒక జీవికి ఆహారం అందించి ఆకలి తీర్చండి.
ప్రతీ రోజు పనిలేకపోయిన అనవసరంగా అయినా లేదా వాకింగ్ లో భాగంగా అయినా నడుస్తూ ఉంటాము. దానికి బదులు దేవాలయం చుట్టూ లేదా పవిత్ర వృక్షాల చుట్టూ తిరగండి. ఆ సమయంలో ఎన్నో ఎన్నో దివ్య తరంగాలు మిమ్మల్ని తాకి మీలో ఒక దివ్య చైతన్యాన్ని నింపుతాయి.
మనకు ఉన్న ఎన్నో సమస్యలను నలుగురికి చెప్పి లోకువ అవుతాము, ఒక్కసారి అవే సమస్యలు భగవంతుని ముందు కూర్చుని ఆయనకు మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఆయన దానికి ఎదో ఒకరోజున శాశ్వత పరిష్కారం ఇస్తాడు.
ప్రతిరోజూ ఎన్నో వార్తలు, గొడవలు వింటూ ఉంటాము. దానికి బదులు ఒక్క అరగంట మంచి సంగీతం కానీ, సద్గురువులు చెప్పే పురాణ ప్రవచనాలు వినండి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది , ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి.
ప్రతిరోజూ 10 నిముషాలు రామ నామం రాయండి, కొద్దిరోజులకు మీకే ఒక దివ్య అనుభూతి కలుగుతుంది.
ప్రతిరోజూ సూర్యోదయ సమయానికి ముందే లేచి ఉదయిస్తున్న సూర్యుని దర్శించండి.
పూర్ణిమ వెన్నెల వెలుగులో ఆరుబయట ఎక్కువ సేపు గడపండి.
ప్రతీ రోజు భగవద్గీత ఒక్క అధ్యాయం అయినా పారాయణ చేయండి అందులోని ఒక్క శ్లోకానికి అర్ధం తెలుసుకునే ప్రయత్నం చేయండి.
మొక్కలు నాటి వాటిని పొషించండి అవి రేపటి తరాలకు ఎంతో పుష్టినిస్తాయి. ఎంతో మందికి ప్రాణవాయువు అందించిన ఫలం కలుగుతుంది.
వారానికి ఒక్కరోజు అయినా అవుకు కొంచెం ఆహారం సమర్పించండి , గ్రహదోషాలు సమస్యలు తొలగుతాయి..

– vagdevi
narasaraopet

LEAVE A RESPONSE