-
వైసీపీతో మాచ్య్ఫిక్సింగ్పై ‘అసలు’ తమ్ముళ్ల ఆగ్రహం
-
వైసీపీ నేతల క్వారీలు కొనసాగుతున్న వైనంపై అసంతృప్తి
-
పెద్దిరెడ్డితో వ్యాపారబంధంపై కన్నెర్ర
-
ఒంగోలులో మీటింగ్కు సిద్ధమవుతున్న కమ్మ సంఘ నేతలు?
-
అదే వేదికపై టీడీపీ-వైసీపీ వ్యాపారబంధంపై పేలుళ్లు?
-
పార్టీని కాపాడమంటూ నాయకత్వానికి పిలుపు
-
లేకపోతే దూరమవుతామన్న హెచ్చరికలకు సిద్ధం?
-
ఒకటవుతున్న అసలు టీడీపీ కార్యకర్తలు, నాయకులు
-
‘సేవ్ ప్రకాశం టీడీపీ’ పేరుతో వేదిక?
-
ఉమ్మడి ప్రకాశం టీడీపీలో ‘సూర్య’ కథనం ప్రకంపనలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ నేతృత్వంలోని వైసీపీ రాష్ట్రంవ్యాప్తంగా 151 స్థానాలు గెలిచిన సునామీని ఎదుర్కొంది ఆ జిల్లా ఒక్కటే. యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ సైతం.. వైసీపీని ఎదుర్కొని పార్టీని నిలబెట్టిన ఆ జిల్లా పార్టీ కార్యకర్తలకు సెల్యూట్ కొట్టారు. పార్టీ మీకు రుణపడి ఉంటుందని ఆకాశానికెత్తారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ సునామీ సృష్టించింది.
కానీ పార్టీ జెండా మోసిన ‘ఒరిజినల్ టీడీపీ’ కార్యకర్తలకు.. ప్రధానంగా కమ్మసామాజికవర్గ నేతలకు మాత్రం , తాజా పరిణామాలు మింగుడుపడటం లేదు. తమ పార్టీ అగ్రనేతలు వైసీపీ నేతలతో కలసి చేస్తున్న తెరచాటు వ్యాపారాలు, మిలాఖత్ రాజకీయాలు చూసి ఉడికిపోతున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని అంటిపెట్టుకుని జెండా మోస్తున్న ‘అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు’ ఈ రాజకీయ వ్యాపార బంధానికి చెక్ పెట్టి, నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేసేందుకు సిద్ధమవుతుండటమే, ఇప్పుడు హాట్టాపిక్. తాజాగా ‘సూర్య’లో వచ్చిన ‘‘తమ్ముళ్ల ‘కోట్లా’ట’’ కథనం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎన్టీఆర్ హయాం నుంచి.. చంద్రబాబుకు ఆప్తమిత్రుడైన కరణం బలరామ్, చెంచు గరటయ్య, దామచర్ల మూలస్తంభాలుగా నిలబడ్డారు. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్, శిద్దారాఘవరావు తోడయ్యారు. వైశ్య వర్గానికి చెందిన శిద్దా రాఘవరావుకు వివాదరహితుడన్న పేరుంది. ఆయన స్వతహాగా వ్యాపారస్తుడు కాబట్టి, ఏ పార్టీలో ఉన్నా ఇతర పార్టీ వారితో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. ప్రస్తుతం శిద్దా ఏ పార్టీలోనూ లేరు. కానీ ఆయన బలరామ్తో కలసి నడుస్తుంటారన్నది బహిరంగమే.
కానీ వీరిలో కరణం బలరామ్-గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్యే నిరంతరం దాడులు-ప్రతిదాడులు, హత్యలు జరిగేవి. ఈ క్రమంలో కోర్టులో ఉన్న వేమవరం జంట హత్యల కేసు కీలకదశకు చేరుకుంది. మధ్యలో ఈ ఇద్దరు నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యే గరటయ్య ఏ పార్టీ మారితే, ఆ పార్టీలోకి వారి వెంట వారి సొంత వర్గాలు నడిచేవి. గరటయ్యకు ఇప్పటికీ బలమైన వర్గమే ఉంది. ఆయన గతంలో వైసీపీలో చేరి, మళ్లీ సొంత గూటికి చేరారు.
కానీ.. వీరిలో ఎవరి వైపూ వెళ్లకుండా, టీడీపీలో ఎవరుంటే వారిపైపే నిలుస్తున్న వారి సంఖ్యనే అధికం. అందుకే ప్రకాశం జిల్లాలో టీడీపీ బలంగా ఉంది. జగన్ ప్రభంజనంలోనూ నాలుగు సీట్లు సాధించింది. వారిలో కమ్మసామాజికవర్గం, యాదవులే ఎక్కువ. రెడ్లు తొలి నుంచి కాంగ్రెస్ వైపే ఉండగా, తర్వాత వైసీపీ వైపు మళ్లారు. ఆ రకంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపి వైవి సుబ్బారెడ్డి ప్రభావం కూడా జిల్లాలో ఎక్కువే.
జిల్లాలో మొత్తంగా చూస్తే కమ్మ వర్గంలో కరణం బలరామ్, రెడ్డివర్గంలో బాలినేనికి ఉన్న మాస్ ఇమేజ్ మరెవరికీ లేదన్నది నిర్వివాదాంశం. వారిద్దరిదీ తమకు దన్నుగా నిలిచే వారికోసం ఎందాకైనా వెళ్లే మనస్తత్వం. అందుకే వారికి అంత ఇమేజ్. ఆ ఇమేజ్ మిగిలిన వారికి లేదన్నది బహిరంగమే.
అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ తండ్రిని.. కొన్ని ద శాబ్దాల నుంచి అభిమానించే కమ్మవర్గ నేతలు, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరే సంప్రదాయం ఉంది. కొత్తగా గత ప్రభుత్వంలో చీరాల టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరామ్, వైసీపీలో చేరడంతో కథ మారింది. అయితే అద్దంకి, పరుచూరు నియోజకవర్గాల్లోని బలరామ్ అనుచరులు మాత్రం.. ఆయన చీరాలకు వెళ్లడంతో, టీడీపీలోనే కొనసాగుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ హయాం నుంచీ ఇప్పటివరకూ, కమ్మసంఘాలే టీడీపీ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కథ.
జగన్ను గెలిపించిన నాటి ఎన్నికల్లో.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తుడిచిపెట్టుకుని పోయినా, ఉమ్మడి ప్రకాశం జిల్లా మాత్రం, నాలుగుసీట్లతో టీడీపీని నిలబెట్టింది. దానికి కారణం కమ్మ సామాజికవర్గ దన్నుతోపాటు, బీసీ కులాల సహకారమే. అప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా పార్టీ కార్యక్రమాలు జరిగిన జిల్లా కూడా, ప్రకాశమే కావడం గమనార్హం.
పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో.. ఆయనకు రక్షణగా నిలబడింది కూడా కమ్మ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలే. మంత్రి సురేష్ ఆధ్వర్యంలో బాబుపై రాళ్ల దాడి జరిగితే, అప్పుడు రక్షణకవచంలా నిలబడింది కూడా అదే వర్గం అన్నది విస్మరించకూడదు. ఆ కేసులో బాధితులకు ఇప్పటికీ న్యాయం జరిగింది లేదన్న విమర్శ లేకపోలేదు.
అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు.. పార్టీ జెండా మోసిన అసలు సిసలు కార్యకర్తలతోపాటు, పార్టీకి ప్రాణవాయువయిన కమ్మ సామాజికవర్గానికి మింగుడుపడటం లేదు. కారణం తమ పార్టీ నుంచి తమ రెక్కల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యేలు- రాష్ట్ర ప్రముఖులు, వైసీపీ నేతలతో కలసి వ్యాపారాలు చేసుకోవడమే. ప్రధానంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలోని వైసీపీ నేతలకు చెందిన ఇసుక, లిక్కర్, గ్రావెల్ వంటి ఆదాయం ఉన్న వ్యాపారాలు మూతపడ్డాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు పార్టీ అధికారం కోల్పోవడంతో, మైనింగ్ వ్యాపారాలు మానుకున్నారు.
కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం కడప ఎంపి వైఎస్ అవినాష్రెడ్డి మామ ప్రతాప్రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి, కాశిరెడ్డి వంటి వైసీపీ ప్రముఖుల మైనింగ్ వ్యాపారాలు మాత్రం లక్షణంగా, ఎలాంటి అవరోధాలు లేకుండా జరుగుతుండటాన్ని కమ్మ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది.
గత ఎన్నికల్లో దర్శి మహిళా అభ్యర్ధిని ఓడించిన బూచేపల్లి క్వారీ వ్యాపారాలను ఎలా ఇంకా ఎలా కొనసాగిస్తున్నారని, కమ్మవర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. వారంతా జిల్లాలోని ఓ రాష్ట్ర స్థాయి ప్రముఖుడితోపాటు, పార్టీలోని మరో కీలకనేతతో రక్షణ ఒప్పందం చేసుకున్నారన్న అనుమానం పెరిగి పెద్దదయింది. దానికి కారణం వైసీపీ నేతల క్వారీలపై ఎలాంటి దాడులు జరగకపోవడమే. ఇది క్షేత్రస్థాయి కార్యకర్తల్లో చర్చ కావడం విశేషం. నిజంగా పార్టీ నాయకత్వం అనుకుంటే బూచేపల్లితోపాటు, వైఎస్ అవినాష్రెడ్డి మామ వ్యాపారాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతాయా అని కమ్మ వర్గ నేతలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
అదీగాక.. తాము ఏ పార్టీలో ఉంటే, తమతోపాటు ఆపార్టీలోకి చేరే వారికి మాత్రమే పనులు చేస్తున్న అగ్రనేతలు.. తొలినుంచీ పార్టీమారకుండా.. టీడీపీ జెండా మోసిన ఒరిజినల్ నాయకులు, కార్యకర్తలను మాత్రం నిర్లక్ష్యం చేయడం తిరుగుబాటుకు కారణమవుతోంది. ఈ జాబితాలో కమ్మ సామాజికవర్గమే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం. ఇప్పుడు ఆ కమ్మ వర్గమే రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన వారిపై తిరుగుబాటు సిద్ధపడటం విశేషం.
దానికి మరో కారణం.. ఎన్నికల ముందు- తర్వాత, వైసీపీ నుంచి వచ్చిన వారికి అన్ని వ్యవహారాల్లో పెత్తనం ఇవ్వడం! తాము సర్వం కోల్పోయి పార్టీ కోసం పనిచేస్తుంటే.. వ్యాపార రక్షణ కోసం పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు మాత్రం.. తాము ఏ పార్టీ మారితే ఆ పార్టీలో చేరే సొంత అనుచరులకు మాత్రమే పనిచేస్తుంటే, ఇక తాము పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి? దీని సంగతి తేల్చాల్సిందే అన్న నిర్ణయానికి వస్తున్నారు.
అటో ఇటో.. రె‘ఢీ’
అందులో భాగంగా ఎవరెటు మారినా కులాభిమానంతో తొలినుంచీ పార్టీని బతికిస్తున్న కమ్మ సంఘ నేతలు, త్వరలో సమావేశం నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు వేదికగా జిల్లాకు చెందిన కమ్మ నాయకులతోపాటు, తొలినుంచీ లోనే కొనసాగుతున్న ఒరిజినల్ టీడీపీ వారితో ఒక భారీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
‘సేవ్ టీడీపీ ప్రకాశం’ పేరుతో పార్టీలో.. ప్రవేశించిన అవలక్షణాలు, ఎన్టీఆర్ కాలం నాటికి భిన్నంగా జరుగుతున్న పరిణామాలు, వైసీపీతో పార్టీ నేతల వ్యాపారాలపై ఆ వేదిక నుంచే గళం విప్పేందుకు ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న వ్యాపార బంధాలు చూసి విసుగెత్తిపోయిన కమ్మ వర్గ నాయకులు.. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లాలని, అప్పటికీ మార్పు రాకపోతే టీడీపీని విడిచిపెట్టే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
‘‘ మొన్న జగన్ను ఓడించేందుకు మాకు ఉన్న వ్యక్తిగత వర్గ విబేధాలు, ముఠా తగాదాలు పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేశాం. కానీ ఇప్పుడు పార్టీ పరిస్థితి చూస్తుంటే తప్పు చేశామా అనిపిస్తోంది. కానీ తప్పదు. మళ్లీ జగన్ను గెలిపిస్తే బతకనివ్వడన్న భయంతో ఓట్లేశాం. ఈసారి మేం అసలు ఎవరికీ ఓటు వేయం. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ పార్టీ కాదని తేలిపోయింది. అంతా వ్యాపారం. సర్దుబాట్లు. ఇక్కడ జరుగుతున్నదంతా పార్టీకి తెలుసు. అసలు వారికి అన్నీ చెప్పే ఒక నాయకుడు చేస్తున్నారని బహిరంగంగా చెబుతుంటే, ఇంకా మేం కులం బలహీనతతో పనిచేయడం ఎందుకు’’ అని కమ్మ సంఘం నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
అద్దంకిలో టీడీపీతో వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్?
అటు అద్దంకి వైసీపీలో కూడా దాదాపు ఇలాంటి అసంతృప్తి వ్యవహారమే నడుస్తుండటం విశేషం. వైసీపీ ఎంపి వైవి సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గంలో పార్టీ పడకేసిందని, అధికారపార్టీ అగ్రనేతలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారన్న ఆగ్రహం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో కమ్మ వర్గం ఓట్లు 50 వేలు ఉండగా, ఎస్సీల ఓట్లు కూడా 50 వేలున్నాయి. రెడ్ల ఓట్లు 15 వేల వరకూ ఉంటాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల నియోజకవర్గంలో టీడీపీని ఎదుర్కోవాలంటే తెలివి ఉన్న ఎవరైనా,వైసీపీని బలపరిచే ఎస్సీలకే మండల పార్టీ అధ్యక్ష పదవులిస్తారు. కానీ విచిత్రంగా ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యే కమ్మ సామాజికవర్గానికి నాయకుడయితే.. తమ పార్టీ కూడా ఒక్క మండలం మినహా, నాలుగు మండలాల అధ్యక్ష పదవులనూ కమ్మ వారికే ఇవ్వడం వెనుక, మతలబు ఏమిటని వైసీపీ దళిత నేతలు ప్రశ్నిస్తున్నారు.
‘‘అయితే వాళ్లలో కొందరు నరసరావుపేట, కొందరు గుంటూరులో ఉంటారు. ఇక్కడ ఎవరూ ఉండరు. అలాంటి వారిని మండల అధ్యక్షులుగా నియమించారంటే టీడీపీతో మ్యాచ్ఫిక్సింగ్ ఏస్థాయిలో జరుగుతుందో అర్ధమవుతుంద’ని వైసీపీకి చెందిన ఓ దళిత నేత వ్యాఖ్యానించారు. ఇది టీడీపీలో ఏ నాయకుడి ప్రయోజనాలు కాపాడేందుకన్నది అందిరికీ తెలిసిందేనంటున్నారు.