– కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాను
– ఏ చిన్న అవసరమున్నా నన్ను కార్యకర్తలు సంప్రదించవచ్చు
– కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావిస్తా
– ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు తేలేదు
– మన కళ్ల ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు
– కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది
– 2004లో చచ్చిన పీనుగలా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
భద్రాచలం: 60 లక్షల మంది కార్యకర్తలున్న బీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద కుటుంబమని.. ఈ కుటుంబాన్ని మరింతగా పెద్దగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం భద్రాచలంలో నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆమె పాల్గొని కార్యకర్తలకు భరోసానిచ్చారు.
పార్టీ అధినేత కేసీఆర్కి కార్యకర్తలకు మధ్య వారధిగా తానుంటానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడమే బీఆర్ఎస్ కార్యకర్తల ప్రథమ కర్తవ్యమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మనందరి కళ్ల ముందే తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దన్నారు. మనం కాస్త ఏమరపాటుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆగం చేస్తుందని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించాల్సిన అవసరం ఉందన్నారు. మోసపోతే గోస పడుతామన్న విషయాన్ని కేసీఆర్ పదే పదే చెప్తారని గుర్తు చేశారు. మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమన్న విషయం రాష్ట్ర ప్రజలకు మరోసారి తెలిసివచ్చిందన్నారు.
ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్ లో ముగ్గురు మంత్రులున్నా జిల్లాకు మూడు పైసలు కూడా తేలేదన్నారు. నిరుపేదలకు ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరికి సాయం చేయకుండా మోసం చేసిందన్నారు. రాష్ట్ర అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విపరీతమైన అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తెచ్చిన రూ.1.60 లక్షల కోట్ల అప్పులను ఎందుకు ఖర్చు చేశారంటే సమాధానం చెప్పకుండా ప్రభుత్వం బుకాయిస్తుందన్నారు.
తెచ్చిన అప్పులను ఏయే పనుల కోసం ఖర్చు చేశారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పి తీరాలన్నారు. అప్పటి వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. రూ.40 వేల కోట్ల విలువైన కంచ గచ్చిబౌలి భూములను రూ.10 వేల కోట్లకు ప్రభుత్వం తాకట్టు పెట్టిందని.. ఆ డబ్బులు తెచ్చి రైతు భరోసా ఇచ్చామని, రైతు రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని వివరించారు.
అదే నిజమైతే ఇప్పటికీ 60 శాతం మంది రైతులకు ఎందుకు రుణమాఫీ కాలేదు.. సగం మంది రైతులకు రైతుభరోసా డబ్బులు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. రూ.10 వేల కోట్లు ఎక్కడికిపోయాయి.. ఎమయ్యాయో ప్రభుత్వం చెప్పి తీరాలన్నారు. అప్పులతో పాటు రాష్ట్ర ఖజానాను ఎందుకు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.
2004లో చచ్చిన పీనుగలా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అప్పుడే తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయడంతోనే వందలాది మంది బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, యువత బలిదానాలతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది తప్ప ఉట్టిగనే ఇవ్వలేదన్నారు.
ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తులు చూడడానికి మాత్రమే తెలంగాణ వాళ్లలాగా కనిపిస్తారని.. కానీ వాళ్లు పని చేసేది తెలంగాణకు వ్యతిరేకంగానని తేల్చిచెప్పారు. వందలాది హామీలిచ్చి, కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిలదీయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ గా నిలబెట్టిన ఘనత కేసీఆర్ ది అన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడి పని చేశారన్నారు. ఖమ్మం జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టి మెజార్టీ పనులను పూర్తి చేశారని తెలిపారు. తెలంగాణకు ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అన్నారు. 1969లో ఖమ్మం జిల్లాలో పుట్టిన తెలంగాణ ఉద్యమం కొద్ది రోజులకే రాష్ట్రమంతా వ్యాపించిందన్నారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉద్యమ ద్రోహి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఎందరో అలాంటి ద్రోహుల కుట్రలను చూశామన్నారు. త్వరలోనే భద్రాచలం నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని.. ఆ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ దేనని స్పష్టం చేశారు.