Suryaa.co.in

Features

అలుపెరుగని పోరాట యోధుడు గద్దర్

ప్రజా వాగ్గేయ కారుడు, ప్రజా కవి, కళాకారుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇకలేరు. సమస్యలపై గొంతెత్తిన ‘ప్రజా యుద్ధనౌక’ దివికేగింది. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్‌‌కు చెందిన లచ్చమ్మ, శేషయ్య దంపతులకు 1949లో ఆయన జన్మించారు.

కొన్ని రోజుల కిందట ఆయన గుండె సంబంధిత రుగ్మతతో బాధపడుతూ అమీర్‌పేటలోని ఆపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయన గుండెకు బైపాస్ సర్జరీ నిర్వహించారు. కోలుకుంటున్నానని ప్రకటన కూడా విడుదల చేశారు గద్దర్. కానీ, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అశేష అభిమానులను శోకసంద్రంలో ముంచారు.

దాదాపు యాభై వసంతాలు పైగా ప్రజలతో మమేకమై ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన మాట పాట ద్వారా ఊపిరి నింపిన విప్లవకారుడు. నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం ఇలా అన్ని ఉద్యమాలలో తన పాటలతో ప్రజా జీవితాలను ప్రభావితం చేశారు. ప్రభుత్వాలను కదిలించారు.

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావ్ కొడకో నైజాము సర్కరోడా అని రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కొరకు గళమెత్తారు. 1980 లో చాల ఇళ్లల్లో భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న పాట, మదన సుందరి, భారత దేశం భాగ్య సీమ రా సకల సంపదలు గల్ల దేశమున దరిదరమెట్లుందో నాయన, నీతి గల్ల మన దేశంలో న అవినీతేందుకు పెరిగిపోయార పాట .

చుండూరు దళితుల ఊచకోత వ్యతిరేకంగా, జ్ఞానం ఒక్కడి సొత్తు కాదన్న అది సర్వజాతుల సంపదోరన్న అనే పాట తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా..’ పాట ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. నిజామాబాద్, హైదరాబాద్‌లో గద్దర్ విద్యాభ్యాసం చేశారు. 1975లో కొద్ది కాలం కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా.. పోరు తెలంగాణమా’ పాట ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమం అప్పటిదాకా ఒక ఎత్తు. ఆ పాట తర్వాత మరొక ఎత్తుగా కొనసాగింది. గద్దర్ ఆటా పాట కోట్లాది మందిని కదిలించింది. ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. ‘అమ్మా తెలంగాణమా..’, ‘బండెనక బండి కట్టి..’, ‘భద్రం కొడుకో..’, ‘మదనాసుందరి’, ‘అడవి తల్లికి వందనం’ ఇలాంటి వందలాది పాటలతో ప్రభావం చూపారు గద్దర్. జనం గోసలను తన పాటల ద్వారా వినిపించారు. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు’కు నంది అవార్డుకు ఎంపికయ్యారు గద్దర్. కానీ, నంది అవార్డును స్వీకరించేందుకు తిరస్కరించారు.

పీపుల్స్‌ వార్‌, మావోయిస్టు ఉద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో తన గొంతు వినిపించారు గద్దర్. తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. అమరవీరుల కుటుంబాలకు చేయూత నిచ్చేవారు. పీపుల్స్ వార్ పార్టీ క్యాడర్ రిక్రూట్మెంట్ తన పాటల ద్వారా ప్రభావితం అయింది.

చాల మంది సానుభూతిపరులు, పౌర ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, దళిత బహుజన సంఘాలలో సాంస్కృతిక విప్లవం తెచ్చిన వ్యక్తి. అయన పాటలతో ఉత్తేజమై ఎందరో నక్సల్ ఉద్యమంలో చేరారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. నాడు మరణం అంచుల దాకా వెళ్లి, ప్రాణాలతో బయటపడ్డారు. నాటి నుంచి ఆయన శరీరంలో ఒక బుల్లెట్ అలాగే ఉండిపోయింది.

ఆ బుల్లెట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స చేస్తే, ఆయన ప్రాణాలకే ప్రమాదమని అలాగే వదిలేశారు వైద్యులు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావజాల వ్యాప్తి కోసం ఊరురా తిరిగి బుర్రకథలతో ప్రచారం చేసేవారు. అలా ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి. నరసింగరావు.. భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు.

1971లో బి. నరసింగరావు ప్రోత్సాహంతో గద్దర్ ‘ఆపర రిక్షా’ పేరుతో తన మొదటి పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. రాజ్యాంగ సంక్షోభానికి వ్యతిరేకంగా, సామాజిక తెలంగాణ స్వప్నం నెరవేరలేదని, ఎంతో కాలంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం కొందరి చేతుల్లో ఉందని వాపోయేవాడు.

గత కొంత కాలంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పట్ల వల్లమాలిన అభిమానం. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాల్గొన్నారు, పౌర ప్రజా సంఘాలతో మమేకమై భారత్ బచావో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఉరేగించినా, ఢిల్లీ లో దేశానికి పతకాలు సాధించిన రేజిలర్లు పై లైంగిక వేధింపులు జరిగినా, బిల్కిస్ బాను రేప్ కేసులో నిందితులను క్షమాభిక్ష ప్రసాదించినా మాకు సంబందించిన విషయాలు కావని మౌనం పాటిస్తున్న తెలుగుదేశం, జనసేన, వైఎసార్సీ చివరికి గద్దర్ ను భౌతికంగా నిర్ములించేందుకు దాడులు జరిపిన పార్టీలు సైతం గద్దర్ ని కొనియాడుతున్నారు.

అలాగే ఒక విప్లవకారుడి చివరి అంతిమ యాత్రలో ప్రభుత్వ లాంఛనాలతో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అరుదైన వ్యక్తి గద్దర్. ప్రాంతాల మధ్య అంతరాలను వెనుకుబాటు తనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఆరు నెలల కింద రాయలసీమ ప్రజా సంఘాల వేదిక లో ప్రసంగించారు. నీళ్లు నిధులు సామాజిక సమగ్రత, లోకిక ప్రజాతంత్ర ఉద్యమాలకు బాసటగా నిలిచారు. రాయలసీమ పట్ల ప్రత్యేక అభిమానం.

ముప్పై సంవత్సరాల క్రిందట మహాబోధి విద్యాలయం ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు విద్యాప్రదానం చేశారు. పాఠశాలలో తల్లితండ్రులు కోల్పోయిన వారికి, సింగిల్ పేరెంట్ పిల్లలకు ఉచిత విద్య అందించారు. గుమ్మడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు నేలపైన ప్రజాకళలున్నంత వరకు గద్దర్ పాట సజీవంగా ఉంటుంది.

డా. యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

 

LEAVE A RESPONSE