Suryaa.co.in

Features

వైశ్విక భాష

ప్రకృతిలో పంచ భూతాలుగా భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము ఉన్నాయన్నది తెలిసిన విషయమే. ఈ అయిదు క్రమంగా గంధ(వాసన), రూప, రస, శబ్దాలకు కారణాలయ్యాయి. అన్నిటికంటే ఆకాశ తత్త్వం అతి సూక్ష్మమైనది. – శబ్దానికి కారణమయినది. ప్రపంచమంతా ఆ శబ్దశక్తి నిండి ఉంది.

భూమి, నీరు, వాయువు, అగ్ని – ఈ నాలుగింటి ఉనికి తెలుసుకోవడం సులభమే. కానీ ఈ ఆకాశానికి మరొక పేరు శూన్యం. తెలుసుకోవడం కష్టం. అదేవిధంగా ప్రకృతిలో నిండి ఉన్న శబ్దశక్తి కూడా తెలుసుకోవడం కష్టం. మహర్షులు వేలకొలది సంవత్సరాల తపస్సుతో ఆ శబ్దాన్ని గ్రహించగలిగారు. ముందుగా అది ప్రణవమని గ్రహించారు. దానిని ఇంకా పరిశీలించగా అక్షరములు వెలువడ్డాయి.

అవే 50సంస్కృత అక్షరాలు. ఈ అక్షరాలు ఏ రాతియుగం తరువాతి వారో భావవ్యక్తీకరణ కోసం తయారు చేసుకున్నవి కావు. ప్రతి అక్షరాన్ని ఒక దైవశక్తిగా ఉపాసించారు. ఈ తపస్సు, ఉపాసన అనేవి వైజ్ఞానికుల యొక్క అద్భుత ఆవిష్కరణలకు అన్వేషణగా గ్రహించాలి.

ఇది ‘వైశ్వికభాష’(Universal Language). వేదాలు, పురాణాలు, ఇతిహాసములు, స్తోత్రములు, మంత్రాలు ఇలా నిరంతర తపస్సుతో ఆవిష్కరించి అందించబడ్డాయి.

భాషకి అర్థం ఎంత ముఖ్యమో శబ్దం కూడా అంతే ముఖ్యం. శబ్దశక్తి, అర్థశక్తి సమానంగా ఉండే భాష సంస్కృతం మాత్రమే. అందుకే వేదములు శబ్దప్రాధాన్యంగా ఉదాత్త అనుదాత్త మొదలైన స్వరములతో ఉంటాయి. అనువాదాల వలన అర్థం తెలుస్తుందేమో కానీ శబ్దశక్తి మాత్రం సంస్కృత భాషలోనే ఉంటుంది. దైవికమైన శబ్దశక్తితో అనుసంధానింపబడి, శాశ్వత లోక క్షేమం కొరకు దైవమె మహర్షుల ద్వారా తెలియజేసినవే వేదపురాణేతిహాసాలు. నేడు నాగరికతగా చెప్పుకొస్తున్న అనేక అంశాలకంటే కొన్ని వేలరెట్ల నాగరికత వాటిలో కనిపిస్తుంది.

సంస్కృతంలో ఉంటే అందరికీ అందుబాటులోకి ఎలా? అనే ప్రశ్న రావచ్చు. ఏ దేశంలోనైనా ఆ దేశపు భాష – సంస్కృతి విడదీయలేనివి. అలాగే భారతీయ భాష అయిన సంస్కృతం దేశపు భాష కనుక అన్ని శాస్త్రములు ఆ భాషలోనే ఉన్నాయి. కనుక భారతీయుడనేవాడు దేశభక్తీ కలవాడు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన భాష సంస్కృతం. కానీ విషయం తెలుసుకోవడానికి ప్రాంతీయ భాషలలోకి చాలా గ్రంథాలు అనువదింపబడ్డాయి.

అయినా ఏ భాషైనా ఏ విషయమైనా నేర్చుకోకుండా రాదు. ఎబిసిడిలు దిద్దడం దగ్గరనుంచి ఎన్నో భాషలు నేర్చుకుంటున్నారు. అలాగే సంస్కృతం కూడా నేర్చుకోవాలి. జర్మనీ మొదలైన దేశాలలో సంస్కృతం నేర్పుతున్నారు. డానికి కారణం సంస్కృతంలో ఎన్నో వైజ్ఞానిక రహస్యాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి అనేది వారి సమాధానం. సంస్కృతాన్ని అభ్యసించడం అంటే భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవడమే.

అంతేకాక నేడు అనుకూల, ప్రతికూల శక్తుల ప్రభావాన్ని తెలియజేసే పరికరాలు చాలా రావడం వలన ఒక్కొక్క సంస్కృత అక్షరానికి, వాటి కూర్పులో ఏర్పడే పదాలకు, దైవనామాల వల్ల ఎటువంటి అనుకూల శక్తులు వెలువడుతాయో ఋజువుఅవుతోంది. సంస్కృత భాషా పదాలు వ్యతిరేక శబ్దతరంగాలను ఆపగలవు.

పంచభూతములు కూడా ఆ శబ్దశక్తిని గ్రహించి స్పందిస్తాయి. సంస్కృతం “Oldest of the indo-european languages’అని పరిశోధకులు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇటువంటి అమృతభాష నేడు మృతభాష(dead language)గా చెప్పబడుతోంది. విశ్వవిజ్ఞాన రహస్యాలు సంస్కృతంలోనే కనుక్కోబడ్డాయి. దానికి కారణం ఇది ‘cosmic language’. అందుచేతనే కంప్యూటర్లకు తేలికగా ఈ భాషే అనుసంధానింపబడుతోంది.

వీటన్నిటికీ మించి భారతీయుల ఔన్నత్యం గురించి తెలుసుకోవాలంటే ఈ భాషలో వచ్చిన విజ్ఞానరాశి తెలుసుకోవాల్సిందే. ఈ భాషకు దూరం చేస్తే భారతీయతకు దూరం చేయొచ్చన్న దురుద్దేశంతోనే,. పరాయిపాలనలో వాళ్ళ భాష ప్రవేశపెట్టబడింది.

ఏ దేశానికైనా పరాయి పాలననుండి విముక్తి లభించాక, వారి దేశము యొక్క భాష, సంస్కృతి కొన్ని వేల సంవత్సరముల నాటిదే అయినా తిరిగి పునరుద్ధరించుకొనే ప్రయత్నమే చేశారు.

కానీ భారతదేశానికి అత్యంత ప్రాచీనమైన, విలువైన నాగరికత – ప్రపంచ దేశాలకు గురు పీఠం వంటిది అయినా, కనీసం వాటిలో ఏముందోనని తెలుసుకునే ప్రయత్నమైనా జరుగలేదు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగిఉంటే నేడు అనుభవిస్తున్న విషవాయువుల అపరిశుభ్ర నీటి బాధలు ఉండేవి కావు.

విషవాయువులను వెదజల్లే ప్లాస్టిక్ మొదలైన వాటికి దూరంగా ఉండి ఎన్నో రోగాలనుండి కాపాడబడేవాళ్ళం. విషపు రసాయనాలతో కూడిన ఆహారము కాకుండా మన వేదభాగాల్లో నున్న సేంద్రియ ఎరువులు మొదలైన వాటి వలన ఆరోగ్యకరమైన తిండి దొరికేది.

పరాయి పాలనలో ఈ నాగరికతను చూసి మనసులో అబ్బురపడినా వారి స్వార్థం కోసం ఈ నాగరికతలకు మూలమైన సంస్కృతిని సంస్కృత భాషలోనున్న శాస్త్రాలని నాశనం చేశారు. కాశ్మీరు, కాశీవంటి ప్రాంతాలలో కొందరు పండితులు(విజ్ఞానశాస్త్రవేత్తలు) ప్రాణాలకు తెగించి కొన్నిటినైనా కాపాడబట్టి ఈ మాత్రం శాస్త్రాలైనా మిగిలాయి.

– బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

LEAVE A RESPONSE