Suryaa.co.in

Telangana

సోనియా, రాహుల్ పై ఈడీ కేసు నమోదు చేసినా రేవంత్ రెడ్డి స్పందించ‌క‌పోవ‌డంలో మ‌త‌లబు ఏమిటి ?

– రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం తడిసిపోయి, మామిడి పూత రాలిపోయి రైతులు కష్టాల్లో ఉంటే కనీసం సమీక్షించే తీరిక ప్ర‌భుత్వానికి లేదా
– వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ 20 వేలు నష్టపరిహారం చెల్లించాలి
– ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత
– బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవులపల్లి పట్టాభిరామ్ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఖ‌మ్మం: కాంగ్రెస్ పాల‌న‌తో తెలంగాణ రాష్ట్రంలో తిరోగ‌మ‌న దిశ‌లో ప‌య‌నిస్తున్న‌ద‌ని, రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌ను కోల్పోయింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో ప‌రిపాల‌న ప‌డ‌కేసింద‌ని, ప్ర‌చార ఆర్భాటాలే త‌ప్ప ప్ర‌భుత్వానికి ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఒక్క ప‌థ‌కం కూడా స‌రిగ్గా అమ‌లు కావ‌డం లేద‌ని, కాబ‌ట్టి ఎక్కడికక్కడ ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ నాయకులను నిలదీయాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

ఖ‌మ్మం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన ఎమ్మెల్సీ క‌విత… ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర నివాసంలో విలేక‌రుల‌తో మాట్లాడారు. అనంతరం సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం లింగాల గ్రామంలో దేవరపల్లి పట్టాభిరామ్ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పట్టాభిరామ్ నేతృత్వంలో కల్లూరు మండలంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పై ఈడీ కేసు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది… కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కనీసం స్పందించలేదని విమ‌ర్శించారు. సొంత పార్టీ నాయ‌కుల‌పై కేసులు పెట్టినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించ‌క‌పోవ‌డంలో మ‌త‌లాబు ఏమిట‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి తో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా వడగండ్ల వాన వల్ల జరిగిన పంట నష్టం పై సమీక్షించలేదని, రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం తడిసిపోయి, మామిడి పూత రాలిపోయి రైతులు కష్టాల్లో ఉంటే కనీసం సమీక్షించే తీరిక ప్ర‌భుత్వానికి లేదా అని నిల‌దీశారు.

రైతులను పలకరించిన పాపాన పోలేదని, ఇంతటి దౌర్భాగ్యమైన స్థితి ఎప్పుడూ లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాలపై కనీసం రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడలేదని ఎండ‌గ‌ట్టారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ 20 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మంత్రులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే ప్రయత్నం చేయడం తప్ప ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని మండిప‌డ్డారు. ఖ‌మ్మం అంటేనే క‌మ్యునిస్టుల జిల్లా అనే నానుడి ఉంద‌ని, కానీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను క‌మ్యునిస్టు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం దారుణ‌మ‌ని అన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని, ప్రజలు వెళ్లాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. రైతు భరోసా సగం మందికి రానేలేదని, రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదని, 60 శాతం మందికి రుణమాఫీ కాలేదని వివ‌రించారు. రైతు కూలీలకు ఇస్తామన్న ఆత్మీయ భరోసా డబ్బులు ఇవ్వనేలేదని, పథకాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని మండిప‌డ్డారు.

ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని తేలిపోయిందని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే భక్త రామదాసు ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి 60 వేల ఎకరాలకు నీళ్లు అందించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టలేదని విమ‌ర్శించారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ పండుగ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్జ్ఞ‌ప్తి చేశారు.

LEAVE A RESPONSE