Suryaa.co.in

Editorial

తమ్ముళ్ల ‘కోట్లా’ట!

  • కింది స్థాయిలో వైసీపీతో తమ్ముళ్ల కొట్లాట, కేసులు, జైళ్లు

  • పైస్థాయిలో వైసీపీ నేతలతో అగ్రనేతల వ్యాపార ‘కోట్లా’ట

  • వైసీపీ ప్రముఖులతో టీడీపీ అగ్రనేత వ్యాపార బంధం

  • చిత్తూరు వైసీపీ పెద్దారెడ్డితో ప్రకాశం ప్రముఖుడి మైనింగ్ దందా

  • కొడుకు కనుసన్నల్లో పుత్తూరులో క్వారీ వ్యాపారం?

  • వైసీపీ జమానాలో పేర్ని నాని, కొడాలి నానితో ఇదే అద్దంకి ప్రముఖుడి మైనింగ్ వ్యాపారం

  • ప్రకాశంలో నిరాటంకంగా నడుస్తున్న వైసీపీ నేతల మైనింగ్ వ్యాపారం

  • అవినాష్‌రెడ్డి మామ, బూచేపల్లి, కాశిరెడ్డి వ్యాపారాలకు టీడీపీ అగ్రనేత సహకారం

  • బూచేపల్లికి గ్రీన్‌సిగ్నల్.. వెంకారెడ్డి వ్యాపారాలకు రెడ్‌సిగ్నల్ వేసిన వైచిత్రి

  • ఒకే పార్టీకి చెందిన ఇద్దరి నేతలకు తలా ఒక న్యాయం

  • రంగప్రవేశం చేసిన జనసేన కీలకనేత?

  • తాజాగా బల్లికురవ టీడీపీ నేతల లారీలను పట్టించిన అద్దంకి ప్రముఖుడు

  • కప్పం కట్టకుండా రాళ్లు తరలించడమే దానికి కారణమట

  • అద్దంకి ప్రముఖుడికి ఫిర్యాదు చేసినా ఫలితం లేని వైనం

  • పీఏతో మాట్లాడుకోమని సలహా ఇచ్చిన అద్దంకి పెద్ద

  • దానితో అద్దంకి ప్రముఖుడిపై టీడీపీ నేతల కన్నెర్ర

  • సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి వెళ్లే ఒక్కో లారీకి 15 వేలు కప్పం

  • మార్టూరు నుంచి వెళ్లే లారీకి 25 వేలు కప్పం

  • వైసీపీ నేతలతో పార్టీ పెద్దల దందారాజ్!

( మార్తి సుబ్రహ్మణ్యం)

పసుపు జెండా మోసే కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వైరి పార్టీ ప్రత్యర్ధులతో నిత్యం కొట్లాడుతూ పార్టీని కాపాడుతుంటారు. ఆ క్రమంలో వైసీపీ ప్రత్యర్ధుల చేతిలో గాయపడుతుంటారు. హత్యలకు గురవుతుంటారు. ఆస్తులు నష్టపోతుంటారు. కేసులు ఎదుర్కొని, జైలుపాలవుతుంటారు. వారసులు అనాధలవుతుంటారు. కుటుంబాలకు ఏళ్ల తరబడి దూరమవుతుంటారు. ఒక్కోసారి ప్రత్యర్ధుల హెచ్చరికలకు భయపడి, కుటుంబాలతో సహా ఎక్కడికో వలస వెళుతుంటారు. అయినా ఎత్తిన జెండా దించరు. వైసీపీకి జైకొట్టరు. ప్రాణం మీదకు వస్తే తమ చేతులతో తమ గొంతులే కోసుకుంటారు రామచంద్రయ్యలా! ఇన్నేళ్లయినా టీడీపీ జనక్షేత్రంలో బలంగా ఉందంటే .. దానికి ఇలాంటి ‘పార్టీ పిచ్చి కార్యకర్తలే’ కారణమన్నది, మనం మనుషులం అన్నంత నిజం. ఆ బలహీనతే పార్టీకి బలం కూడా!

కానీ అదే కార్యకర్తల త్యాగాల పునాదుల మీద, వారి రెక్కలకష్టంతో గెలిచి ఎమ్మెల్యే, మంత్రులయిన వారు మాత్రం.. ప్రత్యర్థి పార్టీ నాయకులతో వ్యాపార ‘కోట్లా’ట పెట్టుకుంటున్నారు. తెరచాటు వ్యాపారాలు చేస్తున్నారు. చీకటి మాటున కలసి బిజినెసు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదో తెలివైన రాజకీయ వ్యాపారంగా మారింది.

ఎన్టీఆర్ జమానాలో ఈ సంస్కృతి-తెలివి భూతద్దం వేసి వెతికినా కనిపించేది కాదు. సొంత సోదరులు వేర్వేరు పార్టీల్లో ఉంటే, ఎదురుపడినా మాట్లాడుకోరు. ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లరు.పెళ్లిళ్లు-చావులకూ వెళ్లరు. రాజకీయం అంటే రాజకీయమే. పార్టీ అంటే పార్టీనే. కొట్లాటలు వస్తే ఎందాకయినా సై. అలా.. అప్పుడు ప్రత్యర్ధి పార్టీలతో కొట్లాటయితే, ఇప్పుడు ‘కోట్లా’ట! కోట్లు సంపాదించుకునే ఆటయిందన్నమాట!! ఇదే లేటెస్ట్ బిజినెస్ పాలిటిక్స్!!!

అద్దంకి నుంచి పుత్తూరు వరకూ జరుగుతోంది ఇదేనన్నది తమ్ముళ్ల ఆవేదన, ఆరోపణ. కానీ వారి వేదన- రోదన పట్టించుకునేదెవరు? చర్యల కొరడా ఝళిపించే సాహసం చేసేదెవరు? అంటే..‘ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి’ సామెత మాదిరి అన్నమాట!

వైసీపీ జమానాలో చిత్తూరు జిల్లాను కంటిచూపుతో శాసించిన పెద్దారెడ్డి ఆయన. ఎంతంటే.. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా కుప్పం నియోజకవర్గంలోకి రానీయకుండా, ఆయనపై రాళ్ల వర్షం చేసి, డజన్ల మంది తమ్ముళ్లపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టించేంత పవర్‌ఫుల్ అన్నమాట! మరి అలాంటి ప్రత్యర్థితో కలసి, ఓ మంత్రి వ్యాపారం చేస్తున్నారంటే నమ్మగలరా? అసలు రాజకీయాల్లో ఇలా కూడా జరుగుతుందని నమ్మగలరా? ఎన్టీఆర్ జమానాలో అయితే ప్రాణం పోయినా నమ్మేవారుకాదు. కానీ ఇప్పుడు నమ్మితీరాల్సిన నిజం. ఎందుకంటే అదే జరుగుతోంది కాబట్టి!

చిత్తూరు జిల్లా పుత్తూరులో వైసీపీకి చెందిన ఓ పెద్దారెడ్డికి క్వారీ ఉంది. అది బాగా లాభాలొచ్చే క్వారీ. పార్టీ ఓడి, టీడీపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి పెద్దారెడ్డి వ్యాపారాలు సాగవు. ఆ క్రమంలో ఆ క్వారీ గురించి తెలుసుకున్న ఓ అద్దంకి రాష్ట్ర ప్రముఖుడు దానిపై మనసుపారేసుకున్నారు. అంతే.. చంద్రబాబును నియోజకవర్గంలోకి రానీయకుండా ఆయనపై రాళ్లదాడి చేయించి, కుప్పంలో టీడీపీని సమాధి చేసే యత్నం చేసిన పెద్దారెడ్డితో షేరింగ్ యాపారం మొదలుపెట్టారట.

చిత్తూరు ‘పెద్దారెడ్డి’తో కలసి బినామీ బిజినెస్

‘చెరిసగం’ ఒప్పందంతో, ‘అద్దంకి పెద్ద’ వ్యాపారంలో ఇప్పుడే అడుగుపెట్టిన తన కొడుకును రంగంలోకి దించి, పుత్తూరులో క్వారీ వ్యాపారం ప్రారంభించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జె.పొంగులూరు మండలానికి చెందిన ఓ మాజీ జడ్పీటీసికి ‘రాము’డు మంచిబాలుడన్న పేరుంది. అద్దంకిలో ఉన్న పార్టీ పెద్దకు చెందిన కల్యాణమండపంతోపాటు, గుళ్లాపల్లిలోని గ్రోత్‌సెంటర్‌లో మల్టీ గ్రానైట్, చీమకుర్తిలో డస్ట్‌తోలే లారీలు అన్నీ ఆయనే ‘అద్దంకి పెద్ద’ తరఫున చూసుకుంటారన్నది తమ్ముళ్లు చెబుతున్న మాట.

చీమకుర్తిలో గ్రానైట్ డస్టుతోలే లారీలు ఆయనకు అప్పగించిన నేపథ్యంలో.. చీమకుర్తి తమ్ముళ్లు వాటిని ఇటీవల అడ్డుకున్నారట. మొన్నటివరకూ వైసీపీ వారు నడిపించిన టిప్పర్లను మీరెలా నడిపిస్తారని పంచాయితీ పెట్టడంతో, అది కాస్తా ఆగిపోయిందట. అలాంటి వ్యాపారదక్షుడిని రంగంలోకి దింపిన ‘అద్దంకి పెద్ద’, తన కొడుకును పుత్తూరులో ‘పెద్దారెడ్డి’తో కలసి ప్రారంభించిన క్వారీ వ్యాపారానికి పర్యవేక్షకుడిగా మార్చారు. వారానికి రెండుసార్లు పుత్తూరుకు వెళ్లి, బిజినెస్ యాపారం లెక్కలు చూసుకోవడమే, ప్రకాశం జిల్లా ప్రముఖుడి తనయుడి పని.

వైసీపీ నేతల వ్యాపారాలకు ‘రెడ్డి’కార్పెట్

కాగా మైనింగ్ వ్యాపారంలోనే కాదు. రాజకీయ వ్యాపారంలోనూ తలపండిన ‘అద్దంకి పెద్ద’ది మామూలు బుర్ర కాదట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీకి చెందిన గ్రానైట్ వ్యాపారాలను, వైసీపీ సర్కారు నిలిపివేసింది. కానీ ‘అద్దంకి పెద్ద’ మాత్రం తెలివిగా.. గతంలో వైసీపీలో తనకున్న బంధాన్ని ఉపయోగించి, తన క్వారీలను గుడివాడ-బందరు నానిలకు ఇచ్చి, క్వారీలు కాపాడుకున్నారన్నది వైసీపీ వర్గాల్లో ఇప్పటికీ వినిపించే మాట.

కానీ టీడీపీ నాచయకత్వం సహా, కార్యకర్తల్లో మాత్రం.. పాపం ‘అద్దంకి పెద్ద’ వైసీపీ వల్ల కోట్లాదిరూపాయలు నష్టపోయారన్న సానుభూతి భారీ స్థాయిలో పొంది, అధికారం వచ్చిన తర్వాత అందుకు భారీ ప్రతిఫలం పొందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అంటే ఫలితాలు వెలువడిన మరుసటిరోజునుంచే.. గతంలో టీడీపీ, తర్వాత వైసీపీలో చేరి ప్రస్తుతం ఏ పార్టీలో లేని ఓ వైశ్య నేత క్వారీని, తన క్వారీలో కలిపి రాళ్లు కొట్టేయడం, అదికాస్తా మీడియాలో రావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కడప ఎంపి అవినాష్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి చీమకుర్తి-బల్లికురవలో, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లికి చీమకుర్తిలో, కాశిరెడ్డికి బల్లికురవలో ఉన్న క్వారీలపై, ఎలాంటి దాడులు లేకుండా నిరాటంకంగా కొనసాగుతుండటం ‘ఒరిజినల్ టీడీపీ కార్యకర్తల’కు ఆగ్రహం కలిగిస్తోంది.

అద్దంకిలో ఇద్దరు నేతల ముఠా రాజకీయాల నేపథ్యంలో.. ద్వితీయ స్థాయి నాయకులు, తమ నేత ఏ పార్టీ మారితే వారు కూడా ఆయన వైపే ఉంటారు. కానీ ఒరిజినల్ కార్యకర్తలు మాత్రం పార్టీ వైపే కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అలాంటి ఒరిజినల్ కార్యకర్తలే.. అద్దంకిలో పార్టీని రాజకీయ వ్యాపారులు భ్రష్టుపట్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

బూచేపల్లికి అలా.. మారం వెంకారెడ్డికి ఇలా!

ఇలా అన్ని స్థాయిల్లో వైసీపీ అగ్రనేతలతో కలసి వ్యాపారాలు చేసుకుంటున్న.. ‘అద్దంకి పెద్ద’ రాజకీయ-వ్యాపార నీతికి.. తెలుగుతమ్ముళ్లు నోరెళ్లబెడుతున్నారట. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ఒకరైన బూచేపల్లికి చెందిన క్వారీలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపె, దర్శి తమ్ముళ్లు ఇప్పటికే మండిపడుతున్నారు. ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి ఇన్చార్జిగా ఉండటం విశేషం. అయితే అదే వైసీపీ అద్దంకి పరిశీలకుడు, దర్శికి చెందిన మారం వెంకారెడ్డి క్వారీని మాత్రం ఆపివేయించడంపై టీడీపీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే మారంతో ఉన్న వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో, రంగంలోకి దిగిన జనసేన అగ్రనేత.. అద్దంకి పెద్దను నిలదీసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నిజానికి ‘అద్దంకి పెద్ద’కు.. దర్శిలో టీడీపీని ఓడించిన బూచేపల్లిపై, వ్యక్తిగతంగా, పీకల్లోతు కోపం ఉండాలి. కానీ అందుకు భిన్నంగా ఆయన క్వారీని విడిచిపెట్టి, వెంకారెడ్డి క్వారీని మూసివేయించడమే విచిత్రమని, టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు బూచేపల్లి క్వారీ విజయవంతంగా నడిచేందుకు ‘పై స్థాయి’లోనే లాలూచీ నడిచిందని, అందుకు ‘అద్దంకి పెద్ద’ రాయబారం నడిపారన్నది తమ్ముళ్ల ఉవాచ. ఇవన్నీ పార్టీ నాయకుల్లో బహిరంగంగా జరుగుతున్న చర్చనే.

కమ్మసంఘం కన్నెర్ర

కాగా అద్దంకిలో పార్టీలు మారకుండా, తొలినుంచీ తెలుగుదేశం జెండాను బతికిస్తున్న కమ్మ వర్గ నాయకులు, తాజా పరిణామాలపై కన్నెర్ర చేస్తున్నారు. అద్దంకిలో తమకు చెక్ పెట్టేందుకు.. మరో సామాజికవర్గ నేతను తీసుకువచ్చి పెత్తనం ఇవ్వడాన్ని, కమ్మసంఘం నాయకులు జీర్ణించుకోలేకపోతోందట. సహజంగా నియోజకవర్గాల్లో అధికారం మారిన వెంటనే రేషన్‌డీలర్లను మార్చి, సొంత పార్టీ వారిని నియమిస్తుంటారు. ఇది ఎక్కడైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అయినా జరిగేదే. కానీ అద్దంకిలో మాత్రం, గత 25 ఏళ్ల నుంచి ఒకే డీలర్ కొనసాగుతున్నారని తమ్ముళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు అద్దంకిలో పోలీసుస్టేషన్, మున్సిపాలిటీ, రెవిన్యూ ఆఫీసులపై పెత్తనం అప్పచెప్పి, తమపై రుద్దడాన్ని కమ్మసంఘం నాయకులు సహించలేకపోతున్నారట. సదరు డీలర్, బియ్యం రీసైక్లింగ్ సహా అన్ని వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తూ.. వీటికి మార్గదర్శిగా ఉన్న ‘వ్యాపార సారథి’ కనుసన్నల్లో ముందుకుపోతున్నారన్నది, కమ్మసంఘం నాయకుల ఆరోపణ.

లారీ కదలాలంటే.. కప్పం కట్టాలంతే!

ఇక ఉమ్మడి ప్రకాశంలోనూ ఆ టీడీపీ రాష్ట్రస్థాయి ‘అద్దంకి పెద్ద’ హవా ఇంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన టీడీపీ నాయకత్వానికి అత్యంత సన్నిహితుడిగా మారారని, నెంబర్ వన్, నెంబర్ టూలకు ఆ ‘అద్దంకి పెద్ద’ ఎంత చెబితే అంత అన్న ప్రచారం పార్టీ వర్గాల్లో బాహాటంగానే నడుస్తోందట. చూసేందుకు చాలా సాత్వికంగా, వివాదరహితుడిగా కనిపించే ఆ ‘అద్దంకి పెద్ద’ ఆదేశాలతో, ఆయన ‘ఆత్మ’ గాలికంటే వేగంగా పనులు పూర్తిచేస్తుంటారన్న ప్రచారం ఉంది. దర్శిలో జరిగే అన్ని దందాలకూ ఆయనే ‘సారథి’ అన్నది బహిరంగమేనని, తమ్ముళ్లు కుండబద్దలు కొడుతున్నారు. బియ్యం, మైనింగ్, గ్రావెల్‌లో ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనమట. ‘అద్దంకి పెద్ద’ కూడా, అన్ని వ్యవహారాలూ ఆయనే అప్పగించారన్నది తమ్ముళ్ల ప్రచారం. అయితే అంతర్గతంగా అద్దంకి ప్రముఖుడికి తెలియకుండా, ఆయన ఆత్మ ఏ పనీ చేయరని, పేరు మాత్రమే ఆయనదన్నది పార్టీలోని మరో వర్గం వాదన.

తాజాగా బల్లికురవకు చెందిన టీడీపీ నాయకులు మైనింగ్ రాళ్లను తెలంగాణకు తరలించారట. అయితే సదరు ‘అద్దంకి ఆత్మ’కు తెలియకుండా, ఆయనకు కప్పం కట్టకుండానే ఆ లారీలు పంపించారట. ఆ విషయం తెలిసిన ‘అద్దంకి ఆత్మ’ ఏపీ బోర్డర్ దాటిన ఆ నాలుగు లారీలను పోలీసులకు పట్టించారట. దానితో ‘అద్దంకి పెద్ద’ను కలసిన బల్లికురువ టీడీపీ నాయకులు, తమ లారీలు విడిపించాలని కోరారు. అందుకాయన.. మీరు అవన్నీ నా ఆత్మతో మాట్లాడుకోమని చెప్పి వెళ్లిపోవడంతో, బల్లికురవ టీడీపీ నేతలు అగ్గిరాముళ్లయ్యారు. ‘ఈసారి ఎన్నికల్లో మేం కూడా ఏం చేయాలో అదే చేస్తాంలెమ్మని’ హెచ్చరించి వచ్చేశారట.

అయితే అద్దంకి నియోజకవర్గం నుంచి వెళ్లే ప్రతి క్వారీ, మైనింగ్ లారీలు ‘అద్దంకి ఆత్మ’కు కప్పం కట్టితీరాల్సిందే. లేకపోతే లారీ ఒక అడుగుకూడా ముందుకు కదలదు. ఆ ప్రకారంగా ఒక్కో లారీకి 15 వేలు కప్పం చెల్లించాలి. ఆరకంగా ప్రతిరోజు సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి వెళ్లే లారీలు, 50 నుంచి 70 వరకూ ఉంటాయని చెబుతున్నారు. అంటే ‘అద్దంకి పెద్ద’ కు లారీల ద్వారా వచ్చే ఆదాయం, ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక మార్టూరు నుంచి వెళ్లే లారీకి 25 వేల రూపాయల చొప్పున ‘పరుచూరు పార్టీ పెద్ద’కు.. కప్పం రూపంలో వెళుతుందని, ఇది పార్టీ నాయకత్వానికి తెలియదంటే అది అమాయకత్వమే అవుతుందని తమ్ముళ్లు చెబుతున్నారు. ఈ ఇద్దరికీ ఒక కీలకనేత వద్ద పనిచేసే పీఏ అండదండలున్నాయని.. అద్దంకి,పరుచూరు నియోజకవర్గాల తమ్ముళ్లు బహిరంగంగానే చర్చించుకోవడం విశేషం.

తమ్ముళ్లకు మాత్రం కేసులు, జైళ్లు!

ఈవిధంగా ‘అన్ని స్థాయిల్లో’ ప్రత్యర్ధి పార్టీతో లాలూచీ వ్యాపార-రాజకీయాలు కొనసాగుతుంటే.. ఐదేళ్లు క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను భుజం పుండ్లు పడేలా మోసి, హత్యలకు గురయి, ఆస్తులు పోగొట్టుకుని, కేసులు, జైళ్ల చుట్టూ తిరుగుతున్న సగటు కార్యకర్త మాత్రం.. ‘పార్టీపిచ్చి’లో పడి , కుటుంబాలు కోల్పోయి సర్వం నష్టపోతున్నాడన్న ఆవేదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కళ్లు తెరిపిస్తున్న కార్టూన్

వైసీపీ అధినేత భారతీరెడ్డిపై అసభ్యకర పోస్టు పెట్టి, పోలీసులతో దేశద్రోహిలా ముఖానికి ముసుగువేయించుకుని, జైలుకు వెళ్లిన గుంటూరు టీడీపీ కార్యకర్య చేబ్రోలు కిరణ్ ఘటన నేపథ్యంలో.. సోషల్‌మీడియా సైనికులు పెట్టిన ఒక ఆసక్తికరమైన కార్టూన్, పసుపు సైనికులకు కనువిప్పు కలిగించేలా మారింది. వైసీపీ నేత- టీడీపీలో చేరిన పాత వైసీపీ నేత ఇద్దరూ కలసి, ‘అసలు టీడీపీ కార్యకర్తను’ కాళ్లకింద తొక్కి దాడిచేస్తున్న ఆ కార్టూన్.. ప్రస్తుతం టీడీపీ సోషల్‌మీడియాలో సగటు కార్యకర్తను ఆలోచింపచేస్తోంది.

1 COMMENTS

LEAVE A RESPONSE