Suryaa.co.in

Political News

ప్రజావ్యతిరేక పాలన నుంచి.. ప్రజా సంక్షేమ మార్గం వైపు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 ఎన్నికల్లో ఒక తేలికపాటి మార్పు కోసం ఓటు వేయలేదు. వారు ఎన్నుకున్నది సంపూర్ణ దిశామార్పు. గత ప్రభుత్వ అయిదేళ్ళ పాలనలో అధికంగా అవినీతి, సంక్షేమ నామకవస్త్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలు, బీపీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను మభ్యపెట్టే ప్రచార పథకాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. సంక్షేమ పథకాలన్నీ పరిమిత వర్గాలకు, పరిమిత కాలానికి మేళం కొట్టినట్లు అమలయ్యాయి.

గ్రామాల అభివృద్ధి కేవలం హారతి ప్రమాణంలో మిగిలిపోయింది. నిరుద్యోగ యువతకు అవకాశాలు దొరకలేదు, రైతుల భవితకు భరోసా లేకపోయింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో ఏర్పడిన కూటమి, ప్రజల అక్షయ నమ్మకంతో అధికారాన్ని చేపట్టింది.

వారి ప్రధాన లక్ష్యం – సంక్షేమాన్ని కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా, సమగ్ర ప్రజా అభివృద్ధి సాధనంగా మలచడం. సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజల హక్కుగా, జీవితాలను నిర్మించేవిగా మారుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కేవలం ప్రకటించిన దానికే పరిమితమైన పథకాలు, కూటమి పాలనలో ఫలితాలు ఇస్తున్న ప్రజా సాధనలుగా మారుతున్నాయి.

పింఛన్లు :
ఏపీలో సామాజిక భద్రతా పించన్లను ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే. ఎన్టీఆర్‌ హయాంలో నెలకు రూ.35 చొప్పున అందించగా తరువాత చంద్రబాబు సీఎం కాగానే దానిని రూ.75కు పెంచారు. 2004 ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను రూ.200 చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే.. రూ.25మాత్రమే పెంచారు. ఒకేదఫా చేస్తామని చెప్పలేదని దబాయిస్తూ.. ఏడాదికి రూ.25చొప్పున పెంచుతామని అప్పటి ఆర్ధిక మంత్రి రోశయ్య వివరించారు.

2014 జూన్‌ 8న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను రూ.1,000కి పెంచారు. తరువాత రూ.2వేలు చేశారు. అంటే ఐదేళ్లలో 10రెట్లు పెంచిన ఘనత టీడీపీదే. జగన్మోహన్‌ రెడ్డి పెన్షన్లను రూ.3000లకు పెంచుతానని ఎన్నికల ప్రచార సమయంలో, వైసీపీ మేనిఫెస్టోలో, పాదయాత్రలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక కేవలం రూ.250 మాత్రమే పెంచి రూ.2000 నుంచి రూ.2250 చేశారు.

ఫలితంగా పెన్షన్‌ దారులు మొదటి సంవత్సరం నెలకు రూ.750 చొప్పున ఏడాదికి రూ.9000, రెండో ఏడాది రూ.500 చొప్పున రూ.6000, మూడో ఏడాది రూ.250 చొప్పున రూ.3000 మొత్తంగా రూ.18,000 నష్టపోతారు. ఎన్నికల సమయంలో రూ.3000లకు పెంచుతామని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీకి సవాలుగా తాము అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక తొలి సంతకంతోనే పెన్షన్‌ దారుల ఆశలపై నీళ్లు జల్లారు. పెన్షన్ పేరుతో వృద్ధులను జగన్ రెడ్డి వంచిస్తే సీఎం చంద్రబాబు మాత్రం పేదలను అక్కున చేర్చుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల ఒకటో తేదీ వస్తోందంటే ప్రతి ఇంటి లోగిళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది.

వాలంటీర్లు లేనిదే గడప గడపకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయలేమన్న జగన్ రెడ్డి, వైసీపీ నేతలకు, కూటమి పాలనలో 1వ తేదీనే వాలంటీర్లు లేకుండానే ఇంటింటికి పెన్షన్లు అందడం చెంపపెట్టు అయ్యింది. రూ.2 వేలు ఉన్న సామాజిక పెన్షన్‌ను రూ.3 వేలుకు పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది. గత ప్రభుత్వం ఆనర్హులకు భారీగా పింఛన్లు ఇచ్చిందని, శాస్త్రీయంగా విచారణ చేసి ఇప్పటివరకు 14,967 మందిని మాత్రమే తొలగించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ పేరిట 10 లక్షల మంది ఆర్హుల పెన్షన్లు రాజకీయ కారణాలతో తొలగించారు.

కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే రూ.3 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలుకు పెంచడంతో పాటు, ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలో రూ.7 వేలును పెన్షనర్లకు అందించి మన చంద్రన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ లెక్కన ఏప్రిల్‌, మే, జూన్‌కు సంబంధించి నెలకు రూ.1000 చొప్పున 3 నెలలకు బకాయి రూ.3 వేలతో పాటు జూలై నెలలో ఇచ్చే కొత్త పెన్షన్‌తో అందజేశారు. సామాజిక పెన్షన్ రూ.4 వేలుతో పాటు దివ్యాంగులకు రూ.6 వేలు, దీర్ఘకాలిక కిడ్నీ, తల సేమియా వ్యాధి బాధితులకు రూ.10,000 చొప్పున అందిస్తున్నాం.

100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ. 15,000 ఇవ్వడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు. పెంచిన పెన్షన్‌ మొత్తాన్ని ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది పెన్షన్‌దారులు లబ్ధి పొందుతున్నారు. 2024 నవంబర్ నెల నుంచి ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన పింఛన్ ను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

పెన్షన్ పేరుతో వృద్ధులను జగన్ రెడ్డి వంచిస్తే సీఎం చంద్రబాబు మాత్రం అక్కున చేర్చుకున్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా పేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను సీఎం చంద్రబాబు తుడుస్తున్నారు. నాడు అవ్వతాతలకు డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి పన్నుల రూపేనా వసూలు చేస్తే వారి కళ్ళల్లో బాధ తప్పించి మరేది కనపడేది కాదు.

నేడు ప్రతీ నెల ఒకటో తారీఖు వస్తుందంటే చాలు అవ్వా తాతల కళ్లల్లో అవధులు లేని ఆనందం కనపడుతోంది. ఒకటో తారీఖున ఆదివారం వస్తే పెన్షన్ అందక పేద ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని తల్లడిల్లి ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి నాంది పలికిన తొలి నాయకుడు సీఎం చంద్రబాబు గారు. వైసీపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నెలకు రూ.1300 కోట్లు ఖర్చుపెడితే కూటమి ప్రభుత్వం రూ.2,700 కోట్లు ఇస్తోంది.

దీపం – 2 పథకం :
పేద ప్రజలకు కొండంత అండగా, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా మాజీ సీఎం ఎన్టీఆర్ నిలిస్తే ఆయన బాటలోనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పయనిస్తూ ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా నిలిపేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. రాష్ట్ర ప్రగతికి అసలైన కొలమానం సంక్షేమ పథకాలే. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాళ్లలో అందించినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలన సాగిస్తుంది. పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం సంక్షేమానికి, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. సూపర్ – 6 హామీల అమలులో భాగంగా ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకంతో 1.55 కోట్ల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుంది.

దీపం – 2 పథకంగా వ్యవహరిస్తున్న ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి తొలి ఏడాది రూ. 2684 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు గాను తొలి విడతగా రూ.894 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు. ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

గ్యాస్ అందిన 48 గంటల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కట్టెల పొయ్యితో తన తల్లి పడ్డ కష్టం మరే మహిళకు రాకూడదని ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ‘దీపం’ పథకం ప్రవేశ పెట్టారు. దీపం పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. నేడు వంటింటిపై భారం తగ్గించడంలో ముందడుగుగా మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

ఏడాదికి రూ.2.684 కోట్లు
మొదటి సిలిండర్‌కు అయ్యే రూ.894 కోట్లు ఇంధన కంపెనీలకు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 2024 నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో పథకాన్ని సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన మీదుగా హిందూస్థాన్, భారత్ పెట్రోలియం, ఇండియన్ అయిల్ కంపెనీల ప్రతినిధులకు సంబంధిత చెక్కును అందించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద నాలుగు నెలలకో సిలిండర్ చొప్పున ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందించనున్నారు. దీనికి రాయితీ రూపంలో ఏడాదికి రూ.2684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఒక్కో సిలిండర్ ధర గరిష్టంగా రూ. 876 ఉండగా అందులో కేంద్ర రాయితీ రూ.25 వరకు లభిస్తోంది. మిగిలిన రూ.851ను సిలిండర్ అందిన 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఇంధన సంస్థల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. అక్టోబర్ 29, 2024 నుంచి సిలిండర్ల బుకింగ్ ప్రారంభమైంది. మొదటి సిలిండర్‌కు రాయితీ నిధుల కింద రూ. 894 కోట్లు విడుదల చేశారు.

మార్చి 31, 2025 నాటికి డెలివరీ చేసిన సిలిండర్లు – 93,03,000 లక్షలు, ఖర్చు చేసింది : రూ.760 కోట్లు. కొత్తగా 2 లక్షల కనెక్షన్లు అందించింది. మొదటి విడత దీపం-2 పథకం మార్చి 31 నాటికి ముగిసింది. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కాగా.. లబ్ధిదారుల సంఖ్య కోటికి పెంచే విధంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అన్న క్యాంటీన్లు :
కూటమి ప్రభుత్వం రాకతో పేదల ఆకలి కష్టాలు తీరిపోయాయి. ఆకలితో అలమటించే నిరుపేదలకు గుప్పెడన్నాన్ని అందించే లక్ష్యంగా అన్న క్యాంటీన్లను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలి బాధతో ఉండకూడదనే ఉద్దేశంతో 2018 జూన్ 11న తెలుగు జాతి గౌరవంగా “అన్న” అని పిలిచుకునే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారి పేరు మీదుగా అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అప్పటి నుంచి పట్టణ ప్రాంతాల్లో 368 క్యాంటీన్లను ఏర్పాటు చేసి కేవలం రూ.5లకే పేదవాడి పొట్టను అన్న క్యాంటీన్లు నింపాయి.

క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అక్షయపాత్ర సంస్థతో ఒప్పందం చేసుకొని ప్రజలకు నాణ్యమైన భోజనం అందించారు. 4.31 కోట్లు మంది పేదల ఆకలని తీర్చిన అన్న క్యాంటీన్ దేశంలో ఒరవడికను సృష్టించింది. రోజుకు 3 లక్షల మంది ఆకలిని అన్న క్యాంటీన్లు తీర్చాయి. కానీ పేదవాడు కడుపునిండా భోజనం చేస్తే చూడలేని గత దగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి పేదవాడి పొట్ట కొట్టింది.

అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణలో అవినీతి ఉందంటూ రోత పత్రికలో తప్పుడు ప్రచారాలు చేశారు. రాబడి లేని వ్యవస్థను నిర్వహించాల్సిన అవసరం ఏముందంటూ మాజీ మంత్రి బొత్స సైతం వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణాలో ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన క్యాంటీన్లను, పేర్లు కూడా మార్చకుండా కొనసాగించాయి. 2019 తర్వాత సొంత ఖర్చులతో టీడీపీ నాయకులు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడికి అన్నం పెడుతున్నా నోటికాడ కూడును కూడా గత పాలకులు లాక్కున్నారు.

టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను కూల్చివేశారు. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పునరుద్ధరణ ఫైలుపై సంతకం చేశారు. తొలివిడతలో భాగంగా 2024 ఆగస్టు 15 నాడు 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. సెప్టెంబర్ 19 నాటికి మరో 75 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

2025 జనవరి నాటికి అవి కాస్త 204కు చేరుకున్నాయి. ఈ అన్న క్యాంటీన్లకు హరేకృష్ణ ఫౌండేషన్ సంస్థ, అక్షయపాత్ర ఫౌండేషన్ సంస్థలు అల్పాహారం, భోజనాన్ని సరఫరా చేస్తుంది. రూ.5లకే రుచికరమైన భోజనం అందించే విధంగా ఈ రెండు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అక్షయ పాత్ర అంటే తరగని పాత్ర… కోవిడ్ సమయంలో, వరద సమయంలో, పుష్కారాల సమయం ‘‘అక్షయపాత్ర’’ వారు అందించిన సేవలు మరువలేనివి. రాష్ట్రం మొత్తం మీద 204 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవాడి కడుపు నింపుతున్నారు.

డోల బాల వీరాంజనేయస్వామి
(మంత్రివర్యులు)

LEAVE A RESPONSE